యాదగిరిగుట్ట, మార్చి10 : యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు రుత్వికులు, పారాయణదారులు, వేద పండితులు, పురోహితులు, ఆలయ అధికారులు కలిసి స్వయంభూ పంచ నారసింహ స్వామి అనుమతి తీసుకొని, ప్రధానాలయ ముఖ మండపంలో విశ్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు.
ఈ నెల 21 వరకు 11 రోజులపాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనుండగా డోలు వాయిద్యాలు, సన్నాయి మేళాలు, వేద మంత్ర పఠనాలతో ఆలయం ఆధ్యాత్మిక వైభవం సంతరించుకోనున్నది. ఉత్సవాల కోసం దేవస్థానం రూ. 1.50 కోట్లు కేటాయించగా, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈఓ రామకృష్ణారావు తెలిపారు. తొలి పూజలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.
బేగంపేట విమానాశ్రమంలో సీఎం రేవంత్రెడ్డి ఉదయం 8.45 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 9 గంటలకు టెంపుల్ సిటీ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి వాహనంలో కొండపైకి వస్తారు. 9.30 నుంచి 10.30 గంటల వరకు స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి తొలిసారిగా స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రూ.1.50 కోట్లలో రూ. 60 లక్షలు విద్యుద్దీపాలంకరణకు, మిగతా రూ. కోటి స్వామివారి పూజలకు ఖర్చు చేయనున్నారు. రంగురంగుల విద్యుద్దీపాలంకరణతో ఆలయం ధగధగ మెరిసిపోతున్నది. స్వామివారి సేవలను వినియోగించే వాహనాలను ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రధానాలయాన్ని మామిడి తోరణాలు, రంగురంగుల పూలతో ఆలంకరించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలోని అద్దాల మండపం ఎదురుగా యాగశాలను ఏర్పాటు చేశారు. వేసవికాలం ప్రారంభం కావడంతో చలువ పందిళ్లు, తాగునీటి వసతులను కల్పించారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు యాదగిరిగుట్ట అంతా ప్రతిధ్వనించేలా ప్రత్యేకమైన సౌండ్ సిస్టంను ఏర్పాటు చేశారు. కొండపైనే ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్స్ను అందుబాటులో ఉంచారు.
బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ నెల 18న తిరు కల్యాణోత్సవానికి 600 కల్యాణ టికెట్లను మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంచారు. ఒక్కో టికెట్ ధర రూ. 3 వేలు నిర్ణయించగా నేటి నుంచి దేవస్థాన వైబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. వీటితోపాటు కొండపై టికెట్ కౌంటర్ వద్ద సైతం టికెట్లను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణం అనంతరం దాతలకు శేష వస్త్రంగా ఒక ఉత్తరీయం, కనుము, అభిషేకం లడ్డూ, 2 వడలు ప్రసాదంగా ఇవ్వనున్నారు. కల్యాణోత్సవంలో 5 వేల మంది భక్తుల పాల్గొనే విధంగా ప్రత్యేక గ్యాలరీలను రూపొందించారు. వీవీఐపీ, వీఐపీ, కల్యాణంలో పాల్గొనే భక్తులు, అర్చకులు, డోనర్లు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేకమైన లాబీలు ఏర్పాటు చేస్తున్నారు. తూర్పు పంచతల రాజగోపురం ఎదురుగా ఎదుర్కోలు, ఉత్తర పంచతల రాజగోపురం ఎదురుగా గల రథశాల, లిఫ్ట్ ముందు భాగంలో స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.
ఆలయంలోప్రతి రోజూ 500 మందికి మాత్రమే అన్నదానం చేస్తుండగా వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 1500 మందికి అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. కొండకింద నిత్యన్నదాన సత్రంలో ఉదయం నుంచి రాత్రి వరకు అన్నదానం ఉంటుందని ఆలయ ఈఓ రామకృష్ణారావు వెల్లడించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 15నుంచి 20 వరకు ధార్మిక, సాహిత్య సంగీత మహాసభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 5.30 నుంచి 6.30 వరకు యాదగిరిగుట్టకు చెందిన శ్రీవైష్ణవ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రభాత భేరి, ఆస్థానం వారితో మంగళ వాయిద్యాలు, వైదిక ప్రార్థనలు నిర్వహిస్తారు. వీటితోపాటు ప్రతి రోజూ ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తి, కర్ణాటక సంగీతాలు, కూచిపూడి, పేరిణి నృత్యాలు, భరతనాట్యం, ఉపన్యాసాలు, హరి కథలు, వీణావాద్యం, వేణుగానం, మంగళవాయిద్య గోష్టి, చిందు యక్షగానం, కోలాటం, చెక్కభజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
గత బ్రహ్మోత్సవాల సమయంలో చక్రతీర్థ స్నాన సమయంలోనే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే ఆనవాయితీ ఉండేది. కానీ కొండపైన విష్ణు పుష్కరిణి తక్కువ వైశాల్యంతో నిర్మించిన నేపథ్యంలో గతేడాది బ్రహ్మోత్సవాల్లో చక్రతీర్థ స్నాన ఘట్టాన్ని పరిమిత సంఖ్యలో అర్చకులు, అధికారుల నడుమ కొండపైన విష్ణు పుష్కరిణిలో నిర్వహించారు. అనంతరం పుణ్య జలాలను కలశంతో నింపి లక్ష్మీ పుష్కరిణిలో కలిపారు. కానీ ఈ సారి చక్రతీర్థ స్నాన ఘట్టం ముగిసిన ఆనంతరం విష్ణుపుష్కరిణిలోనే భక్తుల పుణ్య స్నానాలకు అనుమతిని ఇవ్వనున్నట్లు ఆలయ అనువంశికధర్మకర్త బి. నరసింహమూర్తి వెల్లడించారు.
యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలకు పరీక్షల ప్రభావం పడనున్నది. ఇంటర్మీడియట్, పదో తరగతి, డిగ్రీ, పీజీ సెమిస్టర్తోపాటు మెగా డీఎస్సీ, గ్రూప్ 1,2,3 ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు పరీక్షలకు సన్నద్ధం కానున్నారు. దాంతో ఈ సారి ఉత్సవాలను భక్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నదని ఆలయ, ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.
వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని స్వామివారి దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయి. బ్రేక్ దర్శనంతోపాటు ధర్శ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు ఉంటాయి. నేటి నుంచి 21వరకు నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహహోమం, మొక్కు సేవలను రద్దు చేస్తున్నాం. స్వామివారి రాత్రి నివేదన అర్చన తదుపరి 8.15 నుంచి 9.00 గంటల వరకు బలిహరణ, ఆరగింపు జరిపించనున్నాం. రాత్రి 7 గంటలకు అలంకార సేవలు, సర్వ దర్శనాలు ప్రారంభిస్తాం. రాత్రి 10 గంటలకు శయనోత్సవ సేవ, ద్వార బంధనం ఉంటుంది.
లక్ష్మీనరసింహ స్వామికి ప్రభుత్వం తరఫున పట్టు వస్ర్తాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమర్పించనున్నారు. ఆలయం తరఫున అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ రామకృష్ణారావు, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున టీటీడీ ఆలయ ఈఓ, పోచంపల్లి చేనేత సంఘం ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పట్టువస్ర్తాలను అందజేయనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు వస్తున్న నేపథ్యంలో కొండపైన దేవస్థానం ఆంక్షలు విధించింది. సోమవారం ఉదయం 8 నుంచి 11 గంటలవరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈఓ రామకృష్ణారావు తెలిపారు. కొండపైకి భక్తులను, ఎటువంటి వాహనాలను అనుమతినివ్వడం లేదని చెప్పారు.
బ్రహ్మోత్సవాలకు భక్తులు హైదరాబాద్, నల్లగొండ నుంచి ఎక్కువగా వస్తారని, ఆ రూట్లలో అధికంగా బస్సులు నడిపించేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా గుట్టకు బస్సులు నడుస్తున్నాయి. ప్రస్తుతం కొండపైకి 10 నుంచి 12 ఉచిత ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట బస్టాండ్ నుంచి కొండపైకి భక్తులు రద్దీకి అనుగుణంగా నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటు హైదరాబాద్, ఆటు వరంగల్ నుంచి వచ్చే భక్తులకు రైల్వే సౌకర్యం కలదు. జిల్లా కేంద్రమైన భువనగిరితో పాటు స్వామి వారి దేవస్థానానికి 5 కిలో మీటర్ల సమీపం రాయగిరిలో యాదాద్రి రైల్వే స్టేషన్ ఉన్నది. సికింద్రాబాద్ నుంచి వచ్చే రైళ్లు కాకతీయ ప్యాసెంజర్, పుష్పుల్, కృష్ణా ఎక్స్ప్రెస్ యాదాద్రి రైల్వే స్టేషన్లో నిలుపుతారు. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వెళ్లే పుష్పుల్, గోల్కొండ, భాగ్యనగర్, కాకతీయ, గౌతమి, మంచిర్యాల, కృష్ణా, ఇంటర్ సిటీ, తెలంగాణ, ఈస్ట్కోస్ట్, దక్షిణ్ ఎక్స్ప్రెస్ రైళ్లు భువనగిరి రైల్వేస్టేషన్లో నిలుపుతారు. వరంగల్ నుంచి వచ్చే రైళ్లు సైతం భువనగిరిలో ఆగుతాయి. భువనగిరి నుంచి బస్సు సహాయంతో యాదగిరిగుట్టకు చేరుకోవచ్చు.