పెద్దగట్టు జాతరకు రెంచు వారాల సమయమే ఉండగా, ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 5కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో శాశ్వత, తాత్కాలిక వసతుల పనులు మరింత వేగం పుంజుకున్నాయి. లింగమంతులస్వామి గుట్టపైన, కింద పొక్లెయిన్లు, ట్రాక్టర్లు పనులు చేస్తూ పరుగులు తీస్తున్నాయి. ఆలయం, ఆర్చి, మెట్లు కొత్త రంగుల్లో మెరిసిపోతున్నాయి. భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే సమయంలో ప్రమాదాల బారిన పడకుండా ఇనుప గ్రిల్ నిర్మిస్తున్నారు. భక్తుల స్నానాల కోసం ఇప్పటికే ఉన్న షవర్లకుతోడు అదనంగా కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 5 నుంచి ఐదు రోజులపాటు దురాజ్పల్లి జాతర సాగనుండగా, ఏర్పాట్లపై జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అధికారులతో వరుస సమీక్షలు జరుపుతూ, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు.
సూర్యాపేట, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అన్ని వర్గాల సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతున్నది. హిందూ, ముస్లిం, క్రిష్టియన్ పండుగలకు తోఫాలు ఇస్తూ ఆయా వర్గాల వారు సంతోషంగా పండుగలు జరుపుకునేలా నిధులు మంజూరీ చేస్తున్నది. అదే విధంగా రాష్ట్రంలో జాతరలను గౌరవిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుండటంతో చాలా చోట్ల జవసత్వాలు కోల్పోయిన జాతరలు, పండుగలకు జీవం వస్తున్నది. అలాంటిదే దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర.
తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరొంది.. దాదాపు 400 ఏండ్లుగా పెద్దగట్టు జాతర జరుగుతున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే గత పాలకులు ఈ జాతరను పట్టించుకున్న పాపానపోలేదు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, సూర్యాపేట నుంచి రెండు సార్లు జగదీశ్రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొంది, రెండు సార్లూ మంత్రి పదవి చేపట్టి సూర్యాపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించి శాశ్వత ఏర్పాట్లు చేయిస్తున్నారు. 2014 తరువాత ఇప్పటి వరకు నాలుగుసార్లు జాతర జరుగగా దాదాపు రూ. 7 కోట్లకు పైనే నిధులను మంత్రి మంజూరు చేయించారు. ఈ మారు ఫిబ్రవరి 5 నుంచి జరిగే జాతర కోసం మరో రూ. 5 కోట్లు మంజూరు చేయించారు.
లింగమంతుల జాతరకు నెల రోజుల ముందే పనులు ప్రారంభం కాగా ప్రస్తుతం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో ప్రతి జాతరకు కోట్లాది రూపాయలు మంజూరవుతుండటం.. ముందస్తుగానే పనులు చేపడుతుండటంతో ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయి. ఈ సారి రూ. 5 కోట్లతో పలు శాశ్వత నిర్మాణ పనులతో పాటు లక్షలాదిగా రానున్న భక్తులకు మౌలిక వసతుల కోసం తాత్కాలిక పనులు సైతం చేపడుతు న్నారు. గుట్ట పక్కన మిషన్ బగీరథ నీటి కోసం భారీ సంప్ నిర్మాణం చేపడుతున్నారు. గుట్టను ఆనుకొని చెరువు కట్టపై చెత్తచెదారం తొలగించారు. గుడి చుట్టూ ఇనుప గ్రిల్ ఏర్పాటు చేస్తుండగా.. గుడి మరమ్మతులు పూర్తి చేసి రంగులు వేస్తున్నారు. స్వాగత ఆర్చికి కూడా రంగులు వేసి గుడి చుట్టూ చలువ పందిళ్లు వేస్తున్నారు. గుట్టకు మూడు వైపులా మెట్లను అలంకరిస్తున్నారు. జేసీబీలు, ట్రాక్టర్లతో జంగిల్ కటింగ్, క్లీనింగ్ పనులు జరుగుతున్నాయి.
జాతరకు వచ్చే భక్తులు లింగన్నను దర్శించుకునే ముందు గుట్టపై స్నానాలు చేసేందుకు మహిళలు, పురుషుల కోసం గత ఏడాది మాదిరిగా వేర్వేరుగా షవర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి మరిన్ని పెంచుతున్నారు. కోనేరు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. గుట్టచుట్టూ శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణాలు జరుగుతుండగా మరికొన్ని తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు జాతర జరిగే లింగమంతుల స్వామి గుట్టపైన, కింద పనులను మంత్రి జగదీశ్రెడ్డి పర్యవేక్షిం చారు. జాతర సజావుగా కొనసాగేందుకు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్లతో పలుమార్లు గుట్టను సందర్శించి సూచనలు చేయ డంతో పనులు వేగంగా జరుగుతున్నాయి.
పెద్దగట్టు లింగమంతుల జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం గుట్ట చుట్టూ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మంత్రి జగదీశ్రెడ్డి ఆదేశాల మేరకు పది రోజుల ముందే పనులన్నీ పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ముస్తాబు చేస్తాం. వివిధ శాఖల అధికారులు దగ్గరుండి పనులు జరిపిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణ, మరమ్మతు, సుందరీకరణ పనులు తుదిదశకు వచ్చాయి. అన్ని వర్గాల ప్రజలు పెద్దగట్టు లింగమంతుల జాతర సంతోషంగా జరిగేలా సహకరించాలి.
– రామానుజులరెడ్డి, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట