నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి11 (నమస్తే తెలంగాణ) : వందలాది తండాలకు గ్రామపంచాయతీ హోదా కల్పించి అభివృద్ధికి బాటలు వేసిన రాష్ట్ర శాశ్వత వనరులను సమకూర్చడంపైనా దృష్టి సారించింది. పల్లె ప్రగతిలో భాగంగా ఇప్పటికే వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్లు వంటివి నిర్మించగా, తాజాగా పాలనా సౌలభ్యం కోసం గ్రామపంచాయతీలకు నూతన భవనాలను మంజూరు చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 107 గిరిజన గ్రామపంచాయతీలకు పక్కా భవనాలు సమకూరుస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో పంచాయతీ భవనానికి రూ.20లక్షల చొప్పున మొత్తం 20.40కోట్ల రూపాయలు విడుదల చేసింది. ప్రభుత్వ ప్రకటనపై తండాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సమైక్య పాలనలో సాధారణ గ్రామ పంచాయతీలకే శాశ్వత భవనాలు నిర్మించడం గగనంగా ఉండేది. కానీ, నేడు స్వరాష్ట్రంలో 500 జనాభా పైగా ఉన్న ప్రతి తండాను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయడమే కాకుండా వాటి అభివృద్ధిపైనా ప్రభుత్వం ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూనే ఉంది. నూతనంగా ఏర్పడిన ఎస్టీ పంచాయతీల్లో గిరిజనులే పాలకవర్గంలో కీలకం కాగా, తమ తండాలను తీర్చిదిద్దుకునే బాధ్యతను వారే భుజానికెత్తుకున్నారు. వీరికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర సర్కార్ ఎప్పటికప్పుడు చేయూతనందిస్తున్నది. ఇప్పటికే ఎస్టీ పంచాయతీల్లో సైతం మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం క్రమం తప్పకుండా నిధులు ఇస్తున్నది. ఇక ఈ నూతన పంచాయతీలు సైతం మరింత పటిష్టంగా పాలన సాగించేందుకు అవసరమైన పంచాయతీ భవనాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం1,216 నూతన ఎస్టీ గ్రామ పంచాయతీలకు శాశ్వత పాలకవర్గ భవనాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్టీఎస్డీఎఫ్) నుంచి మొత్తం రూ.243.20 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
ఉమ్మడి జిల్లాలో 107 కొత్త భవనాలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 107 ఎస్టీ గ్రామాలకు పంచాయతీ భవనాలు మంజూరయ్యాయి. ఇందుకోసం 21.40 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ జిల్లాలో 48, సూర్యాపేటలో 35, యాదాద్రి భువనగిరి జిల్లాలో 24 ఎస్టీ గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నూతన పంచాయతీ భవనాలన్నింటికీ ఓకే తరహా నమూనాను సైతం పంచాయతీరాజ్ విభాగం రూపొందించింది. దీని ప్రకారమే ఒక్కో పంచాయతీ భవనాన్ని 20 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు.
మండలాల వారీగా పరిశీలిస్తే నల్లగొండ జిల్లాలో కొండమల్లేపల్లిలో 9, తిరుమలగిరి(సాగర్)లో 8, దేవరకొండలో 5, చందంపేట, దామరచర్ల, మిర్యాలగూడల్లో 4 చొప్పున, నేరేడుగొమ్ములో 3, చింతపల్లి, నాంపల్లి, పీఏపల్లి, త్రిపురారంలో 2 చొప్పున, పెద్దవూర, గుర్రంపోడు, డిండి మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 48 ఎస్టీ గ్రామాలకు భవనాలు మంజూరయ్యాయి. ఇక సూర్యాపేట జిల్లాలో 35 మంజూరవగా.. తిరుమలగిరిలో 5, ఆత్మకూర్(ఎస్), చివ్వెంల, తుంగతుర్తిలో 4 చొప్పున, మోతె, మఠంపల్లిలో 3 చొప్పున, నూతనకల్, మద్దిరాల, అనంతగిరిలో 2 చొప్పున, సూర్యాపేట, జాజిరెడ్డిగూడెం, పాలకవీడు, నేరేడుచర్ల, పెన్పహాడ్, మేళ్లచెర్వులో ఒక్కొక్కటి చొప్పున భవనాలు మంజూరయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో తుర్కపల్లి, బొమ్మలరామారంలో 6 చొప్పున, నారాయణపురం, బీబీనగర్లో 4 చొప్పున, ఆలేరు, చౌటుప్పల్, రాజాపేట, యాదగిరిగుట్టలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 24 ఎస్టీ గ్రామాలకు పంచాయతీ భవనాలు మంజూరయ్యాయి. ఈ పంచాయతీల్లో శాశ్వత భవనాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై ఆయా ఎస్టీ పాలకవర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారనడానికి ఇది మరో తార్కాణమని పేర్కొంటున్నారు.
కొత్త భవనాల నిర్మాణం సంతోషకరం
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడం మాకు వరంలా మారింది. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో తండాల్లో పంచాయతీల భవనాల నిర్మాణానికి రూ.20 లక్షలు కేటాయించడం సంతోషంగా ఉంది. గ్రామ పంచాయతీలకు పక్కా భవనాల కోసం నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– బానోతు అనితాశ్రీను, జామ్లాతండా, మఠంపల్లి
మా తండాలో మాదే అధికారం
మా తండాలో మాకే అధికారం కల్పించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్. తండాలను నూతన పంచాయతీలుగా చేయడంతోపాటు నూతన భవనాలు కూడా మంజూరు చేయడం ఆనందంగా ఉంది. గత ప్రభుత్వాల కంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలతోపాటు గిరిజనులకు ప్రాధాన్యమిస్తుంది. గిరిజనులమంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
–దేవుడునాయక్, సర్పంచ్, బట్టువెంకన్నబావితండా, తిరుమలగిరి(సాగర్)
గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు
ఎస్టీ గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.20 లక్షలు కేటాయించడాన్ని హర్షిస్తున్నా. స్వాతంత్యం వచ్చి ఎండ్లు గడుస్తున్నా గత ప్రభుత్వాలు తండాలను పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచలేదు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు గిరిజన తండాలను నూతన పంచాయతీలుగా గుర్తించడంతోపాటు పంచాయతీ భవనాలకు నిధులు కేటాయించడం అభినందనీయం. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో తండాలకు మహర్దశ పట్టింది.
–ధరావత్ సరియానాయక్, సర్పంచ్, మైలారంకిందితండా, బొమ్మలరామారం