బ్లాక్స్పాట్స్ గుర్తించిన అధికారులు
సూర్యాపేట జిల్లాలో 4 జాతీయ రహదారులపై 29 చోట్ల ఎక్కువ ప్రమాదాలు
నివారణకు రంబుల్ స్ట్రిప్స్, పవర్ బ్లంకర్స్, సైన్ బోర్డులు, బారికేడ్ల ఏర్పాటు
పెట్రోలింగ్తోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు
వేగ నియంత్రణకు లేజర్ స్పీడ్ గన్స్
ప్రజలకు మెరుగైన ప్రయాణం, రవాణా లక్ష్యంగా జాతీయ రహదారులను విస్తరించారు. అన్ని హంగులతో రూపుదిద్దుకున్నప్పటికీ కొన్నిచోట్ల అవి ప్రమాదాలకు నిలయంగా మారాయి. సరైన సూచనలు లేకపోవడం, వేగ నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడంతో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు పోతుండగా పలువురు గాయాలపాలవుతున్నారు. యాక్సిడెంట్స్ ఎక్కడ ఎక్కువ జరుగుతున్నాయి.. వాటికి కారణాలను గుర్తించిన పోలీసులు, హైవే అథారిటీ అధికారులు నివారణకు చర్యలు చేపడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో 6 జాతీయ రహదారులు ఉండగా 4 జాతీయ రహదారులపై 29 బ్లాక్ స్పాట్స్ను గుర్తించారు. అవసరమైన చోట రంబుల్ స్ట్రిప్స్,, సైన్ బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు. వేగ నియంత్రణకు లేజర్ స్పీడ్ గన్స్తోపాటు మద్యం తాగి వాహనం నడుపకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ముమ్మరం చేయనున్నారు. అనుమతి లేని యూ టర్న్లను మూసి వేయనున్నారు. అసంపూర్తి సర్వీస్ రోడ్లను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు.
సూర్యాపేట, మే 22 : అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వాలు రహదారుల నిర్మాణం చేపడుతున్నాయి. అయితే కొందరు చేసే తప్పిదాలతో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. రోడ్డు ప్రమాదాలతో నిత్యం పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో కూడా ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. వీటి నివారణపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లా గుండా వెళ్తున్న జాతీయ రహదారులపై ఎక్కడ ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయో తెలుసుకొని వాటిని బ్లాక్ స్పాట్స్గా గుర్తించారు. ఆ ప్రాంతంలో ప్రమాదాలు జరుగకుండా ప్రత్యేక చర్యలు చేప డుతున్నారు. సూర్యాపేట జిల్లా గుండా మొత్తం 6 జాతీయ రహదారులు వెళ్తున్నాయి. ఎన్హెచ్ 365, (అర్వపల్లి నుంచి నూతనకల్ వరకు 42 కిలోమీటర్లు) ఎన్హెచ్ 365ఏ (కోదాడ టౌన్ నుంచి అనంతగిరి వరకు 10 కిలోమీటర్లు)పై ప్రమాదాలు జరుగక పోవడంతో బ్లాక్ స్పాట్స్ లేవు. జాతీయ రహదారి 65పై ( హైదరాబాద్ నుంచి విజయవాడ) 20 బ్లాక్ స్పాట్స్, ఎన్హెచ్ 167పై (నేరేడుచర్ల నుంచి కోదాడ) రెండు బ్లాక్ స్పాట్స్, ఎన్హెచ్ 365బీపై ( సూర్యాపేట- తిరుమలగిరి) రెండు బ్లాక్ స్పాట్స్, ఎన్హెచ్ 365బీబీపై (సూర్యాపేట- మోతె) ఐదు బ్లాక్ స్పాట్స్ గుర్తించారు.
