కట్టంగూర్, జనవరి 8 : మండలంలో 65వ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో 65వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగింది. నకిరేకల్ సీఐ వెంకటయ్య, కట్టంగూర్ ఎస్ఐ విజయ్కుమార్ తెలిపన వివరాల ప్రకారం…
ఖమ్మం పట్టణంలోని ఖిలా బజార్కు చెందిన 9 మంది యువకులు ఎండీ ఇమిదాద్, ఎస్కే సమీర్, ఎస్కే యాసిన్, ఎండీ అత్తార్, ఎస్కే ఆరిఫ్, ఎస్కే కరీం, ఎస్కే సల్మాన్, అర్షద్ అలీ తమ స్నేహితుడైన ఎండీ సోహెల్ చెల్లెలు వివాహ వలిమా(రిసెప్షన్)కు శనివారం సాయంత్రం ఇన్నోవా కారులో హైదరాబాద్లోని మొయినాబాద్కు వెళ్లారు. రిసెప్షన్ అనంతరం సోహెల్తో సహా 9 మంది యువకులు కారులో తిరిగి ఖమ్మం బయల్దేరారు. మార్గమధ్యంలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఎరసానిగూడెం స్టేజీ వద్దకు రాగానే డ్రైవింగ్ చేస్తున్న అర్షద్ అలీ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దాంతో కారు అదుపుతప్పి జాతీయ రహదారి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం రోడ్డుపై పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది.
ప్రమాదంలో ఎండీ ఇమిదాద్(21) ఎస్కే సమీర్(21)ఎస్కే యాసిన్(18) తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్ అర్షద్ అలీ, ఎస్కే కరీమ్, ఎస్కే సల్మాన్లకు తీవ్రగాయాలు కాగా ఎండీ సోహెల్, ఎండీ అత్తార్, ఎస్ఏ ఆరిఫ్లకు స్వల్పగాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నార్కట్పల్లి కామినేని దవాఖానకు తరలించారు. సోహెల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు.
మృతులంతా రోజు వారి కూలీలే..
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకులంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. ముగ్గురు యువకులు ఖమ్మంలో రోజు వారి కూలీలుగా టైల్స్ వేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. ఇమిదాద్ పదో తరగతి వరకు చదువగా తండ్రి చనిపోవడంతో రోజు వారి పని చేస్తూ ఇటీవలే చెల్లెలు పెండ్లి చేశాడు. సమీర్, యాసిన్ది కూడా బీద కుటుంబం. వీరు అద్దె ఇంట్లోఉంటున్నారు. తల్లిదండ్రులు కూరగాయలు, బట్టల మార్కెట్, పాత ఇనుప సామాను దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం : నకిరేకల్ సీఐ వెంకటయ్య
రోడ్డు మీద సరైన అవగాహన లేకపోవడంతోపాటు అతివేగం, అజాగ్రత్తే ప్రమాదానికి కారణం. కారు డ్రైవింగ్ చేస్తున్న అర్షద్ అలీ నిద్రమత్తులో వేగాన్ని అదుపు చేయలేక డివైడర్ను ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని డేంజర్ జోన్గా ప్రకటించి హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేశాం. వాహనదారులు గమనించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి.
మరో ప్రమాదంలో యువకుడు..
కట్టంగూర్ : మండలంలోని అయిటిపాముల గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన నిమ్మనగోటి లింగయ్య(32) నకిరేకల్లో బైక్ మెకానిక్గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై చిట్యాలలో ఉన్న తన అన్న వద్దకు బయల్దేరాడు. మార్గమధ్యంలో అయిటిపాముల గ్రామ శివారులోని పత్తి మిల్లు సమీపంలో బైక్ను తూఫాన్ వాహ నం వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయాలైన లింగయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఐ అంజయ్య తెలిపారు.