– నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ సిటీ, జనవరి 03 : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల ప్రాణాలను కాపాడాలనే ముఖ్య లక్ష్యంతో ఈ నెల 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ మాసోత్సవాల ప్రారంభ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల వాల్ పోస్టర్ను ఎస్పీ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మానవ నిర్లక్ష్యం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వల్లే జరుగుతున్నాయని, దీనిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ మాసోత్సవాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని విద్యా సంస్థలు, బస్స్టాండ్లు, ప్రధాన కూడళ్లు, మార్కెట్ ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో, ఆటో, లారీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ద్వారా విస్తృత ప్రచారం చేపడుతున్నట్లు వెల్లడించారు.
ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి తలకు తీవ్ర గాయాలై అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మోటర్ వాహనాల చట్టం 1988 ప్రకారం హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరిగా అమలు చేయాలనే ఉద్దేశంతో “ నో హెల్మెట్ – నో పెట్రోల్ ” అనే నినాదాన్ని జిల్లాలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంక్ యజమానులతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించి, ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా ప్రజల ప్రాణాలు కాపాడుటలో వారి వంతు సహకారంగా హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకే పెట్రోల్ అందించే విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని సూచించినట్లు ఎస్పీ తెలిపారు. కావున జిల్లాలోని ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ అందించబడదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
అలాగే ప్రతి వాహనదారుడు సీటు బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, అధిక వేగంతో వాహనాలు నడపరాదని, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, కాబట్టి అటువంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటూనే, అవసరమైన చోట కౌన్సిలింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి, అడిషనల్ ఎస్పీ రమేశ్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, జిల్లా ట్రాన్స్పోర్టు అధికారి లావణ్య, ఎస్.బి సీఐ రాము, టూ టౌన్ సీఐ రాఘవరావు, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, డి.టి.ఆర్బీ రిటైర్డ్ సీఐ అంజయ్య పాల్గొన్నారు.