మునుగోడు, డిసెంబర్ 1 : సాగునీటికి ఆయువు పట్టువైన మునుగోడు వాగు నూతన శోభను సంతరించుకున్నది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన ప్రజల కళను ప్రభుత్వం సాకారం చేసింది. మండలంలలోని వాగులపై మూడు చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భజలాలు పెరిగి రెండు పంటలకు సమృద్ధిగా నీరు అందుతుందని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. గతంలో భూగర్భ జలాలు పడిపోయి ఒక పంట మాత్రమే పండేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు చెక్డ్యాంల నిర్మాణాలు పూర్తి
మండలంలోని పెద్ద వాగుతో పాటు ఇప్పర్తి, పలివెల వాగులపై 2020లో ప్రభుత్వం రూ.8.72 కోట్ల వ్యయంతో చెక్డ్యాంల నిర్మాణం చేపట్టింది. 2021మార్చి నెల నాటికి అవి పూర్తయ్యాయి. ప్రస్తుతం మండలంలోని చెక్డ్యాంలు జల సిరులతో కళకళలాడుతున్నాయి. దీంతో ఇప్పుడు ఇపర్తి, పలివెల, ఎలగలగూడెం, చీకటిమామిడి, ఊకొండి, తాళ్లవెల్లంలతో పాటు పలు గ్రామల్లో భూగర్భజలాలు పెరిగి పెద్ద మొత్తంలో సాగవడంతో కూలీల వలసలు ఆగిపోయాయి.
రెండు కార్లు బోర్లు పోస్తున్నయ్
మా భూమి దగ్గరలో వాగుపై ప్రభుత్వం చెక్డ్యాం ఏర్పాటు చేయడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిండి అలుగు పోస్తున్నది. దీంతో పరిసర ప్రాంతంలోని వందలాది బోర్లు రీచార్జి అయ్యి రెండు సీజన్లు పంటలు పండించుకుంటున్నాం. సీఎం కేసీఆర్ స్వయానా రైతు కావడంతో నీటి వనరులకు ప్రాముఖ్యం ఇస్తున్నరు.
– పెరమాళ్ల యాదగిరి, రైతు, మునుగోడు
వేసవిలో తాగునీటి ఎద్దడి అరికట్టాం
మునుగోడు మేజర్ గ్రామపంచాయతీకి వాగులోని బోర్లతోనే మంచినీరు సరఫరా చేసేవాళ్లం. వేసవిలో వాగులోని బోర్లు ఎండి పోయి నీటి సరఫరాకు ఇబ్బందయ్యేది. మునుగోడు పెద్ద వాగుపైన ప్రభుత్వం నిర్మించిన చెక్డ్యాంతో భూగర్భ జలాలు పెరిగి వాగులో వేసిన బోర్లు సంవత్సరం పొడుగునా నీరందిస్తున్నాం.
– మిర్యాల వెంకన్న సర్పంచ్, మునుగోడు