గాంధీజీ కలలుగన్న స్వరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. గ్రామాల అభివృద్ధే దేశ ప్రగతికి నిదర్శనంగా నిలుస్తుందని భావించారు. ఆ దిశగానే ఊరూరా పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పరిశుభ్రత, స్వచ్ఛతే లక్ష్యంగా దశలవారీగా పల్లెప్రగతి కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామాల్లో పేరుకుపోయిన చెత్త, చెదారం, మురుగు కాల్వలను శుభ్రపరచడం, పరిసరాల శుభ్రత, ఎవెన్యూ ప్లాంటేషన్, నర్సరీ, డంపింగ్ యార్డుల్లో పిచ్చి మొక్కల తొలగింపు, వైకుంఠ ధామాల నిర్మాణం, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం తదితర కార్యక్రమాలతో పల్లెలు పరిశుభ్రతతో అలరారుతున్నాయి. దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి. పాడుబడిన బావులు, బోర్లను గుర్తించి పూడ్చి వేస్తున్నది. శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహించనున్నారు.
నల్లగొండ, జూన్ 14 : పల్లె ప్రగతి పేరుతో నెల నెలా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు ఆయా పల్లెలకు వన్నె తెస్తున్నాయి. తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వగా రెండోసారి వచ్చాక 2019 సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఈ నిధుల విడుదల 45 నెలలుగా కొనసాగుతుండగా నల్లగొండ జిల్లాకు మొత్తం ప్రగతి నిధులతోపాటు ఇతర పథకాల కింద ఈ 9 ఏండ్లల్లో రూ.1,678 కోట్లు వచ్చాయి. ఈ నిధులతో తొలుత పారిశుధ్యంపై దృష్టి పెట్టిన గ్రామ పంచాయతీలు ఇతర నిధులతో గ్రామాల్లో కావాల్సిన సౌకర్యాలు సమకూర్చుకోవటంలో నిమగ్నమయ్యాయి. ఇదిలా ఉండగా వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్లు, పంట కళ్లాలు, గ్రామ పంచాయతీ భవనాలు, క్రీడా మైదానాలు నిర్మించుకోవటంతోపాటు ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ సమకూర్చుకొని పల్లెలను పట్టు సీమలుగా మారుస్తున్నది.
ప్రధానంగా 13 అంశాలపై దృష్టి సారించి 45 నెలల్లోనే గణనీయమైన ప్రగతి సాధించింది. ఇందుకు గానూ తొలుత 2019 సెప్టెంబర్లో పల్లె ప్రగతి నిర్వహించి పారిశుధ్య పల్లెలుగా మార్చింది. అందుకు గానూ 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి మనిషి నెలకు రూ.187 చొప్పున నల్లగొండ జిల్లాలో ఉన్న జనాభా ఆధారంగా 844గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ల ద్వారా ఎస్ఎఫ్సీ, ఫైనాన్స్ కమిషన్ ద్వారా నెలకు రూ.20 కోట్ల చొప్పున విడుదలవడంతో ప్రతి పల్లె స్వచ్ఛ గ్రామాలుగా మారాయి.
పంచాయతీకో ట్రాక్టర్..
పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి పంచాయతీకి ట్రాక్టర్తోపాటు, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు చేసి ఆ ట్రాక్టర్తో చెత్త సేకరణ, ట్యాంకర్తో ఇతర నీటి అవసరాలు తీర్చటం లాంటివి చేపట్టి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. జిల్లాలో 844 గ్రామాల్లో ట్రాక్టర్లకు రూ.73.40 కోట్లను ప్రభుత్వం అందచేసింది.
ఊరికో డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు
ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డుతోపాటు అందులో సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణం చేపట్టింది. వీటి నిర్మాణాలకు ప్రతి గ్రామానికి రూ.2.50 లక్షలు కేటాయించింది. డంపింగ్ యార్డుల్లో చెత్త పోస్తున్నప్పటికీ సెగ్రిగేషన్ షెడ్డులో తడి, పొడిచెత్తను వేర్వేరుగా పోసి ఆ చెత్తను రీసైక్లింగ్ చేసి ఎరువులు తయారు చేయించే దిశగా చర్యలు చేపట్టింది. ఇందుకు గానూ రూ.38 కోట్లు ఖర్చు చేసింది.
పల్లెకో వైకుంఠధామం..
ఎవరు ఎన్ని ఏండ్లు బతికినా ప్రతి మనిషికీ చివరి మజిలీ తప్పదు. ఇందుకు ప్రతి గ్రామంలో వైకుంఠధామం నిర్మాణం చేపట్టడంతో నేడు జిల్లాలోని అన్ని గ్రామాల్లో తుది దశలో ఉన్నాయి. ఇందుకు గానూ ప్రతి వైకుంఠధామానికి రూ.12.60 లక్షలు కేటాయించటంతో జిల్లా వ్యాప్తంగా వైకుంఠధామాలకు రూ.92.15 కోట్లు అయ్యాయి.
పల్లె ప్రకృతి వనాలు
జిల్లాలో అటవీ శాతం పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2014లో హరితహారం ప్రారంభించింది. అందులో భాగంగానే గ్రామ పంచాయతీలతోపాటు ఆవాసాల్లోనూ పల్లె ప్రకృతి వనాల నిర్మాణం చేపట్టింది. ఇందుకు గానూ ప్రతి గ్రామంలో అర ఎకరం నుంచి ఎకరం వరకు స్థలాన్ని సేకరించి ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వం భూమి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పది ఎకరాలు సేకరించి జిల్లాలో 87 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటుచేసింది.
క్రీడా మైదానాలు..
