హుజూర్నగర్, సెప్టెంబర్ 21 : ఆహార భద్రత (రేషన్) కార్డులో పేర్కొన్న సభ్యులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆరు కిలోల చొప్పున బియ్యం అందజేస్తున్నది. అయితే.. కార్టుల్లో మృతిచెందిన వారు, పెండ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లి పోయినవారు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డ వారు కూడా ఉన్నారు. చాలా చోట్ల రేషన్ డీలర్లు వారి పేర్లను తొలగించకుండా అలాగే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నిరుపేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ప్రజా పంపిణీ బియ్యం దుర్వినియోగం కాకుండా చర్యలు చేపట్టాలని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
ప్రతి రేషన్ కార్డులోని సభ్యులందరి పేర్లను ధ్రువీకరించేందుకు వారి వేలి ముద్రలు సేకరించి కేవైసీ పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రేషన్ కార్డులో పేర్లు ఉన్న ప్రతి లబ్ధిదారుడు తమ పరిధిలోని రేషన్ దుకాణానికి వెళ్లి ఈ పాస్ యంత్రంలో వేలి ముద్రలు వేసి కేవైసీ నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ప్రారంభమైది. రేషన్ దుకాణాల్లో మాత్రమే వేలి ముద్రలు సేకరించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దాంతో డీలర్లు తమ దుకాణాల పరిధిలోని కార్డుదారులకు సమాచారం అందించి ఒకేసారి కుటుంబ సభ్యులంతా వచ్చి వేలి ముద్రలు వేసుకొని కేవైసీ పునరుద్ధరించుకోవాలని సూచిస్తున్నారు.
కేవైసీ నమోదు ఇలా..
రేషన్ కార్డు కలిగిన కుటుంబ యాజమానితోపాటు కార్డులో పేర్లు ఉన్న వారంతా సమీప రేషన్ దుకాణానికి వెళ్లాలి. సంబంధిత డీలర్ ఈ పాస్ యంత్రంలో రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేస్తారు. అందులోని కుటుంబ సభ్యులందరి పేర్లు ఆధార్ కార్డు నెంబర్తో చూపిస్తుంది. వాటిని సరిచూసిన తరువాత ఒక్కొక్కరి వేలి ముద్ర తీసుకుంటారు. ఆకుపచ్చ లైటు వెలిగితే సదరు సభ్యుల కేవైసీ పునరుద్ధరణ పూర్తయినట్లు. ఒకవేళ ఈ పాస్ యంత్రంలో ఎరుపు రంగు లైటు వెలిగితే వినియోగదారుడి రేషన్ కార్డు, ఆధార్ సరిపోలలేదంటూ రిజెక్ట్ సూచిస్తుంది. దీంతో ఒక యూనిట్ రేషన్ కార్డు నుంచి తొలగింపునకు గురవుతుంది. రేషన్ కార్డులో ఎన్ని పేర్లు ఉన్నాయో వారంతా రేషన్ దుకాణానికి కేవైసీ కోసం ఒకేసారి రావాల్సి ఉంటుంది.
ఈ-కేవైసీ చేయించుకోవాల్సిందే..
జిల్లాలో రేషన్ కార్డు కలిగి ఉన్నవారు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేసుకోవాలి. కార్డులోని కుటుంబ సభ్యులంతా తమ సమీప రేషన్ షాపులో ఈ పాస్ యంత్రంలో వేలి ముద్రలు వేయాలి. ఉపాధి, ఇతర పనుల కోసం వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారు తమ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి నమోదు చేసుకోవచ్చు. రేషన్ బియ్యం సరఫరా నిలిచిపోకుండా ఉండాలంటే ఇంట్లో ఎంత మంది సభ్యులుంటే అందరూ ఈ కేవైసీ తప్పకుండా నమోదు చేసుకోవాల్సిందే.
– వి.మోహన్బాబు, డీఎస్ఓ, సూర్యాపేట జిల్లా