నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్16(నమస్తే తెలంగాణ) : లోక్సభ ఎన్నికల ప్రక్రియలో రేపటి నుంచి కీలక ఘట్టానికి తెర లేవనుంది. గురువారం ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయడంతో నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కానుంది. దీనికి సంబంంధించి మంగళవారం నల్లగొండ కలెక్టరేట్లో ఎస్పీ చందన దీప్తి తో కలిసి కలెక్టర్ హరి చందన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన మాట్లాడుతూ లోకసభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేయడంతోపాటు, ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ నెల18 నుంచి 25 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నల్లగొండ కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. సెలవు దినాల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదని, పోటీ చేసే అభ్యర్థులు ఫామ్-2ఏ లో అన్ని వివరాలను పూరించి నామినేషన్ దాఖలు చేయాలని చెప్పారు.
ఒక అభ్యర్థి నాలుగు సెట్ల వరకు గరిష్టంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయొచ్చన్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే జనరల్ అభ్యర్థులు రూ. 25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్తోపాటు, కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని తెలిపారు. గుర్తించిన రాజకీయ పార్టీల అభ్యర్థులను ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుందని, గుర్తింపు పొందని రాజకీయ పార్టీ, అలాగే స్వతంత్ర అభ్యర్థులను మాత్రం పదిమంది ప్రతిపాదించాల్సి ఉంటుందని చెప్పారు. నామినేషన్తోపాటు ఫామ్-26 ద్వారా ఆఫిడవిట్ దాఖలు చేయాలని, అఫిడవిట్లో విద్యార్హతలు, కేసులు, క్రిమినల్ యాంటిసిడెన్స్ తప్పనిసరిగా పొందుపర్చాలని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థి 25 సంవత్సరాలు వయసు ఉండి, ఏదైనా నియోజకవర్గం నుంచి ఓటరుగా నమోదై ఉండాలని అన్నారు.
ఇతర నియోజక వర్గాల వారు అయితే సంబంధిత రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రాన్ని తీసుకురావాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్కు ముందే ఎన్నికల ఖర్చు నిర్వహణ కోసం ఏదేని జాతీయ బ్యాంకులో అకౌంట్ తెరువాలని, నామినేషన్ వేసే ముందు బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలన్నారు. నల్లగొండ లోక్సభ నియోజకవర్గంలో 2,061 పోలింగ్ స్టేషన్లలో 17,22,521 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 18-19 వయసు వారు 60,116 మంది, 85 సంవత్సరాలు నిండిన వారు 9,587 మంది ఉన్నారని చెప్పారు. వీరితో పాటు పీడబ్ల్యూడీ ఓటర్లు 33,865 మంది, సర్వీస్ ఓటర్లు 736 మంది ఉన్నారన్నారు. సీనియర్ సిటిజన్స్తోపాటు దివ్యాంగులకు హోం ఓటింగ్ సదుపాయం కల్పించామని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా 100 మీటర్ల పరిధిలో ఇతరులకు అనుమతి ఉండదని, అభ్యర్థితోపాటు మరో నలుగురు వ్యక్తులు, మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు.
ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామన్నారు. ఎన్నికలకు సంబంధించి ఆన్లైన్లో అయితే సువిధ యాప్ ద్వారా, ఆఫ్లైన్లో అయితే ఏఆర్ఓ కార్యాలయాలలో అనుమతులు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దగ్గర నుంచి ఇప్పటివరకు రూ.9.18 కోట్ల విలువగల నగదు, మద్యం, ఆభరణాలు సీజ్ చేశామన్నారు. 3 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులు వాడపల్లి, నాగార్జునసాగర్ అడవిదేవులపల్లిలో ఏర్పాటు చేసి తనిఖీ పటిష్టం చేశామని తెలిపారు. వీటితోపాటు అంతర జిల్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, ఎకడ ఏ చిన్న అనుమానం వచ్చినా తనిఖీ చేసి కేసులు నమోదు చేస్తున్నామని, ఇప్పటివరకు 184 కేసుల్లో నగదు, ఆభరణాలు వంటివి సీజ్ చేశామని చెప్పారు. ఈ సమావేశంలో స్పెషల్ కలెక్టర్ నటరాజ్, మీడియా నోడల్ అధికారి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కోటేశ్వర్రావు, కేంద్ర ప్రభుత్వ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ కోటేశ్వర్రావు, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.