ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల కోలాహలం నెలకొన్నది. గురువారం మంచిరోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. కోదాడ, ఆలేరు మినహా పది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాల్లో పూజలు చేసి, వేలాది మంది అభిమానులు, కార్యకర్తల మధ్య నియోజకవర్గాల్లోని రిటర్నింగ్ ఆఫీసుకు ర్యాలీగా బయల్దేరారు. సూర్యాపేటలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, తుంగతుర్తిలో గాదరి కిశోర్కుమార్, హుజూర్నగర్లో శానంపూడి సైదిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
దేవరకొండలో రమావత్ రవీంద్రకుమార్, మిర్యాలగూడలో నల్లమోతు భాస్కర్రావు, నకిరేకల్లో చిరుమర్తి లింగయ్య, నల్లగొండలో కంచర్ల భూపాల్రెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరులో నోముల భగత్కుమార్, మునుగోడు నియోజకవర్గం చండూరులో కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, భువనగిరిలో పైళ్ల శేఖర్రెడ్డి నామినేషన్ వేశారు. గులాబీ జెండాలతో ఎటూ చూసినా జన సందడి కనిపించింది. బీఆర్ఎస్లో పండుగ వాతావరణం కనిపించింది. ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. నామినేషన్ల స్వీకరణకు శుక్రవారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గురువారం అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల కోలాహలం కొనసాగింది. నియోజకవర్గ కేంద్రాల్లో ఎటుచూసినా సందడే కనిపించింది. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగియనుండగా గురువారం శుభ దినం కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థుల్లో కోదాడ, ఆలేరు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. త్వరలో సీఎం కేసీఆర్ సభలు ఉన్న నియోజకవర్గాల్లో సాదాసీదాగా.. మిగతా చోట్ల వేలాదిగా స్వచ్ఛందంగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్యలో బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. సూర్యాపేటలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నామినేషన్ కార్యక్రమం జనసంద్రాన్ని తలపించింది.
వేలాది మంది పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులు, అభిమానులు వెంట రాగా పాదయాత్రగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. తుంగతుర్తి తాసీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్కుమార్ పార్టీ శ్రేణులతో కలిసి నామినేషన్ వేశారు. హుజూర్నగర్లో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరాగా బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. నల్లగొండలో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డి పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ముఖ్య నేతలతో కలిసి సాదాసీదాగా నామినేషన్ పత్రాలు సమర్పించారు. నకిరేకల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు వెంట రాగా ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, డాక్టర్ చెరుకు సుధాకర్తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నిడమనూరు తాసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్తో కలిసి ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ సాదాసీదాగా నామినేషన్ వేశారు. మునుగోడు నియోజకవర్గం చండూరులో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్ ఉన్నారు.
మిర్యాలగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అమరవీరుల స్థూపం వద్ద నుంచి బీఆర్ఎస్ శ్రేణులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. దేవరకొండలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సాదాసీదాగా వెళ్లి నామినేషన్ వేశారు. భువనగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్రెడ్డి కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి అట్టహాసంగా నామినేషన్ వేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, చింతల వెంకటేశ్వర్రెడ్డి ఉన్నారు. జిల్లాలో అంతటా బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లతో భారీ కోలాహలం నెలకొన్నది. కాగా ఆలేరులో బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనుండగా.. కోదాడ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ బుధవారమే భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు.
నామినేషన్ల స్వీకరణ గడువు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. చివరి రోజు కావడంతో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం అభ్యర్థులతోపాటు ఇతరులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రెండో శనివారం, ఆదివారం సెలవు కావడంతో సోమవారం నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. అనంతరం ఈ నెల 15వరకు ఉపసంహరణకు గడువు ఉన్నది. అదే రోజు బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా వెల్లడి కానుంది. ఈ నెల 30న పోలింగ్, వచ్చే నెల 3న కౌంటింగ్తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.