రాజాపేట, డిసెంబర్ 11 : మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేపడుతున్న 9వ రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలు సోమవారం మూడోరోజు హోరాహోరీగా సాగాయి. ఈ సందర్భంగా కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్, బాల్ బాడ్మింటన్, టెన్నికాయిట్, క్యారమ్, చెస్ పోటీలు నిర్వహించారు. కబడ్డీ అండర్-19 విభాగంలో లింగాల గురుకుల పాఠశాల, అండర్-17లో మునుగోడు జట్టు, అండర్-14 విభాగంలో విపనగండ్ల జట్టు ఫైనల్స్లో విజయం సాధించాయి.
వాలీబాల్ అండర్-17 విభాగంలో మునుగోడు జట్టు, బాల్ బ్యాడ్మింటన్ అండర్ -19 విభాగంలో పరిగి జట్టు విజయం సాధించాయి. జిల్లా సమన్వయ అధికారులు రజిని, శ్రీరామ్, క్రీడల ఇన్చార్జి ఉదయ్భాస్కర్ క్రీడా పోటీలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నర్సింహాచారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, పీడీ వెంకటేశ్వర్లు, పీఈటీ నరేశ్, 8జోన్ల క్రీడాకారులు పాల్గొన్నారు.