ముఖ్యమంత్రి కేసీఆర్ జేబులు నింపుతున్నరు
ప్రధాని మోదీ ఆ జేబులకు చిల్లు పెడుతున్నరు
దేశ పౌరులుగా ప్రభుత్వోద్యోగులు మరో పోరాటానికి సన్నద్ధం కావాలి
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
టీఎన్జీఓస్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
నీలగిరి, ఫిబ్రవరి 28 : పెరుగుతున్న ధరలు, ఖర్చులకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల జేబులను నింపుతుంటే.. ప్రధాని మోదీ ఆ జేబులకు చిల్లులు పెడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మండిపడ్డారు. మోదీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను దేశ పౌరులుగా ఎండగట్టేందుకు ప్రభుత్వోద్యోగులు పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన టీఎన్జీఓస్ స్టాండింగ్ కమిటీ సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ సంఘం నూతన సంవత్సరం డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ సంపదను పెంచాలి, పెరిగిన సంపదను పేదలకు పంచాలి అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమైతే.. పెరిగిన సంపదను అందిన కాడికి కార్పొరేట్లకు దోచిపెట్టాలన్నది ప్రధాని మోదీ ఆలోచన అని ఎద్దేవా చేశారు. పెరిగిన జీతభత్యాలకు అనుగుణంగా ఆదాయ పన్ను పరిమితిని పెంచకుండా ఏండ్ల తరబడి కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నదని దుయ్యబట్టారు. రాష్ట్ర సాధనలోనే గాక, స్వరాష్ట్రంలో ప్రభుత్వం సాధించిన ప్రతి విజయంలో ఉద్యోగుల భాగస్వామ్యం మరువలేనిదన్నారు. ఉద్యోగుల సహకారంతోనే రాష్ట్రంలో కరువు, ఆకలి, దరిద్రం మీద అద్భుతమైన విజయాలను నమోదు చేసుకున్నామని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రవీందర్, జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ పాల్గొన్నారు.
పెరుగుతున్న ధరలకు, ఖర్చులకు అనుగుణంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల జేబులు నింపుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ వారి జేబులకు చిల్లులు పెడుతున్నాడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆరోపించారు. టీఎన్జీఓస్ నల్లగొండ జిల్లా స్టాండింగ్ కమిటీ సమావేశాలను ఆయన ప్రారంభించి ఆ సంఘంతోపాటు అనుబంధ సంఘాల డైరీలు, క్యాలెండర్లను నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ సర్కారు విధానాలపై దేశ పౌరులుగా ప్రభుత్వ ఉద్యోగులు స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తు చేశారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులు మోదీ సర్కారు విధానాలను ఎండగట్టేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సంపదను పెంచాలి.. పెరిగిన సంపదను పేదలకు పంచాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పం అయితే, పెరిగిన సంపదను వారికి అందిన కాడికి దోచి పెట్టాలనేది మోదీ ఆలోచన అని ఎద్దేవా చేశారు. నానాటికి దేశంలో దారిద్య్ర రేఖ పెరిగిపోతుందని, అందుకు ప్రధాని అవలంబిస్తున్న విధానాలే కారణమన్నారు. పీఆర్సీ, ఇంక్రిమెంట్లు, ఫిట్మెంట్లను ప్రభుత్వ ఉద్యోగస్తులు కొట్లాడి సాధించుకుంటే ఇన్కంట్యాక్స్ రూపంలో మోదీ సర్కారు కొల్లగొడుతుందని దుయ్యబట్టారు. ఉద్యోగస్తులకు పెరిగిన జీతభత్యాలకు అనుగుణంగా ఇన్కం ట్యాక్స్ పరిధిని పెంచాల్సిన కేంద్ర ప్రభుత్వం మీనమేశాలు లెక్కిస్తుందని విరుచుకుపడ్డారు. అర్థం లేని ఆరోపణలు, అపోహలు, బురద జల్లే ప్రయత్నాలను అధిగమించి సీఎం కేసీఆర్ మనసు ఎరిగి నడుచుకున్న టీఎన్జీఓస్ నాయకులు అనేక సమస్యలు సహృదయ వాతావరణంలో పరిష్కరించుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ విజయంలోనే కాదు, వచ్చిన రాష్ట్రంలో ప్రభుత్వం సాధించిన ప్రతి విజయంలో ఉద్యోగుల భాగస్వామ్యం ఉందన్నారు.
ఉద్యోగుల సహకారంతో రాష్ట్రంలో కరువు, ఆకలి, దారిద్రం మీద అద్భుత విజయాలు నమోదు చేశామన్నారు. అన్నింటికీ మించి ఇంజినీర్ అవతారమెత్తి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు సంకల్పించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉద్యోగుల శ్రమ ఉందని మంత్రి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాను ఫ్లోరోసిస్ రూపంలో కబలించిన ఫ్లోరిన్ మహమ్మరిని పారదోలేందుకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించి అమలుపరిచిన మిషన్ భగీరథ పథకం విజయవంతం కావడంలో ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. అటువంటి ఉద్యోగుల జేబులు కొట్టేందుకు ప్రయత్నిస్తున్న మోదీ సర్కారును ఎండగట్టాల్సిన సమయం అసన్నమైందని అన్నారు. టీఎన్జీఓస్ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ పెట్టి 25 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిందన్నారు. జీఓ 317లో ఏ ఉద్యోగికి ఇబ్బంది లేదని, కొందరు కావాలని రాద్ధాంతం చేశారని అన్నారు. భార్యభర్తల సమస్యలకు కూడా పరిష్కారం వస్తుందని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో రానున్నాయని, సర్వీస్ ప్రొడక్ట్ సంబంధించి మార్గదర్శకాలు వచ్చాయని తెలిపారు. ఉద్యోగులను కంటికి రెప్పలా చూసుకుంటున్న సీఎం కేసీఆర్కు బాసటగా ప్రతి ఉద్యోగి నిలువాలని కోరారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలు రాష్ట్రం వైపు చూస్తున్నారంటే సీఎం కేసీఆర్ పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన ఘనత ఉద్యోగులదేనని కొనియాడారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, మాజీ జిల్లా అధ్యక్షులు పందిరి వెంకటేశ్వరమూర్తి, దామెదర్రెడ్డి, డీఎంహెచ్ఓ డా.కొండల్రావు, డీఆర్డీఓ కాళిందిని, ఐసీడీఎస్ పీడీ సుభద్ర, హౌసింగ్ పీడీ రాజ్కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు, నాయకులు చేపూరి నర్సింహచారి, నాగిళ్ల మురళి, నాగరాజు స్వామి, దశరథ, జిల్లా అధ్యక్షుడు శ్రవణ్కుమార్, నాయకులు డీఐ రాజు, విశ్వేశ్వర్రావు, వంగూరి విజయ్కృష్ణ, ఎం.శ్రీనివాస్, సునీత, సహకార శాఖ నాయకులు అలీం, దశరథ, రేణుక, రజిత, జ్యోత్స్న పాల్గొన్నారు.