నకిరేకల్, అక్టోబర్ 11 : ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు. నకిరేకల్ మండలంలో చీమలగడ్డ (దొడ్డు), చీమలగడ (సన్న), చందుపట్ల, తాటికల్లు, నెల్లిబండ పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో కొందరు నిర్వాహకులు రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల సమస్యలను విలేకరులు, అధికారులకు చెప్తే ధాన్యం కొనుగోలు చేయమని బెదిరిస్తున్నారు.
కొన్ని కేంద్రాల నిర్వాహకులు తమ మనుషులతో రైతులను భయపెడుతూ ఏ సమస్య వచ్చినా ఇటు విలేకరులకు గానీ, అటు జిల్లా అధికారులకు గానీ చెప్పొద్దంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా చెప్తే ధాన్యం కొనుగోలు చేయబోమని హెచ్చరిస్తున్నారు. ధాన్యం తడిసినా, టార్పాలిన్లు ఇవ్వకున్నా, సౌకర్యాలు లేకున్నా ఎవరికీ చెప్పవద్దని హుకుం జారీ చేస్తున్నారు. పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటే వారి ధాన్యం వివరాలను ట్యాబ్లో ఎంటర్ చేయకుండా, లారీల్లోకి ఎత్తకుండా చేస్తామని బెదిరిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా సివిల్ సప్లయీస్ అధికారులు, కోఆపరేటివ్ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు కానీ పట్టించుకోక పోవడం గమనార్హం.
జిల్లా అధికారులు వచ్చి హడావుడిగా తనిఖీ చేసి, సెంటర్ ఇన్ఛార్జీలు చెప్పింది విని వెళ్లిపోతున్నారని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ రైతు తమ సెంటర్ ఇన్ఛార్జి విషయమై నమస్తే తెలంగాణ విలేకరి వద్ద తన గోడు వెళ్లబోసుకున్నాడు.
ప్రతి సీజన్లో సీరియల్ ప్రకారం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, రాత్రికి రాత్రికి బస్తాలు మాయం చేస్తున్నాడని, సెంటర్ ఇన్ఛార్జి లేకుండా బయటి వ్యక్తులను పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ అడ్డగోలుగా సెంటర్ నిర్వహిస్తున్నాడని ఆరోపించాడు. మండలస్థాయి, నియోజకవర్గస్థాయి, జిల్లా స్థాయి అధికారులను శాసించే పరిస్థితి నకిరేకల్ ప్రాథమిక సహకార సంఘం కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జీలకు ఉందంటే అతిశయోక్తి కాదు. రైతుల దయనీయ పరిస్థితిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.