నల్లగొండ, జూలై 15: జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమ బద్ధీకరణకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతున్నది. ఇప్పటి వరకు ప్రొహిబేషనరీ తరహాలో విధులు నిర్వహిస్తున్న జేపీఎస్లను ఇక రెగ్యులర్ చేస్తున్నట్లు ప్రకటించి, నాలుగేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారి సర్వీస్ వివరాలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశిస్తూ ఇందుకు ప్రత్యేక కమిటీని నియమించింది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నేతృత్వంలో ఎస్పీ లేదంటే డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారితో పాటు జిల్లా అటవీ శాఖ అధికారితో కూడిన కమిటీ జేపీఎస్ల సర్వీస్, వారి విధి నిర్వహణపై విచారణ చేసి నివేదించాలని ఆదేశిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా శనివారం ఆదేశాలు జారీ చేశారు. దాంతో జిల్లాలో ఉన్న 648 పంచాయతీ కార్యదర్శుల్లో నాలుగేండ్లు పూర్తి చేసిన వారు ఎంత మంది…అనే కోణంలో డేటా సేకరించి క్షేత్ర స్థాయిలో నేటి నుంచి విచారణ చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు.
నేటి నుంచి క్షేత్ర స్థాయిలో విచారణ..
గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేయాలంటే క్షేత్ర స్థాయిలో బాధ్యత కలిగిన అధికారి ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం 2019లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలు చేపట్టింది. జిల్లాలో 844 గ్రామ పంచాయతీలు ఉండగా ఖాళీగా ఉన్న 661 గ్రామల్లో జేపీఎస్ల నియాకమం చేపట్టి స్పోర్ట్స్ కోటాలోని 13 పోస్టులు మినహాయిస్తే మిగిలిన 648 పోస్టులను భర్తీ చేసింది. తొలి దఫాలో చేపట్టిన నియామకాల్లో 2019 ఏప్రిల్లో మొదటి జాబితా కింద 500 మందిని సెలెక్ట్ చేయగా ఆ తర్వాత సెప్టెంబర్లో మరో ఏడు లిస్టులు వరుసగా పెట్టి మరో 148 మందిని తీసుకున్నారు. వీరిలో ఎవరూ ఎప్పుడు జాయిన్ అయ్యారు..జాయిన్ అయిన తర్వాత ఎన్ని రోజులు డ్యూటీ చేశారు…అనే వివరాలు మొదటగా డీపీఓ ఆఫీస్ నుంచి తీసుకోని క్షేత్ర స్థాయిలో ఆయా గ్రామ పంచాయతీలకు వెళ్లి విచారించనున్నారు. అదనపు కలెక్టర్తో పాటు డీఎస్పీ, డీఎఫ్ఓలు ఈ విచారణలో పాల్గొని ప్రభుత్వం సూచించిన ప్రత్యేక యాప్లో వారి వివరాలు అప్లోడ్ చేసి ఎప్పడికప్పుడే సర్కార్కు నివేదించనున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధ్దీకరించాలనే ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో 648 మంది జేపీఎస్లకు లబ్ధి చేకూరనుంది. ఇక వీరితో పాటు మరో 82 మంది ఔట్ సోర్సింగ్ పద్ధతిలో విదులు నిర్వహిస్తున్న కార్యదర్శులు ఉండగా వీరిని సైతం త్వరలో రెగ్యులర్ చేసే అవకాశం ఉన్నది. సీఎం కేసీఆర్ క్యాబినెట్ సబ్కమిటీతో పాటు సీఎస్ శాంత కుమారి, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్సుల్తానియాలను ఆదేశించగా దానికి అనుగుణంగా ఈ చర్యలు జరుగుతున్నాయి. అయితే వీరి బేసిక్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఇక నుంచి అన్ని రకాల బెనిఫిట్స్ అందనున్నాయి.
పల్లె ప్రగతిలో ఎవరి ప్రతిభ ఎంత అనే కోణంలోనూ..
రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధి కోసం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని పల్లెలు పట్టు సీమలుగా మారాయి. ఇందులో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని ఇటీవల సీఎం కేసీఆర్ సైతం వారిని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో పల్లె ప్రగతిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర ఎంత ఉంది..వారు ఏ మేరకు పని చేశారు..ఎంత ప్రగతి సాధించారు…వారు పని చేసిన పల్లెలు ప్రగతి ఏ మేరకు సాధించాయి అనే కోణంలో ఈ క్షేత్ర స్థాయిలో విచారణ జరుగనుంది. గ్రామాల్లో రోడ్ల పరిశుభ్రత, మొక్కల పెంపకం, నర్సరీల నిర్వహణ, ఆస్తి పన్నుల వసూల్లు, ట్రాక్టర్ ఈఎంఐ చెల్లింపులు, విద్యుత్ బిల్లులు, చెత్త సేకరణ, పది శాతం గ్రీన్ బడ్జెట్ వినియోగం, జనన, మరణ దృవ పత్రాల జారీతో పాటు పల్లె ప్రగతిలో చేపట్టిన అన్ని అంశాల్లో ప్రగతిని దృష్టిలో పెట్టుకొని వంద మార్కులు కేటాయించారు. ఆ అంశాలు, వారీ ప్రగతి ద్వారా సాధించిన మార్కుల ఆధారంగా ఈ సర్వే చేసి యాప్లో అప్లోడ్ చేయనున్నారు. తొలుత నాలుగేండ్ల సర్వీస్ పూర్తి చేసిన వారిది క్షేత్ర స్థాయిలో విచారణ చేసి ఆ తర్వాత ఈ సర్వీస్ పూర్తి చేసిన వారిది క్రమంగా చేసి క్రమబద్ధీకరించనున్నారు.
క్రమబద్ధ్దీకరించేందుకే కమిటీ
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్లో నాలుగేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని క్రమబద్ధ్దీకరిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించగా దానికి అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా వారి సర్వీస్ను పరిశీలించడం జరుగుతుంది. దీనికి ప్రభుత్వం అదనపు కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్ఓలతో కూడిన ప్రత్యేక కమిటి వేయగా ఆ కమిటీ నేటి నుంచి కార్యదర్శుల సర్వీస్ను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఈ నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం జూనియర్ కార్యదర్శులను క్రమబద్ధ్దీకరించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనుంది. ప్రధానంగా జిల్లాలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరు చక్కగా ఉన్నందునే నేడు అన్ని గ్రామ పంచాయతీలు ఎంతో ప్రగతి సాధించగలిగాయి.
– దేప విష్ణువర్ధన్ రెడ్డి, డీపీఓ నల్లగొండ