నల్లగొండ జిల్లా బత్తాయి రైతులు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే కరువు పరిస్థితులతో తోటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతుండగా, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు మార్కెట్ మాయాజాలం మరింత కుంగదీస్తున్నది. బత్తాయి రేటు ఇటీవల ఎన్నడూ లేనంతగా పడిపోయింది. వ్యాపారులు సిండికేట్గా మారి ధర పెంచడానికి ససేమిరా అంటున్నారు. దాంతో ఈ సీజన్లో ఒక్కో టన్ను బత్తాయిపై రైతులు రూ.15వేల నుంచి 20వేల వరకు నష్టపోతున్నారు. మార్కెట్ పరిస్థితులపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంపై రైతులు మండి పడుతున్నారు.
– నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ)
నల్లగొండ జిల్లాలో ఉద్యానవన పంటల్లో బత్తాయి సాగుది అగ్రస్థానం. బోర్లపై ఆధారపడి చేసే వ్యవసాయంతో మెట్ట ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా పండ్ల తోటల సాగుకు ఉపక్రమిస్తారు. సుమారు 35 ఏండ్లుగా ఇక్కడ బత్తాయి తోటలు సాగులో ఉండగా.. 2007-08 కాలంలో అత్యధికంగా 3.4 లక్షల ఎకరాల వరకు విస్తరించింది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో క్రమంగా అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి విపత్తులతోపాటు కరెంటు సమస్య, మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో దళారుల బెడద అధికమై లాభాలు తగ్గి నష్టాలు వచ్చాయి.
ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి సాగు 1.50లక్షలకు పడిపోయింది. బత్తాయి సాగులో ఇబ్బందులతో విసిగిపోయిన రైతులు స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ఉచిత కరెంటు, సమృద్ధిగా సాగునీరు అందుబాటులోకి రావడంతో క్రమంగా వరిసాగు వైపు మొగ్గు చూపారు. దాంతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 75 వేల ఎకరాల్లో బత్తాయి తోటలు సాగులో ఉన్నట్లు అంచనా. ఇందులోనూ ప్రస్తుతం దిగుబడి ఇస్తున్న తోటలు 60వేల ఎకరాల వరకు ఉండవచ్చు. ఈ తోటల రైతులు సైతం ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బత్తాయిలో కత్తెర, సీజన్ కాయ అని రెండు దఫాలుగా దిగుబడి వస్తుంది. కత్తెరకాయ ఫిబ్రవరి నుంచి మే వరకు, సీజన్ కాయ ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు రెండు దఫాలుగా దిగుబడి వస్తుంది. జిల్లా నుంచి బత్తాయిని హైదరాబాద్తోపాటు మెజార్టీ భాగం ఢిల్లీ మార్కెట్కు ఎగుమతి చేస్తుంటారు. ఢిల్లీ మార్కెట్ ఆధారంగా ఇక్కడి వ్యాపారులు రేట్ డిసైడ్ చేస్తుంటారు. ప్రస్తుతం కత్తెర కాయ వస్తున్నది. సాధారణంగా కత్తెర కాయకు మార్కెట్లో మంచి ధర ఉంటుంది.
ఈ సారి మాత్రం ధర పలుకడం లేదు. కత్తెరలో టన్ను బత్తాయికి ఎప్పుడైనా సరే రూ.25వేల నుంచి 40వేల వరకు ధర పలుకడం సహజం. కానీ ప్రస్తుతం రూ.12వేల నుంచి 22వేలకు మించడం లేదు. టన్ను మీద సగం ధర కోల్పోతున్నట్లే. ప్రస్తుత సీజన్లో కరువు, నీటి కొరతతో దిగుబడి కూడా అంతంతమాత్రంగానే ఉంది. దిగుబడి లేనప్పుడు మార్కెట్లో డిమాండ్ పెరుగాల్సిన తరుణంలో రెగ్యులర్గా వచ్చే ధర కూడా రాకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి కూడా రాకుండా తీవ్రంగా నష్టపోతున్నారు.
