టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నార్కట్పల్లి మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డి ఏకైక కుమారుడు దినేశ్రెడ్డి మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మంగళవారం సాయంత్రం నల్లగొండకు కారులో వస్తూ తొండుపల్లి సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న కంటెయినర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఉస్మానియాలో పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులు ఆయన నేత్రాలను దానం చేశారు. ఆరు నెలల కిందే దినేశ్కు వివాహం జరిగింది. దినేశ్ మరణవార్తతో దిగ్భ్రాంతి చెందిన జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి హుటాహుటిన ఉస్మానియా దవాఖానకు చేరుకుని రేగట్టె కుటుంబసభ్యులను ఓదార్చారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు మల్లికార్జున్రెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు.
నల్లగొండ, జూలై 19 : టీఆర్ఎస్ నాయకుడు, నార్కట్పల్లి మాజీ ఎంపీపీ రేగట్టె మలికార్జున్రెడ్డి ఏకైక కుమారుడు రేగట్టె దినేశ్రెడ్డి(27) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డు మీద తొండుపల్లి సమీపంలో ఆగిఉన్న గూడ్స్ వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొనడంతో దినేశ్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహించగా.. తల్లి దండ్రులు దినేశ్ కండ్లు దానం చేశారు.
నార్కట్పల్లి మండలం చెర్వుగట్టుకు చెందిన రేగట్టె మల్లికార్జున్రెడ్డి నల్లగొండలోని న్యూవీటీ కాలనీలో నివాసముంటున్నారు. ఆరు నెలల క్రితం కొడుకు దినేశ్రెడ్డి వివాహాన్ని హైదరాబాద్కు చెందిన డీఎస్పీ జగన్నాథరెడ్డి కుమార్తెతో జరిపించారు. దినేశ్రెడ్డి గత నెల 1వ తేదీన నల్లగొండలోని హైదరాబాద్రోడ్డులో యజ్డీ షోరూమ్ను ప్రారంభించాడు. దినేశ్రెడ్డి భార్యతో కలిసి నాలుగు రోజుల క్రితం కేరళ టూర్కు వెళ్లాడు. సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరుకున్నారు. రాత్రి నార్సింగ్లోని తన అత్తగారింట్లోనే ఉన్నారు. మంగళవారం ఉదయం భార్యతో కలిసి షాపింగ్కు వెళ్లివచ్చినట్లు తెలిసింది. మధ్యాహ్న భోజనం అనంతరం ఒక్కడే తన వెర్నాకారును నడుపుకుంటూ నార్సింగ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా నల్లగొండకు బయల్దేరాడు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఔటర్పైన శంషాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని తొండుపల్లి సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. డ్రైవర్ సీటు వైపునే ముందున్న వాహనం బలంగా తాకడంతో కారు పల్టీ కొట్టింది. దాంతో తీవ్రంగా గాయపడిన దినేశ్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు శంషాబాద్ పోలీసులు తెలిపారు.
అలసట.. నిద్రలేమితోనే..
నాలుగు రోజులుగా టూర్లో అలిసిపోవడంతో పాటు నిద్ర లేమితోనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దినేశ్రెడ్డి మరణవార్తతో ఆయన తల్లిదండ్రులతో పాటు భార్య తీవ్ర దిగ్భ్రాంతికి లోనై సొమ్మసిల్లి పోయారు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. తీవ్ర దుఖంలోనూ కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు దినేశ్రెడ్డి కండ్లను దానం చేశారు. మృతదేహాన్ని మంగళవారం రాత్రి స్వగ్రామమైన చెర్వుగట్టుకు తరలించారు. బుధవారం చెర్వుగట్టులో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దినేశ్రెడ్డి మరణవార్త తెలిసిన రేగట్టే బంధువులు, మిత్రులు ఉస్మానియాకు తరలిరావడంతో ఆస్పత్రి ఆవరణలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో మల్లికార్జున్రెడ్డి దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఉస్మానియాకు మంత్రి జగదీశ్రెడ్డి
ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మల్లికార్జున్రెడ్డి దంపతులతో పాటు దినేశ్రెడ్డి సతీమణిని ఓదార్చారు. పార్డీవదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దినేశ్రెడ్డి మృతి ఆ కుటుంబానికి తీరనిలోటని, వారికి మనోధైర్యం కల్పించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. శంషాబాద్ డీసీపీతో మాట్లాడుతూ ప్రమాద కారణాలపై ఆరా తీసారు.
సంతాపం తెలిపిన ప్రముఖులు
దినేశ్రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మల్లికార్జున్రెడ్డి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని ప్రార్ధించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఢిల్లీలో ఉన్న రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దినేశ్రెడ్డి మృతి తీరనిలోటని పేర్కొన్నారు. నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఉస్మానియా ఆస్పత్రిలో దినేశ్రెడ్డి పార్ధీవదేహాన్ని చూసి కంటతడిపెట్టారు. రేగట్టె కుటుంబసభ్యులను ఓదారుస్తూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, షీప్స్ అండ్ గోట్స్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, టీఆర్ఎస్ నేత కంచర్ల కృష్ణారెడ్డి, జిల్లా శంకర్ తదితరులు ఉస్మానియాకు చేరుకొని రేగట్టే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దినేశ్రెడ్డి మృతి వార్త తెలిసిన టీఆర్ఎస్తో పాటు వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.