స్వరాష్ట్రంలో రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. సాగుబడిలో అన్నదాత చతికిలపడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలకు రూపకల్పన చేశారు. నిరంతర ఉచిత విద్యుత్, రుణమాఫీ, పక్కాగా భూమి హక్కుల కోసం ధరణి, రైతుబంధు, రైతుబీమా, మార్కెట్ సౌకర్యం, పండిన ప్రతి గింజా కొనుగోళ్లు, పంట కల్లాల నిర్మాణాలు, గోదాముల విస్తరణ, సమృద్ధిగా ఎరువులు, విత్తనాల సరఫరా వంటి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగిస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. తెలంగాణలో రైతే రాజు.. ఇది రైతు రాజ్యమని బల్లగుద్ది చెప్పుకోవచ్చు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతుదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని రైతు వేదికల్లో వేడుకలకు ఏర్పాట్లు చేశారు.
– నల్లగొండ ప్రతినిధి, జూన్ 2 (నమస్తే తెలంగాణ)/సూర్యాపేట
నాడు.. నేను రైతునని చెప్పుకోలేని దయనీయ పరిస్థితుల నుంచి, నేను రైతును. నా భూమికి నేనే రాజును..అని సగర్వంగా గల్లా ఎగురేసి చెప్పుకుంటున్న రోజులు నేడు. రైతు అభివృద్ధే లక్ష్యంగా రైతు బంధు, రైతు బీమా, 24గంటల ఉచిత విద్యుత్, సమృద్ధిగా సాగునీరు, ధాన్యం కొనుగోళ్లు, భూరికార్డుల ప్రక్షాళన తదితర ఎన్నో కార్యక్రమాలు కొనసాగిస్తున్నది. సమైక్య రాష్ట్రంలో దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగలా చేసి చూపించింది. తొమ్మిదేండ్లలో రైతు సంక్షేమానికి పెద్దపీట లభించింది. సాగుబడిలో చతికిలపడకుండా ఎన్నో పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేశారూ. దాంతో పంటల సాగులో ఉమ్మడి నల్లగొండ జిల్లా అద్భుతాలు సృష్టిస్తున్న. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామి జిల్లాగా నల్లగొండ నిలిచింది. కరువు కాటకాలకు కేరాఫ్గా ఉన్న నల్లగొండ నేడు ఎటూ చూసినా పచ్చదనంతో పరిడవిల్లుతున్నది. ఇందులో రైతన్నకు అన్ని దశల్లోనూ ప్రభుత్వం వెన్నంటి ప్రోత్సహిస్తుండడంతో రైతు వికాసం వెల్లివిరుస్తున్నది. సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో ఉన్న వ్యవసాయానికి జీవం పోస్తూ… ఆత్మహత్యల బాట పట్టిన రైతాంగం బతికి నిలిచేలా ఎన్నో కార్యక్రమాలకు స్వరాష్ట్రం వేదికగా మారింది. నాడు యాసంగిలో 3లక్షల ఎకరాలకు మించని పంటను నేడు 11 లక్షల ఎకరాలకు చేరిందంటేనే రైతు ప్రాధాన్యత ఎంటో స్పష్టమవుతున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వ
నిర్ణయించింది.
నల్లగొండ ప్రతినిధి, జూన్ 2(నమస్తే తెలంగాణ)/సూర్యాపేట : స్వరాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగలా మార్చడంతో పాటు రైతు సంక్షేమానికి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. స్వయంగా రైతుగా..వారి సాదకబాధకాలు ఎగిరిన వ్యక్తిగా…సీఎం కేసీఆర్ పట్టువదలని విక్రమార్కుడిగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతూ రైతన్న సంతోషమే ధ్యేయంగా చిత్తశుద్ధ్దితో అనేక పథకాలకు రూపకల్పన చేశారు. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ పథకాల కింద లక్షలాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందుకు నడిపిస్తున్నారు.
రైతుబంధు
2018 వానకాలం నుంచి రైతు బంధు పథకం ప్రారంభమైంది. ప్రస్తుతం ఎకరాకు ఏడాదికి రూ. 10 వేల పెట్టుబడి సాయంగా అందజేస్తున్నారు. పది సీజన్లలో కలిపి నల్లగొండ జిల్లాలో ప్రతీ సీజన్కు 4.83లక్షల మంది రైతులకు గానూ ఇప్పటివరకు రూ.5,243 కోట్లను నేరుగా ఖాతాల్లో జమ చేసింది. ఇక సూర్యాపేట జిల్లాలో రూ. 2,724.13 కోట్లను పెట్టుబడి సాయంగా రైతుబంధును అందజేశారు.
రైతుబీమా : రైతులు అకాల మరణం పొందితే ఆ కుటుంబాన్ని ఆదుకునేలా రైతుబీమా పథకం అమలు చేస్తున్నారు. ప్రీమియం పూర్తిగా ప్రతీ ఏటా ఆగస్టులో ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 5.42లక్షల మంది బీమా పథకంలో అర్హులుగా ఉన్నారు. ఈ పథకం వల్ల ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో 6,256 మంది రైతులు చనిపోతే వారి కుటుంబాలకు రూ.312.80 కోట్ల బీమాను డబ్బులను అందజేశారు. సూర్యాపేట జిల్లాలో 3,500 మంది రైతుల కుటుంబాలకు రూ.175 కోట్లను బీమా సాయంగా చెల్లించారు.
