నల్లగొండ ప్రతినిధి, జూలై 13 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు చకచకా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే మే నెల నుంచి ఓటర్ల జాబితా సవరణ మొదలవగా ఈవీఎంల తనిఖీలు ఒక దఫా పూర్తయ్యాయి. తాజాగా నియోజకవర్గాల వారీగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్న వారి జాబితాతో గురువారం గెజిట్ను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులు, వారి పరిధిలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తయినట్లే. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గానికి నల్లగొండ ఆర్డీఓ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. దేవరకొండకు దేవరకొండ ఆర్డీఓ, నాగార్జునసాగర్కు జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ), మిర్యాలగూడకు మిర్యాలగూడ ఆర్డీఓ, నకిరేకల్కు జిల్లా అదనపు కలెక్టర్(స్థానికసంస్థల), మునుగోడుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఆర్అండ్ఆర్, యూనిట్-2, నల్లగొండ.), సూర్యాపేటకు సూర్యాపేట ఆర్డీఓ, తుంగుతుర్తికి సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ), కోదాడకు కోదాడ ఆర్డీఓ, హుజూర్నగర్కు హుజూర్నగర్ ఆర్డీఓ, భువనగిరికి ఆర్డీఓ, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థల) ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నుంచి మొదలు పెట్టి మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు వీరిదే కీలకపాత్ర. ఇక వీరి పరిధిలో మండలానికి ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని కూడా నియమించారు. ఆయా మండలాల్లోని తాసీల్దార్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్నట్లు ఎన్నికల సంఘం గెజిట్లో ప్రకటించింది. మరో వైపు ఇప్పటికే ఓటర్ల సవరణ జాబితా ముమ్మరంగా కొనసాగుతుంది. వచ్చే అక్టోబర్ ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండనున్న ప్రతి ఒక్కరూ ఓటుహక్కు కోసం దరకాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టారు. మే నెల 25 నుంచి ఈ నెల 23 వరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కొనసాగనుంది. మరోవైపు పోలింగ్ బూతుల ప్రతిపాదనలపైనా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో కసరత్తు జరుగుతోంది. ఈ నెల 24 నాటికి ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంది.
1500 ఓటర్లకు మించిన పోలింగ్ బూత్తో పాటు ఓటర్లకు రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న పోలింగ్ బూత్లకు అదనంగా కొత్త బూత్ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎంల తనిఖీ కూడా ఇప్పటికే మొదలుపెట్టారు. తొలిదఫా తనిఖీలు కూడా పూర్తి చేశారు. రానున్న కాలంలో ఓటర్లకు ఈవీఎంలు, వీవీ ప్యాట్లపైనా విస్త్రతంగా అవగాహన కార్యక్రమాలకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే వరకు వివిధ రూపాల్లో అవగాహన సదస్సులు, కార్యక్రమాలు కొనసాగనున్నాయి. వచ్చే కొద్ద్ది రోజుల్లో ఆయా జిల్లాల్లో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అధికార యంత్రాంగంలో బదిలీలు జరుగనున్నాయి. వీటిపైనా ఇప్పటికే ఎన్నికల సంఘం
పూర్తి వివరాలను సేకరించింది. త్వరలోనే మార్పులు, చేర్పులపై స్పష్టత రానుంది.