63 కిలోమీటర్లు 20 బ్లాక్ స్పాట్స్
హైదరాబాద్-విజయవాడ నగరాలను కలి పే జాతీయ రహదారి 65 సూర్యాపేట జిల్లాలో 63 కిలోమీటర్ల మేర ఉంది. సూర్యాపేట మండలం టేకుమట్ల నుంచి కోదాడ మండలం రామాపురం వరకు ఉన్న ఈ జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చివ్వెంల మండల పరిధి నుంచి మునగాల, కోదాడ మండల పరిధి వరకు ప్రమాదాల సంఖ్య ఎక్కువ. 63 కిలోమీటర్ల పరిధిలో 20 చోట్ల అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించి వాటిని బ్లాక్ స్పాట్స్గా నిర్ణయించారు. రహదారి నిర్మాణ సంస్థ ఇప్పటికీ కొన్ని చోట్ల సర్వీస్ రోడ్లు నిర్మించకపోవడంతో పాటు రద్దీ ప్రాంతంలో యూటర్న్ ఇవ్వడం, జంక్షన్ల నిర్మాణం చేయక పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఎంపీలు ఈ రోడ్డుపై అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అండర్ పాస్ల నిర్మాణం చేపట్టాలని విన్నవించినా పట్టించుకోలేదు.
3 రహదారులపై 9 చోట్ల బ్లాక్స్పాట్స్
రాష్ట్రం ఏర్పడిన తరువాత నిర్మించిన జాతీయ రహదారులపై ప్రమాదాలు జరుగకుండా ముందు జాగ్రత్తగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. జాతీయ రహదారులపై పెద్ద మూల మలుపులు లేకుండా చూడడంతోపాటు పాత రోడ్డుపై ప్రమాదాలు అధికంగా జరిగిన ప్రాంతాలను గుర్తించి వాటి నివారణకు చర్యలు చేపట్టారు. నాణ్యతా ప్రమాణలతో రోడ్ల నిర్మాణం చెపట్టారు. అయినా కొన్ని చోట్ల ప్రమాదాలు జరుగుతూనే ఉండడంతో వాటిని గుర్తించి బ్లాక్స్పాట్స్గా నిర్ణయించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
n నేరేడుచర్ల నుంచి కోదాడ వరకు నూతనంగా నిర్మించిన 167 జాతీయ రహదారి జిల్లాలో 42 కిలోమీటర్లు ఉన్నది. ఈ రహదారిపై కేవలం 2 చోట్ల మాత్రమే ప్రమాద స్థలాలను అధికారులు గుర్తించారు. జాతీయ రహదారి 365 బీ సూర్యాపేట జనగాం క్రాస్ రోడ్డు నుంచి తిరుమలగిరి మండల శివారు వరకు 39 కిలోమీటర్ల మేర ఉన్నది. దీనిపై రెండు చోట్ల బ్లాక్ స్పాట్స్ను గుర్తించారు. ఎన్హెచ్ 365 బీబీ సూర్యాపేట – మోతె వరకు 29 కిలోమీటర్ల మేర ఉన్నది. దీనిపై 5 చోట్ల ప్రమాదాలు జరుగుతుండంతో బ్లాక్ స్పాట్గా గుర్తించారు.
ప్రత్యేక ఏర్పాట్లు
ప్రమాదాల జరిగే ప్రాంతాలను బ్లాక్స్పాట్స్గా గుర్తించిన అధికారులు అక్కడ ప్రమాదాల నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ ఆధ్వర్యంలో రెండు సార్లు సమావేశం నిర్వహించిన అధికారులు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్కు నివేదిక అందించారు. మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడుపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన అధికారులు అందుకు తగిన చర్యలు చేపట్టారు. ప్రమాదాలు జరిగే ప్రాంతంలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. జాతీయ రహదారిపై వేగ నియంత్రణ కోసం లేజర్ స్పీడ్ గన్స్ సంఖ్య పెంచి జరిమానా వేయడం, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు బ్లాక్ స్పాట్స్ సమీపంలో రంబుల్ స్టెప్స్ ఏర్పాటు చేయనున్నారు. ప్రమాద స్థలాన్ని వాహనదారులకు తెలిసేలా పవర్ బ్లంకర్స్, సైన్బోర్డులు, బారికేడ్లు, సీసీ కెమెరాలు, సోలార్ స్టెన్స్ ఏర్పాటు చేయనున్నారు. జాతీయ రహదారులపై నిత్యం పెట్రోలింగ్తోపాటు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన యూ టర్న్ను మూసి వేస్తారు. అసంపూర్తిగా ఉన్న సర్వీస్ రోడ్లను గుత్తేదారులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.