నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో స్వరాష్ట్ర సాధన కోసం సాగిన ఎన్నో చారిత్రక ఘట్టాలకు అడ్డగా నిలిచింది పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ. సమైక్య రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాలపై ఉద్యమనేత, తెలంగాణ ప్రదాత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పూరించిన పోరు శంఖంలో జిల్లా ప్రజలు వెన్నంటి నడిచారు. జిల్లా వేదికగా తొలి ప్లీనరీ నుంచి కేసీఆర్తోపాటు మిగతా ప్రజాప్రతినిధుల రాజీనామాల మొదలు పాదయాత్రలు, బస్సుయాత్రలు, పల్లెనిద్రలు సాగాయి. 2014లో రాష్ట్ర ఏర్పాటు సమయంలో సూర్యాపేటలో సమరభేరి సభ అట్టహాసంగా జరిగింది. ఉద్యమ సమయంలో రాష్ట్రం కోసం తొలిగా ప్రాణాలర్పించిన కాసోజు శ్రీకాంతాచారి కూడా ఇక్కడి వాడే కావడం గర్వకారణమే. ఇక ఇదే సమయంలో ఎందరో సామాన్యులు సైతం దాడులు, దౌర్జన్యాలు, కేసులు, నిర్బంధాలు ఎదుర్కొంటూ కేసీఆర్ అడుగుజాడల్లో నడిచి తమదైన ముద్రను వేశారు. కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా విజయవంతం చేయడమే లక్ష్యమే జిల్లా ప్రజలు అగ్రభాగంలో నిలిచారు. ఇక రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా కేసీఆర్ నాయకత్వానికి జై కొడుతూ జిల్లా ప్రజలు వెంట నడుస్తున్నారు. దీంతో కేసీఆర్ సీఎం అయ్యాక నల్లగొండ జిల్లాలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. సాగు, తాగునీటితోపాటు విద్య, వైద్య రంగాల్లో ఎన్నో విజయాలు సొంత చేసుకుంది. వెనుకబడిన జిల్లా నుంచి సమగ్రాభివృద్ధి దిశగా ఉమ్మడి నల్లగొండ జిల్లా అడుగులు వేస్తున్నది. ఈ తరుణంలో 21 సంవత్సరాల టీఆర్ఎస్ ఇక నుంచి భారత్ రాష్ట్ర సమితిగా అవతరిస్తున్న సందర్భంగా జిల్లాలో టీఆర్ఎస్ ప్రస్థానంపై ప్రత్యేక కథనం..
2001లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ నేతృత్వంలో పురుడుపోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి నేడు బీఆర్ఎస్గా అవతరించింది. ఇన్నేండ్ల ప్రస్థానంలో 13 ఏండ్లు ఉద్యమ పార్టీగా ఆ తర్వాత పాలన పార్టీగా ఎన్నో చారిత్రక ఘట్టాలకు టీఆర్ఎస్ వేదికగా నిలిచింది. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు ఆరున్నర లక్షల మంది సభ్యులతో ఎదురులేని శక్తిగా ఆవిర్భవించింది. సంస్థాగత నిర్మాణ పరంగానూ పటిష్టమైన పార్టీగా అగ్రభాగంలో నిలిచింది. ప్రతీ ఆవాసా ప్రాంతానికి, మారుమూల తండాకు, ప్రతీ బస్తీ, గల్లీకి సైతం గులాబీ జెండా విస్తరించింది.
2014 తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్దే విజయబావుటా. 2014లో ఆరు ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానంలో విజయకేతనం ఎగురవేసిన పార్టీ 2018 ఎన్నికల్లోనూ 9 ఎమ్మెల్యే స్థానాల్లో విజయపతాకం ఎగురవేసింది. తర్వాత జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని భారీ మెజార్టీతో కైవసం చేసుకుంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం వచ్చే నెల 3వ తేదీన జరిగే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ విజయదుందుభీ మోగించేందుకు సిద్ధమవుతుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీ(టీ)ఆర్ఎస్కు ఎదురుండబోదని చాటి చెప్పేందుకు ఊవ్విళ్లూరుతున్నది. 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో కీలక సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
గత ఏప్రిల్లో జరిగిన పార్టీ ప్లీనరీలోనే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి బలపరుస్తూ మాట్లాడారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెన్నంటి నడుస్తున్న జగదీశ్రెడ్డికి ఆ అవకాశం కల్పించడం విశేషం. ఆ రోజు తీర్మానాన్ని బలపరుస్తూ జగదీశ్రెడ్డి మాట్లాడిన మాటలు..
“కేసీఆర్ ఓ శక్తి. సిద్దిపేట నుంచి బయల్దేరి రాష్ర్టాన్ని సాధించారు. ఇప్పుడు భారతమాత మిమ్మల్ని కోరుకుంటుంది. దేశంలో రాముడి పేరుతో రాక్షస పాలన సాగుతోంది. దేశాన్ని మధ్యయుగాల నాటికి తీసుకెళ్లే దుర్మార్గపు పాలకులు ఉన్నారు. దీని నుంచి విముక్తి చేయడానికి కేసీఆర్ ముందుకు నడవాలని దేశం కోరుతుంది. తెలంగాణ ప్రజలు మీ వెనకాల ఉన్నారు. దేశం మీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నది. మీకు మంచి ఆరోగ్యం కూడా ఉంది. మా అందరి ఆయుష్సుతో పాటు టీఆర్ఎస్ బలాన్ని తీసుకుని వెళ్లండి. రాష్ట్రంలోని బూత్ లెవల్ నాయకుల బూత్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లు కేసీఆర్ కాలిగోటికి కూడా సరితూగరు. దేశ ప్రజల కోసం మీ వెంట నడిచేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం.. కేసీఆర్ గారూ”.