కోదాడ / హుజూర్నగర్, అక్టోబర్ 6 : సూర్యాపేట జిల్లాకు మూడు కోర్టులు మంజూరయ్యారు. కోదాడకు ప్రస్తుతమున్న రెండు కోర్టులకు అదనంగా మరో 2 కోర్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు న్యాయశాఖ నుంచి శుక్రవారం జీఓ 60 విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 59లో మరో మూడు కోర్టులు అదనంగా చేరనున్నాయి. ప్రస్తుతం కోదాడలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, అడీషినల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉండగా తాజాగా సీనియర్ సివిల్ జడ్జి , అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు మంజూరు అయ్యాయి. కోదాడకు నూతనంగా 2 కోర్టులు మంజూరుపై బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవబత్తిని నాగార్జునరావు, సెక్రటరీ సాధు శరత్బాబు, కార్యవర్గ సభ్యులు సీనియర్, జూనియర్ న్యాయవాదులు హర్షం వ్యక్తంచేశారు.
కోర్టు ఆవరణలో స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. నూతన కోర్టుల ఏర్పాటులో మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ సహకారం ఎనలేనిదని కొనియాడారు. హుజూర్నగర్కు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్ష, అధికార ప్రతినిధులు సాముల రామిరెడ్డి , కాల్వ శ్రీనివాస్రావు తెలిపారు. హుజూర్నగర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 8వేలకు పైగా కేసులు పెండింగ్లో ఉండటం వల్ల ఒక న్యాయమూర్తి విచారణతో ఆలస్యం అవుతుందన్నారు. దీనిపై న్యాయవాదులు ప్రభుత్వానికి విన్నవించుకోగా వెంటనే నూతన కోర్టును మంజూరు చేసినట్లు తెలిపారు. నూతన కోర్టు మంజూరుపై న్యాయవాదులు హర్షం వ్యక్తంచేశారు.