నల్లగొండ బత్తాయి మార్కెట్లో ఆది నుంచి ప్రైవేట్ వ్యాపారులదే పైచేయి. వారు చెప్పిందే వేదంగా ధర పలుకుతున్నది. జిల్లా బత్తాయి మార్కెట్లో మొదటి నుంచి కర్నూల్కు చెందిన దళారులదే హవా. తోటల వద్దకే వచ్చి కాయ నాణ్యతను బట్టి టన్ను ధరకు ఇంత అని నిర్ణయిస్తూ కోసుకుపోవడం సహజం. గతేడాది, అంతకు ముందు ఏడాది కత్తెర కాయకు మంచి ధర పలికింది. వ్యాపారులు పోటీ పడి ధర పెంచుతూ పోయారు. 2022 వేసవి కత్తెరలో ఒక దశలో టన్ను ధర రూ.50వేల నుంచి 70వేల వరకు వెళ్లింది. రైతులకు కూడా మంచి లాభం వచ్చింది. గతేడాది కూడా రూ.25వేల నుంచి 40వేల వరకు ధర పలికింది.
ప్రస్తుతం కత్తెరలో దిగుబడి తక్కువగా ఉండడంతో పాటు వేసవి, రంజాన్ ఉపవాసాల నేపథ్యంలో బత్తాయి జ్యూస్కు, పండ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో మంచి ధరనే ఉన్నట్లు సమాచారం. కానీ రైతులకు మాత్రం స్థానికంగా మంచి ధర దక్కడం లేదు. స్థానికంగా ఉన్న వ్యాపారులే సిండికేట్గా మారి ధరలను పెంచవద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు సీజన్ కాయ దిగుబడి వస్తుంది. అప్పుడు ఈ మాత్రం రేటు కూడా రాదన్నది వాస్తవం.
బత్తాయి రైతులకు అండగా నిలువాల్సిన ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయింది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నల్లగొండ శివారులోని ఎస్ఎల్బీసీ స్థలంలో బత్తాయి మర్కెట్ను ఏర్పాటు చేశారు. బయట మంచి ధర ఉన్నప్పుడు రైతులకు ఇబ్బంది లేదు. కానీ ధర లేని సమయంలో మార్కెట్ ద్వారా రైతులకు అండగా నిలువాలన్నదే బత్తాయి మార్కెట్ ఉద్దేశం. కానీ అలాంటి చర్యలేవీ కాంగ్రెస్ ప్రభుత్వం వైపు నుంచి కనపడడం లేదు. అందుకే వ్యాపారుల మాయాజాలంలో బత్తాయి రైతులు విలవిలలాడుతున్నారు. ప్రస్తుత ధరల తగ్గింపుపై ఉద్యానవన శాఖ అధికారులు సైతం తమకు కూడా మార్కెట్ పరిస్థితి ఏంటో అంతుచిక్కడం లేదని చెప్తుండడం గమనార్హం.
నీళ్లు లేక బత్తాయి తోటలు ఎండిపోతున్నాయి. వేలకు వేలు ఖర్చు పెట్టి బోర్లు వేయించినా చుక్క నీరు పడే పరిస్థితి లేదు. పోయిన వేసవిలో టన్ను ధర రూ.30 వేలు పలికితే ఇప్పుడు రూ.18 వేలకే కొంటున్నారు. దళారీ వ్యవస్థను అరికట్టేందుకు నేరుగా రైతులే పంట అమ్ముకునేందుకు ప్రభుత్వం సదుపాయాలు కల్పించాలి. పక్క రాష్ట్రంలోని అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో టన్ను రూ.30 వేలకు పోతుంటే మన రాష్ట్రంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దళారులు రూ.18 వేలకే కొంటూ రైతులను మోసం చేస్తున్నారు. ఎంతో కష్టపడి సాగు చేసిన బత్తాయి తోటల రైతులకు ఏమీ మిగలడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి బత్తాయి రైతులను అన్నివిధాలుగా ఆదుకోవాలి.
– మైలపురపు సుధాకర్రెడ్డి, రైతు, కుక్కడం, మాడ్గులపల్లి మండలం
ఈ కత్తెరలో బత్తాయి పంట దిగుబడి సరిగ్గా రాలేదు. రేటు కూడా లేదు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. గతంలో ప్రతి సంవత్సరం సీజన్ క్రాప్లో 80 టన్నులు, కత్తెరలో 30-35 టన్నుల దిగుబడి వచ్చేది. ఈసారి మాత్రం టన్ను దిగుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపిస్త లేదు. దానికి తోడు రేటు రూ.15-18 వేలే ఉండడంతో కనీసం పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. గత సంవత్సర ఈ సమయంలో నీరు పుష్కలంగా ఉన్నది. రేటు కూడా 30 వేల వరకు ఉండేది. ఈ సంవత్సరం బోర్లు ఎండిపోవడంతో తోటను కాపాడుకోలేకపోతున్నాం.
-ఆవుల రవీందర్రెడ్డి, రైతు, బట్టుగూడెం, పెద్దవూర మండలం