రైతు వేదికలు
5000 ఎకరాలకు క్లస్టర్ను ఏర్పాటు చేస్తూ ఏఈఓలను నియమించింది. క్లస్టర్ పరధిలో రైతులు భేటీ కావడం కోసం రైతు వేదికలను నిర్మించింది. ప్రతి సీజన్లో రైతులకు సలహాలు, సూచనలు చేసే విధంగా వీటిలో వసతులను కల్పించింది. సూర్యాపేట జిల్లాలో 82 క్లస్టర్లకు రూ.25 కోట్లతో 82 రైతు వేదికల నిర్మాణం చేపట్టింది. నల్లగొండ జిల్లాలో 140 క్లస్టర్లకు రూ.30.80కోట్లతో రైతు వేదికలను నిర్మించింది.
రైతు పంట కల్లాలు
రైతులు పండించిన పంటను అరబెట్టుకోవడానికి తన పంట చేను వద్దనే కల్లాలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. సూర్యాపేట జిల్లాలో 3,730 మంది రైతులకు పంట కల్లాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 821 కల్లాలు పూర్తయ్యాయి. నల్లగొండ జిల్లాలోనూ పెద్ద ఎత్తున రైతు కల్లాల నిర్మాణం జరిగింది.
ధాన్యం కొనుగోళ్లు
స్వరాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ప్రతి సీజన్లో పకడ్భందీగా వ్యవహరిస్తున్నది. రెవెన్యూ గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ప్రతీ గింజా కొనుగోలు చేస్తున్నది. నల్లగొండ జిల్లాలో 2014-15 నుంచి నేటి యాసంగి వరకు రూ.10,879 కోట్ల విలువైన 63 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇక సూర్యాపేట జిల్లాలో ఈ తొమ్మిదేండ్లల్లో 75,814 మంది రైతుల నుంచి 31.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.5921.15 కోట్లను రైతులకు చెల్లించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వారం రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నగదును జమ చేయడం దేశంలోనే ఎక్కడా లేదు.
నాణ్యమైన విత్తనాలు : సమైక్య రాష్ట్రంలో నకిలీ విత్తనాల బెడద అధికంగా ఉండేది. దీనిని అరికట్టేందుకు పెద్ద ఎత్తున ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎక్కడికక్కడ ఉక్కుపాదంతో అడ్డుకట్ట వేసింది. సీజన్ ప్రారంభానికి ముందే ప్రభుత్వ ప్రత్యేక మైన టీంలను ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా పెట్టింది. నకిలీ విత్తన విక్రయదారులపై ఏకంగా పీడీ యాక్ట్ పెట్టి కఠినంగా వ్యహరిస్తున్నారు.
గోదాముల నిర్మాణం : పంటల దిగబడికి అనుగుణంగా జిల్లాలో గోదాంల సామర్థ్ధ్యంపైనా దృష్టి సారించారు. నల్లగొండ జిల్లాలో కొత్తగా రూ.56 కోట్లతో 92,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 27 గోదాంలను నిర్మించారు. సూర్యాపేట జిల్లాలో 82 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న 62 గోదాములను ఏర్పాటు చేశారు. ఇందులో సమైక్య పాలనలో 8 గోదాములే ఉండగా గమనార్హం. తాము పండించిన పంటలను అందులో దాచుకోని మద్దతు ధర వచ్చిన తరువాత అమ్ముకునే వెసులుబాటును సైతం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వాటిని అందులో ఉంచడం జరుగుతుంది. జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లులో నాబార్డు సబ్సిడీ స్కీం ద్వారా దాదాపు రూ.21 కోట్లతో 35 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 13 గోదాములను కూడా నిర్మించారు.
దశాబ్ది ఉత్సవాల్లో నేడు రైతు దినోత్సవం..
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు వేదికల్లో రైతు దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. లైటింగ్, పూలతో వేదికలను అలంకరించారు. క్లస్టర్ల వారీగా రైతులతో సమావేశం నిర్వహించనున్నారు. జాతీయ గీతాలాపనలతో సమావేశం ప్రారంభవుతుంది. వ్యవసాయం రంగంలో సాధించిన ప్రగతిపై ఫ్లెక్సీ లు, పోస్టర్లతో ప్రదర్శించనున్నారు. ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాల లబ్ధిని వివరించేలా ఏర్పాట్లు చేశారు. రైతుబంధు సమితి సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ మండల స్థాయి అధికారులంతా పాల్గొననున్నారు. వివిధ పథకాల లబ్ధిదారులతో మా ట్లాడించనున్నారు. అనంతరం సామూహిక భోజనం ఏర్పాటు చేయనున్నారు.
సమృద్ధిగా ఎరువులు
సమైక్య పాలనలో చెప్పులు లైన్లో పెట్టి రోజుల తరబడి ఎదురుచూస్తే తప్పా ఎరువులు దొరికేవీ కావు. కానీ స్వరాష్ట్రంలో ఎరువుల కష్టాలు మచ్చుకు కూడా లేకుండా పోయాయి. ప్రభుత్వం ముందుచూపుతో సమృద్ధిగా ఎరువులను అందుబాటులో ఉంచుతున్నది. కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెట్టిన సరే రైతులకు ఇబ్బంది రాకుండా ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరిస్తున్నది. ముందుగానే పంటల ప్రణాళిక సిద్ధం చేయడం ద్వారా ఎరువులు, విత్తనాల కొరతను అధిగమిస్తున్నారు.