రామగిరి, మార్చి 15 : రాజీ పడదగిన కేసులను సత్వరం పరిష్కరించునేందుకు చక్కటి వేదిక లోక్ అదాలత్ అని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.నాగరాజు, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.దీప్తి అన్నారు. నల్లగొండ జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాధికార సంస్థలో శుక్రవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో ఈ నెల 16న జిల్లాలోని 14 కోర్టుల ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
కక్షిదారుల సౌకర్యార్థం దీన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ అంశాల్లో 13,497 కేసుల పరిష్కారానికి అవకాశం ఉందని, అందులో 3,330 కేసులు పరిష్కరించారని, ఇంకా 10,167 కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. లోక్ అదాలత్లో పరిష్కరించిన కేసులకు తిరిగి అప్పీలు చేసుకునే అవకాశం ఉండదని తెలిపారు.