తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్
కార్పొరేషన్ చైర్మన్గా తిప్పన విజయసింహారెడ్డి నియమితులయ్యారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డిగూడేనికి చెందిన విజయసింహారెడ్డి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్నారు. తెలంగాణ ఉద్యమానికి, పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు లభించగా విజయసింహారెడ్డితో కలిపి ఆరవది. ఆయన నియామకంపై పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
– మిర్యాలగూడ, నవంబర్30
మిర్యాలగూడ, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తిప్పన విజయసింహారెడ్డిని నియమిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డిగూడేనికి చెందిన విజయసింహారెడ్డి 2001 టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంటే నడిచారు. 2001 నుంచి 2006 వరకు టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. ఈ సమయంలో జిల్లాలో 9 జడ్పీటీసీ, 9 ఎంపీపీలను గెలిపించి పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు.
అనంతరం 2006లో కాంగ్రెస్లో చేరి 2016 వరకు కొనసాగారు. 2016లో తిరిగి టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తున్నారు. తిప్పన 1989 నుంచి 1994 వరకు మిర్యాలగూడ ఎమ్మెల్యేగా, ఇదే సమయంలో ఆర్టీసీ తెలంగాణ గో ల్కొండ రీజియన్ చైర్మన్గా పని చేశారు. 200 4లో కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పొత్తు ఉన్నా మిర్యాలగూడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ అభ్యర్థిగా ఫ్రెండ్లీ కాంటెస్టు చేసి 56 వేల ఓట్లు సాధించారు. ప్రస్తుతం మిర్యాలగూడ జడ్పీటీసీగా కొనసాగుతున్నారు.
మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో టీఆర్ఎస్ ఉన్నత శిఖరాలకు చేరుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ గుబాళిస్తుండగా తాజాగా మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ విజయం సాధించింది. తదనుగుణంగా సీఎం కేసీఆర్ జిల్లాకు కా ర్పొరేషన్ పదవుల విషయంలో పెద్ద పీట వేస్తున్నారు.ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు లభించగా విజయసింహారెడ్డిది ఆరోవది.
జిల్లాకు చెందిన దూదిమెట్ల బాలరాజు గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కాగా రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ కో-ఆపరేటివ్ చైర్మన్ రామచందర్నాయక్, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్గా కంచర్ల రామకృష్ణారెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా మేడె రాజీవ్సాగర్, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా సోమ భరత్కుమార్ ఉండగా తాజాగా అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తిప్పన నియామకమయ్యారు. తనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్కు తిప్పన విజయసింహారెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో చైర్మన్ పదవిని ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తిప్పన విజయ సింహారెడ్డికి కార్పొరేషన్ పదవి రావడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.