నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమ సారథి, స్వరాష్ట్ర సాధకుడు, అభివృద్ధి కాముకుడు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలను నేడు ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధంమైంది. శనివారం కేసీఆర్ 70వ పుట్టిన రోజును ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, వివిధ వర్గాల ప్రజలు ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. నియోజకవర్గాల వారీగా వేడుకలను మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున చేపట్టాలని భావిస్తున్నారు.
పార్టీ శ్రేణులతోపాటు అభిమానులు, వివిధ వర్గాల ప్రజలు, సంఘాల ఆధ్వర్యంలోనూ పలు సేవా కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎక్కడికక్కడే కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. వీలైన చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల్లోనూ అన్నదానం, ఇతర వస్తువులను పంపిణీ చేయనున్నారు. వీటితోపాటు ప్రభు త్వ ఆస్పత్రుల్లో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్ పంపిణీకి సిద్ధ్దమవుతున్నారు. ఈ నెల 13న నల్లగొండలో జరిగిన కేసీఆర్ బహిరంగ సభ స్ఫూర్తితో అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా పలు కార్యక్రమాల నిర్వహణలో భాగస్వాములు అయ్యేందుకు పార్టీ శ్రేణులంతా ఉత్సాహంతో కనిపిస్తున్నారు.
ఇదే సందర్భంగా కేసీఆర్కు అత్యంత ఇష్టమైన హరితహారంలో భాగంగా పలుచోట్ల మొక్కలు నాటేందుకు కూడా సన్నద్ధమవుతున్నారు. అధినేత కేసీఆర్ బర్త్డే వేడుకల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు.
సీఎంగా ఉమ్మడి జిల్లాను గత పదేండ్లు అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్కు ఆయన పుట్టిన రోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై కృతజ్ఞత చాటాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా, దేవరకొండ పట్టణంలో కేక్ కట్ చేయడంతో పాటు పండ్లు పంపిణీ చేయాలని, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు.