నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి11(నమస్తే తెలంగాణ) : కృష్ణానదీ ప్రాజెక్టుల పట్ల కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ధోరణిపై బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతను నిరసిస్తూ నల్లగొండ వేదికగా సమరశంఖం పూరించనుంది. ఈ నెల 13న చలో నల్లగొండ పేరుతో భారీ బహిరంగసభకు సన్నద్ధమవుతున్నది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానుండడంతో పార్టీ యావత్ రంగంలోకి దిగింది. సభా ప్రాధాన్యతను వివరిస్తూ పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశాలు నిర్వహించింది.
కృష్ణానది ప్రాజెక్టులపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అధికారాలను కేంద్రం పరిధిలోని కేఆర్ఎంబీకి అప్పగిస్తూ కాంగ్రెస్ సర్కార్ చేసిన నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. ముఖ్యంగా కృష్ణా పరీవాహక ప్రాంత రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ప్రాజెక్టుల నిర్వహణ రాష్ట్ర పరిధిలో ఉండడం వల్ల తెలంగాణ వచ్చాక కృష్ణాజలాల్లో నీటి వాటాను నిక్కచ్చిగా అప్పటి కేసీఆర్ సర్కార్ వాడుకోగలిగింది. దీంతో గత పదేండ్లల్లో మొత్తం 18 పంటకాలలకు సాగునీరును సమృద్ధిగా ఇవ్వగలిగింది.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో ఇక ముందు ఆ పరిస్థితి ఉండదు. దాంతో సాగునీటికే కాకుండా తాగునీటి అవసరాలకు కూడా ఇబ్బందులు తప్పవని ఇంజినీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్లనే కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతను బీఆర్ఎస్ వెలుగులోకి తెచ్చి ప్రజలను చైతన్యం చేసే దిశగా కార్యాచరణ చేపట్టింది. అందులోభాగంగా మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంగా చలో నల్లగొండ పేరుతో బహిరంగ సభకు సిద్ధమైంది.
చలో నల్లగొండ బహిరంగ సభకు పట్టణ శివారులోని నార్కట్పల్లి-అద్దంకి హైవేకు నుకుని మర్రిగూడ బైపాస్లో విశాలమైన స్థలంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి నేతృత్వంలో సభా నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభా ప్రధాన వేదిక, కళాకారుల వేదిక నిర్మాణం పూర్తి కావస్తుండగా గ్యాలరీల నిర్మాణం, బారీ కేడింగ్, పార్కింగ్ స్థలాలను సిద్ధం చేయడం లాంటి పనులన్నీ చకచకా సాగిపోతున్నాయి.
మరోవైపు సభకు విస్తృత ప్రచారం కల్పిస్తూ ప్రజలను కదిలించేందుకు బీఆర్ఎస్ పార్టీ యావత్తు రంగంలోకి దిగింది. కృష్ణానదీ పరీవాహక ప్రాంతాలపై నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలతో పాటు తాగునీటిపై ఆధారపడిన రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి కూడా ప్రజలు తరలిరావచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశాల నిర్వహణ పూర్తైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడ చూసిన చలో నల్లగొండ సభపై ప్రముఖంగా చర్చ సాగుతున్నది. రేపు సాయంత్రం 4గంటలకు సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చెబుతారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
సమైక్య పాలనలో సాగర్ ఎడమకాల్వకు, ఏఎంఆర్పీ ఆయకట్టు రైతాంగం పడిన ఇబ్బందులు చలో నల్లగొండ సభ సందర్భంగా మరోసారి చర్చనీయాంశమైంది. అప్పట్లో ఎడమకాల్వను ప్రయోజనాలను పక్కన పెట్టి కుడికాల్వ ద్వారా ఒకవైపు పవర్ జనరేషన్ ద్వారా కృష్ణా డెల్టాకు మరోవైపు జలదోపిడీని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఎడమకాల్వతో పాటు తాగునీటి అవసరాలకు సైతం ఇక్కట్లు పడిన సందర్భాలు ఎన్నో ఉండేవని, లిఫ్టుల నిర్వహణను సైతం గాలికి వదిలేశారని రైతులే చర్చించుకుంటున్నారు. పంటలు పండకపోయినా నీటి తీరువా వసూలు చేసిన తీరు, మేజర్లకు మీటర్లు పెట్టేందుకు చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అందుకే 2004 ఆగస్టులోనే ఉద్యమ నేతగా కేసీఆర్ కృష్ణాజలాల్లో అన్యాయాలను నిలదీస్తూ కోదాడ నుంచి హాలియా వరకు చారిత్రాత్మక పాదయాత్రను చేపట్టారు.
అక్కడి నుంచి మొదలైన కేసీఆర్ పోరాటం రాష్ట్రం సాధించుకునే వరకూ ప్రతి సందర్భంలోనూ కొనసాగింది. ఇక రాష్ట్ర సాధన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా కృష్ణాజలాల్లో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించారు. అందులో భాగంగా ఈ ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్ర హక్కులను వినియోగించుకుంటూ కృష్ణాజలాలను సమృద్ధిగా వినియోగించారు. . ఇక జంట నగరాలకు తాగునీటి అవసరాలకు కూడా ఇబ్బందులు లేకుండా నిరంతరం సరఫరా చేయగలిగారు. సమైక్య పాలన నాటి ఇబ్బందులు… స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ప్రయోజనాలు ఛలో నల్లగొండ సభ ద్వారా ప్రజల్లో చర్చకు దారితీశాయి. తిరిగి కాంగ్రెస్ పాలనలో పాత రోజులే వచ్చే ప్రమాదం పొంచి ఉందని ఆయకట్టు రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అందుకే కేసీఆర్ పిలుపు మేరకు చలో నల్లగొండకు సభకు తరలివచ్చేందుకు రైతులు రెడీ అవుతున్నారు.