సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 22 : ఓట్ల పేరుతో తండాల్లోకి బీజేపీ దొంగలు వస్తున్నారని, వారిని నమ్మితే మోసపోతామని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మండలంలోని బడితండా, రాధానగర్ తండా, సీత్య తండాల్లో శనివారం ఆమె ప్రచారం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్తోనే గిరిజనుల బతుకులు మారుతాయని, ఆయన పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని అన్నారు. దొంగలను నమ్మితే మోసపోతామని, అభివృద్ధిని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్రెడ్డికి ఉప ఎన్నికలో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తూ ప్రతి గడపకూ అందిస్తున్నారని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వమూ గిరిజనులను పట్టించుకోలేదన్నారు.
గిరిజనులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో గిరిజన బంధును ప్రకటించినట్లు మంత్రి తెలిపారు. 10 శాతం రిజర్వేషన్ ఇవ్వడంతో ఎంతో మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర మంత్రులే చట్టసభల్లో పొగిడారని గుర్తు చేశారు. బృహత్తర పథకాలతో కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న సీఎం కేసీఆర్కు గిరిజనులు మద్దతుగా నిలువాలన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేసిన కమిటీకి తానే చైర్పర్సన్గా ఉన్నానని, తప్పకుండా పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. వైస్ ఎంపీపీ రాజునాయక్, మాజీ సర్పంచ్ బిచ్చానాయక్, చండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జగ్గురాంనాయక్, నాయకులు రాజునాయక్, రాజేశ్నాయక్, కిషన్నాయక్, దూదియానాయక్, రఘునాయక్, బిచ్చునాయక్, కురవి జడ్పీటీసీ బండి వెంకట్రెడ్డి, బయ్యారం పీఏసీఎస్ చైర్మన్ మధుకర్రెడ్డి, దాట్ల సర్పంచ్ కొమ్మినేని రవీందర్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.