– అధికారులతో కాంట్రాక్టర్ కుమ్మక్కు
– 200 చెట్లకు పైగా నరికివేసిన వైనం
– గుట్టుచప్పుడు కాకుండా బొగ్గు బట్టీలకు తరలింపు
నకిరేకల్, ఫిబ్రవరి 03 : తెలంగాణను పచ్చదనంగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవాల పేరుతో కోట్లాది నిధులు ఖర్చు చేస్తుంది. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా కాసుల కోసం కక్కుర్తి పడి కాంట్రాక్టర్లతో కుమ్మక్కై బాధ్యతారాహిత్యంగా వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే అధికారులతో కలిసి కాంట్రాక్టర్లు లక్షల విలువైన చెట్లను, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగితే వాటిని సైతం నరికి బొగ్గు బట్టీలకు తరలిస్తున్నారు. అయినా ఇవేమీ పట్టనట్లు అధికారులు చోద్యం చూడడం పలు అనుమానాలకు తావిస్తోంది.
నకిరేకల్ మండలంలో లక్షల విలువైన వృక్ష సంపదను కొల్లగొట్టి అధికారులతో కలిసి కాంట్రాక్టర్లు అక్రమ సంపాదనకు తెర లేపుతున్నారు. మండలంలోని నెల్లిబండ గ్రామంలో నుండి అడవి బొల్లారం మీదుగా చెరువు అన్నారం ఎక్స్ రోడ్డు వరకు పంచాయతీ రాజ్ విభాగం ఆధ్వర్యంలో బీటీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. అయితే రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు తొలగించేందుకు సదర్ కాంట్రాక్టర్ అటవీ శాఖ నుండి ఎటువంటి అనుమతి తీసుకోలేదు. పంచాయతీరాజ్ ఏఈ గాని, డీఈ గాని, ఎస్ఈ గాని అటవీ శాఖకు వినతిపత్రం సమర్పించాల్సి ఉంది. కానీ అనుమతి తీసుకోకుండానే 200 చెట్లకు పైగా నరికివేసి మాయం చేశారు. అటవీ శాఖ నిబంధనల ప్రకారం ఒక చెట్టును తొలగిస్తే వాటి స్థానంలో ఐదు చెట్లు నాటుతామని లిఖిత పూర్వకంగా ఒప్పందం చేసిన తర్వాతే చెట్లను తొలగించాల్సి ఉంది.

Cutting down trees : లక్షల వృక్ష సంపద బొగ్గు పాలు !
సదరు కాంట్రాక్టర్ పంచాయతీ రాజ్ అధికారులతో కుమ్మక్కై లక్షల విలువ చేసే చెట్లను నరికివేసి బొగ్గు బట్టీలకు తరలించినట్లు సమాచారం. అనుమతి తీసుకోకుండా తమ వెనుక ప్రజాప్రతినిధులు ఉన్నారని వారు అన్ని చూసుకుంటారని స్వయంగా పంచాయతీ రాజ్ అధికారులు చెప్పడం గమనార్హం. పనిచేసేది కాంట్రాక్టర్లా? ప్రజా ప్రతినిధులా? లేక అధికారులా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై జిల్లా అటవీ శాఖ అధికారులు, కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
పంచాయతీ రాజ్ శాఖ నుండి గాని, సదరు కాంట్రాక్టర్ గాని ఎలాంటి అనుమతి తీసుకోకుండానే నెల్లిబండ నుండి చెరువు అన్నారం ఎక్స్ రోడ్డు వరకు చెట్లు నరికివేశారని తెలిసింది. సంబంధిత శాఖ నుండి ఏఈ గాని, డీఈ గానీ, ఎస్ఈ గానీ అటవీ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. అవేమి చేయకుండానే చెట్లు నరికి వేయడం చట్ట రీత్యా నేరం. ఫారెస్ట్ రేంజ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లి అటవీ శాఖ వాల్టా చట్టం ప్రకారం కాంట్రాక్టర్, సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

Cutting down trees : లక్షల వృక్ష సంపద బొగ్గు పాలు !