నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ) : మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు మరింత ఆదరణ పెరుగుతున్నది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో త్వరలో ఉప ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన పొరపాటుకు తావివ్వకుండా ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించుకోవాలన్న పట్టుదల స్థానికుల్లో వ్యక్తమవుతున్నది. దీంతో పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లోకి వచ్చి చేరుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలతో పాటు టీజేఎస్ పార్టీల నుంచి గులాబీ పార్టీలోకి చేరుతున్నారు. పక్షం రోజుల నుంచి మొదలైన వలసలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. ఆయా మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, పార్టీల నేతలు, కార్యకర్తలు గులాబీ కండువాలు కప్పుకుంటున్నారు. మునుగోడులో ప్రజా దీవెన సభ నిర్వహణ తేదీ ప్రకటించిన నాటి నుంచి చేరికలు ఊపందుకున్నాయి. సభ కోసం మండలాల వారీగా ఇన్చార్జిలుగా పర్యటిస్తున్న సమయంలోనే వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి క్యూ కట్టారు. నేటికి ఆ చేరికలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి.
టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనపై స్పష్టత రాకపోవడంతో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి అన్ని తానై వ్యవహరిస్తున్నారు. జిల్లా ఎన్నికల ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్తోపాటు జిల్లా ప్రజాప్రతినిధుల సహకారంతో మంత్రి జగదీశ్రెడ్డి మునుగోడులో దూకుడును కొనసాగిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై విశ్వాసం కనపరిచే వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఉన్న స్థానిక నేతలతో సంప్రదింపులు చేస్తూనే కొత్తగా పార్టీలోకి వస్తున్న వారిని కలుపుకొనిపోయేలా చూస్తున్నారు. దీంతో నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్ఎస్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది. కాగా గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత కూడా టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని విశ్వసిస్తూ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరుతూ వచ్చారు. చండూర్ జడ్పీటీసీ , మున్సిపల్ చైర్మన్, మర్రిగూడ ఎంపీపీ లాంటి ప్రముఖులు కూడా టీఆర్ఎస్లోకి వచ్చారు. వీరికి తోడు తాజాగా కొద్ది రోజులుగా పెద్దసంఖ్యలో గులాబీ పార్టీలోకి వస్తున్నారు. పార్టీ నేతల అంచనా ప్రకారం ఇప్పటివరకు 30మందికి పైగా సర్పంచులు, 10 మంది వరకు ఎంపీటీసీ సభ్యులతోపాటు పెద్దసంఖ్యలో ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మండల కోఆప్షన్ సభ్యులు టీఆర్ఎస్లో చేరారు. వీరు కాకుండా కాంగ్రెస్, బీజేపీల నుంచి కూడా గ్రామశాఖ అధ్యక్షులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు గులాబీ కండువాకప్పుకొంటున్నారు.
మునుగోడు అభివృద్ధితోపాటు కొత్తగా చేరుతున్న వారి భవిష్యత్కు టీఆర్ఎస్ పార్టీ నుంచి జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి భరోసా కల్పిస్తుండడంతో గులాబీ కండువాలు కప్పుకొనేందుకు పోటీ పడుతున్నారు. ఇక చేరికలకు తోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతునిచ్చేందుకు కమ్యూనిస్టులు ముందుకు వస్తుండడం మరింత సానుకూల వాతావరణం కనిపిస్తున్నది. ఇప్పటికే సీపీఐ బహిరంగంగానే ఈ నెల 20న మునుగోడు ప్రజాదీవెన సభలోనే టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తామని ప్రకటించింది. ఇక సీపీఎం కూడా ఇప్పటికే సూత్రప్రాయంగా టీఆర్ఎస్ను బలపర్చాలని నిర్ణయించింది. గతంలో ఇక్కడి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీపీఐతో పాటు ఆ గెలుపులో భాగస్వామిగా ఉన్న సీపీఎం కూడా టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడంతో అంతటా నూతనోత్సాహం కనిపిస్తున్నది. ఇక మరోవైపు ఇన్నాళ్లు రాజగోపాల్రెడ్డి చేష్టలను భరిస్తూ వచ్చిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలకు ప్రస్తుతం ఆయన తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. సొంత కాంట్రాక్టుల కోసం రాజకీయంగా పెంచి పెద్ద చేసిన కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తూ రాజగోపాల్రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. దీంతో ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా మునుగోడులో టీఆర్ఎస్ను గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు.
నాంపల్లి, ఆగస్టు 26 : నాంపల్లి మండలంలోని ముష్టిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి లక్ష్మయ్య, మరో 50 మంది కార్యకర్తలు శుక్రవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు పాల్గొన్నారు.
మునుగోడు: రాష్ట్రంలో ప్రభు త్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని పులిపలుపులలో కాంగ్రెస్కు చెందిన ముఖ్య నాయకులతో పాటు 30 కుటుంబాలు శుక్రవారం మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడారు. నియోజకవర్గంలో 60ఏండ్లుగా ఫ్లోరోసిస్ను పెంచి పోషించిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని విమర్శించారు.ఫ్లోరోసిస్ను రూపుమాపిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. సీఎం కేసీఆర్ మునుగోడుకు చేసిన మేలుని ఎప్పటికీ మరువద్దని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీకి కోవర్టుగా వ్యవహరించారని, అందుకే సొంత పార్టీపైనే విమర్శలు చేశారని దుయ్యబట్టారు. ప్రజలు, అభివృద్ధి కోసం కాకుండా తన వ్యక్తిగత కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్రెడ్డి బీజేపీ లో చేరారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల వల్లే రాజగోపాల్రెడ్డికి కాంట్రాక్టులు వచ్చాయని అన్నారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి, సర్పంచ్ పందుల మారయ్య, ఎంపీటీసీ బొల్గూరి లింగయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు కంభంపాటి సైదు లు, కో-ఆప్షన్ సభ్యుడు రఫీక్, బొల్గూరి నర్సింహ, శంకర్, రాము పాల్గొన్నారు.