పాఠశాలలు కేవలం విద్య కోసమే కాకుండా ఖాళీ సమయంలో క్రీడలపై దృష్టి సారించాలనే ఆలోచనతో ప్రభుత్వం ప్రతి పాఠశాలలో తెలంగాణ క్రీడా మైదానాలు ఏర్పాటు చేసింది. ప్రతి పాఠశాల లేదంటే సమీపంలో అర ఎకరం నుంచి ఎకరం వరకు స్థల సేకరణ చేసి వాటిని ఏర్పాటు చేశారు. జిల్లాలో 400 క్రీడా మైదానాలు ఏర్పాటుతోపాటు క్రీడా మెటీరియల్ కోసం రూ.12.66 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది.
ఇంటికో ఇంకుడు గుంత..
ఇంట్లోని మురుగు వీధుల్లోకి వచ్చి వీధులను అపరిశుభ్రంగా చేయకుండా ఉండేందుకు ఇంటికో ఇంకుడుగుంత నిర్మించుకోవాలని సూచించిన సర్కార్ అందుకు ప్రతి ఇంకుడు గుంతకు ఆరు వేలు కేటాయించింది. జిల్లా వ్యాప్తంగా 80వేల ఇంకుడు గుంతలు తీయగా మొత్తం రూ.48 కోట్లు వెచ్చించింది.
పంట ఆరబోతకు కళ్లాలు..
కోసిన పంటను ఆరబెట్టేందుకు అనువైన స్థలాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పంట ఆరబోతకు కళ్లాలను మంజూరు చేసింది. విస్తీర్ణాన్ని బట్టి ఒక్కో కళ్లానికి రూ.65 వేలు, 75 వేలు, 85 వేలు కేటాయించటంతో ఇప్పటి వరకు జిల్లాలో 2,400 మంది నిర్మించుకోగా వారికి రూ.8.50 కోట్లు అందించింది.
నేడు పల్లె ప్రగతి ఉత్సవాలు..
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహించనున్నారు. గ్రామపంచాయతీల్లో జెండాలు ఎగురవేయనున్నారు. పల్లె ప్రగతి ద్వారా వచ్చిన నిధులు వివరాలు, సంక్షేమ పథకాల ద్వారా జరిగిన లబ్ధి, గ్రామంలో నిర్మించిన మౌలిక వసతుల వివరాలను ప్రకటించనున్నారు.
పంచాయతీలను పచ్చగా మార్చేందుకు నర్సరీలు..
గ్రామాలు పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం హరితహారంపై దృష్టి పెట్టింది. ఇందుకు ఆయా గ్రామాల పాలకవర్గాలను, అధికార యంత్రాంగాన్ని బాధ్యులుగా చేసి ఊరికో నర్సరీ ఏర్పాటు చేసింది. ప్రతి నర్సరీలో కనీసం పది వేల మొక్కలు పెంచాలని నిబంధన పెట్టిన ప్రభుత్వం అందుకు గానూ రూ.2 లక్షలు కేటాయించింది. ఈ నిధులతో మొక్కలు పెంచడంతో పాటు ఏడాది పాటు నీళ్లు పోసేందుకు ట్రాక్టర్, వాచర్కు నిధులు ఇచ్చింది. అవెన్యూ ప్లాంటేషన్ కింద పెద్ద మొక్కలు నాటడం, ఖాళీ స్థలాల్లో బ్లాక్ ప్లాంటేషన్ చేయటం, కోతులకు ఆహార శాలలు ఏర్పాటు చేయడం, ఇంటింటికీ ఆరు పండ్ల మొక్కలు ఇవ్వటం హరిత హారంలో భాగం చేశారు.
రైతుల సమావేశాలకు వేదికలు..
రైతులకు ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో వ్యవసాయ క్లస్టర్కు ఒక వేదిక నిర్మించాలని యోచించి ఒక్కో వేదికకు రూ.22.50 లక్షలు కేటాయించటంతోపాటు వెంటేనే విడుదల చేయటంతో నల్లగొండ జిల్లాలో 140, సూర్యాపేటలో 112 రైతు వేదికలు ఇప్పటికే పూర్తి కాగా వాటికి విద్యుత్, ఇతర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఇక జిల్లాలో కొత్తగా 349 గ్రామపంచాయతీలు ఏర్పాటు చేయగా అందులో 210 భవనాల నిర్మాణాలకు రూ.42 కోట్లు కేటాయించగా అవి నిర్మాణంలో ఉన్నవి.
నేడు ప్రతి పల్లె మెరుస్తున్నది
గతంలో మూడు, నాలుగు నెలలకు ఒకసారి పల్లెల్లో పారిశుధ్యానికి నిధులు రాగా, 2019 సెప్టెంబర్ నుంచి ప్రతి నెల జిల్లాకు రూ.20 కోట్లు పల్లె ప్రగతి కింద వస్తుండగా వాటిలో గ్రామ పంచాయతీలకు రూ.15 కోట్ల దాకా వస్తున్నాయి. 2014 నుంచి మూడు నెలలకు ఒకసారి ఇవ్వగా 2019 నుంచి ప్రతి నెలా ఇవ్వటంతోపాటు ప్రతి గ్రామంలో ట్రాక్టర్ కొనుగోలు చేసి చెత్త సేకరణ చేయటంతో ప్రతి పల్లె నేడు పరిశుభ్రంగా దర్శనమిస్తుంది. పారిశుధ్య కార్మికుల జీతాలు సైతం రూ.1500 నుంచి రూ.9,500 పెంచడంతో రెగ్యులర్గా వారు పని చేస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి పల్లె ప్రగతి కింద ప్రభుత్వం 9 ఏండ్లల్లో రూ.1,154 కోట్లు సర్పంచుల ఖాతాల్లో జమ చేసింది.
-విష్ణువర్ధన్రెడ్డి, డీపీఓ, నల్లగొండ