యాదాద్రి భువనగిరి, జులై 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు వ్యవసాయం అంటేనే దండుగ అనే అభిప్రాయం ఉంది. పంటలు సాగు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. విద్యుత్ సరఫరా లేకపోయేది. నీరు లేక కరువు తాండవించేది. ఎరువులు, విత్తనాల కోసం రోజుల తరబడి ఎదురు చూపులే మిగిలేవి. సాగుకు పైసలు లేక అప్పులు చేసి ఆగమయ్యేది. వడ్డీలకు తెచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమయ్యేవి. ఉమ్మడి రాష్ట్రంలో సాగు చాలా తక్కువగా ఉండేది. కానీ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పరిస్థితి మారింది. ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించడంతో సాగు విస్తీర్ణంతోపాటు, ఉత్పత్తి కూడా పెరిగింది. సాగు విస్తీర్ణం రెండు రెట్లు, ఉత్పత్తి మూడు రెట్లు పెరిగింది. 2014 వానకాలం సీజన్లో 2,18,966 ఎకరాల్లో సాగు జరగ్గా, 2022 వానకాలం సీజన్లో 4,45,779 ఎకరాల్లో పంటసాగు జరిగింది. 2014 యాసంగిలో 80,752 ఎకరాలు కాగా, 2022 యాసంగిలో 3,10,165 ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. ఇక పంట ఉత్పత్తి విషయానికొస్తే 2014 వానకాలంలో 2,37,932 మెట్రిక్ టన్నులు ఉండగా, 2022లో 6,60,818 టన్నులకు పెరిగింది.
ఎకరాకు ఏటా రూ. 10 వేల సాయం..
దేశ చరిత్రలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది. 2018 మే 10న సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు. సీజన్కు ఐదు వేల చొప్పున ఏటా ఎకరానికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నది. జిల్లాలో ఇప్పటికు వరకు పది విడుతల్లో రూ. 2,508 కోట్లను పంటసాయంగా అందజేసింది. మొత్తంగా 2,33,461 రైతుల లబ్ధి పొందారు. పదకొండో విడుతలో ఇప్పటి వరకు 2.10లక్షల మంది రైతుల ఖాతాల్లో 172 కోట్లు జమ అయ్యాయి.
ఎరువులు.. విత్తనాలకు ఢోకా లేదు..
స్వరాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతు ముంగిటకే రాయితీపై పంపిణీ చేస్తున్నది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల్లో కల్తీలు, నకిలీలపై కఠినంగా వ్యవహరిస్తున్నది. ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ కల్తీలు, నకిలీలు జరుగకుండా కాపుకాస్తున్నది. నకిలీకి, కల్తీకి పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదుచేసి జైలుకు పంపుతున్నది. 2023 వానాకాలం సీజన్లో 22,635 టన్నుల యూరియా, 12684 టన్నుల డీఏపీ, 18495 టన్నుల కాంప్లెక్స్, 1000 టన్నుల ఎస్ఎస్పీ, 3874 టన్నుల ఎంఓపీ ఎరువులు అవసరం కాగా, ఇప్పటికే అధిక శాతం ఎరువులు, రసాయనాలు సిద్ధంగా ఉంచింది.
మిషన్ కాకతీయ.. కాళేశ్వరంతో జల సవ్వడి..
సీఎం కేసీఆర్ దూర దృష్టితో మిషన్ కాకతీయ పథకం, కాళేశ్వరం ప్రాజెక్టున తీసుకొచ్చారు. మిషన్ కాకతీయలో భాగంగా గ్రామాల్లో చెరువుల్లో పూడిక తీయించారు. జిల్లాలో సుమారు 650 చెరువుల్లో పూడిక తీశారు. దాంతో చెరువుల్లో నీరు నిల్వ ఉండి.. మండె ఎండల్లోనూ నిండు కుండలా చెరువులు కళకళలాడుతున్నాయి. ఇక కాళేశ్వరం జలాలు జిల్లాను తాకాయి. తుర్కపల్లి, బొమ్మలారామారం, యాదగిరిగుట్టకు కాళేశ్వరం జలాలు అందుతున్నాయి. చెక్డ్యామ్ల నిర్మాణంతో భూగర్భజలాలు పెరిగిపోతున్నాయి.
24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా..
తెలంగాణ రాక ముందు రైతులు దశాబ్దాల తరబడి కరెంటు కష్టాలు పడ్డారు. రోజుకు కనీసం 3 లేదా 4 గంటల కరెంటు కూడా రాకపోయేది. దీంతో పంటలు ఎండిపోయి రైతులు విపరీతంగా నష్టపోయేవారు. వచ్చే కరెంటు కూడా లోఓల్టేజిది కావడంతో మోటార్లు కాలిపోయేవి. ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయేవి. వాటి మరమ్మతుల కోసం రైతులు తిరిగి ఖర్చులు పెట్టుకోవాల్సి వచ్చేది. ఈ కష్టాలన్నింటికీ తెరదించుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల వ్యవసాయ మోటార్లకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా అందిస్తున్నది. జిల్లాలో 1.12 లక్షల మంది రైతులకు 24 గంటల విద్యుత్ అందుతున్నది.
ప్రతి గింజా కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
రైతులు పండించిన పంటను సర్కారే కొనుగోలు చేస్తున్నది. ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వమే కొంటున్నది. ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సమస్యను సృష్టిస్తున్నా పండిన పంటనంతా కొనుగోలు చేస్తున్నది. 2022-23 యాసంగిలో జిల్లాలో 3.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. సుమారు 44 వేల మంది రైతుల ఖాతాల్లో రూ. 790 కోట్లను జమ చేస్తున్నది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.