కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా దాటక ముందే ఆ పార్టీ నేతలు ఆగడాలు షురూ అయ్యాయి. అధికార పార్టీ నేతలం మమ్మల్నేం చేస్తారులే అనుకున్నారో ఏమో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఏకంగా వేరొకరి పేరుపై ఉన్న భూములకు వ్యతిరేకంగా సర్టిఫికెట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. సామాన్య జనం నుంచి రూ. లక్షలు వసూలు చేశారు. నివాస ధ్రువీకరణ పత్రాలు, రబ్బరు స్టాంపులు ఫేక్ క్రియేట్ చేయడంతోపాటు ఇంటి పన్ను రసీదులను మాయం చేశారు. గ్రామ కార్యదర్శి
సంతకం ఫోర్జరీకి పాల్పడ్డారు. విషయం బయటకు పొక్కడంతో నారాయణపురం పోలీస్ స్టేషన్లో
కేసు నమోదైంది.
నారాయణపురం మండల కేంద్రానికి చెందిన ఏపూరి శివయ్య కుటుంబ సభ్యులకు సంబంధించి వివాదం ఉన్నది. వార్డు నంబర్ 14లో గల 13-33లో తన భూమి ఉందని, తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని గ్రామ కార్యదర్శి నరేశ్కు అర్జీ పెట్టుకున్నాడు. అందుకు సంబంధించి డాక్యుమెంట్లు లేవని, ఆ స్థలం వేరే పేరు మీద ఉండటంతో సెక్రటరీ తిరస్కరించాడు. ఈ విషయం తెలుసుకున్న అప్పటి గ్రామ ఉప సర్పంచ్, కాంగ్రెస్ నేత ఉప్పరగోని సంజీవ.. శివయ్యను సంప్రదించారు. రిజిస్ట్రేషన్ చేయిస్తానని కొంత డబ్బు ఖర్చు అవుతుందని నమ్మక బలికాడు. దాంతో శివయ్య.. సంజీవకు భారీ మొత్తంలో డబ్బుతోపాటు పాస్ ఫొటోలు అప్పగించాడు. మూడు రోజుల తర్వాత ఇంటి పన్ను రసీదు, నివాస ధ్రవీకరణ పత్రాన్ని శివయ్యకు సంజీవ తెచ్చి ఇచ్చాడు.
దొంగ పత్రాల తయారీలో సంజీవతోపాటు చౌటుప్పల్లో రిజిస్ట్రేషన్ ఆఫీసు ఆవరణలో పనిచేసే ఏజెంట్ సందీప్ కీలకంగా వ్యవహరించారు. మొదటగా సెక్రటరీ ఆఫీసులోని ఇంటి పన్ను రసీదులను చించుకెళ్లారు. సీరియల్ నంబర్ 1796 నుంచి 1800 వరకు రసీదులను మాయం చేశారు. అందులోని ఓ రసీదు సంజీవ దగ్గర దొరికింది. ఇదిలా ఉండగా అచ్చంగా సెక్రటరీ ఇచ్చినట్లు ఇంటి నివాస ధ్రువీకరణ పత్రం క్రియేట్ చేశారు. దీనిపై సెక్రటరీ సంతకం, రబ్బర్ స్టాంప్ వేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా రబ్బర్ స్టాంప్లను తయారు చేయించారు.
స్థలం రిజిస్ట్రేషన్ కోసం పత్రాలు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ కోసం చౌటుప్పల్ వెళ్లాలని శివయ్యకు సంజీవ సూచించాడు. అక్కడ సందీప్ను సంప్రదించి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇక్కడే రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులకు పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. 1800 నంబర్ గల రసీదు పింక్ కలర్లో ఉంది. ఇది గ్రామ రికార్డుల్లో ఉండాలి. పన్ను చెల్లించిన వారికి తెల్ల కలర్ గల డూప్లికేట్ రసీదును ఇస్తారు. అంతేకాకుండా రౌండ్ సీల్పై జిల్లా పేరు యాదాద్రి భువనగిరి అని ఉండకుండా.. నల్లగొండ ముద్రించారు. సెక్రటరీ నరేశ్ సంతకం కాకుండా వేరే విధంగా ఉంది. దాంతో రిజిస్ట్రార్ ఆఫీసు అధికారులు సెక్రటరీకి సమాచారం అందించడంతో అసలు విషయం బయటపడింది. కాగా రిజిస్ట్రార్ ఆఫీసుకు తాజాగా ఇదే తరహాలో మరో దరఖాస్తు వచ్చినట్లు తెలిసింది. దీనిపై కూడా విచారణ చేస్తున్నట్లు చెబుతున్నారు.
దొంగ పత్రాలు సృష్టించి ఆయా స్థలాలపై రిజిస్ట్రేషన్ చేయిస్తామని సామాన్య జనం నుంచి సంజీవ లక్షల్లో డబ్బులు వసూలు చేశారని తెలుస్తున్నది. ఇలా ఐదు నుంచి పది మంది వరకు బాధితులు ఉన్నట్లు సమాచారం. శివయ్య, సంజీవ, సందీప్పై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.