నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి10(నమస్తే తెలంగాణ):సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో జఠిలంగా మారిన పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తున్నది. ఈ నెలాఖరులోగా పోడు భూముల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. భూమిలేని నిరుపేదలకు దళిత బంధు తరహాలో గిరిజన బంధు అమలు చేస్తామని వెల్లడించారు. ఎప్పటి నుంచో డిమాండ్లో ఉన్న 11 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చుతూ తీర్మానం చేశారు. రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల అమలుపై గతంలోనే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా తాజాగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలపై గిరిజన సమాజం నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా అతంటా గిరిజనులు, గిరిజన సంఘాల నేతలు సంతోషం ప్రకటిస్తున్నారు.
అసెంబ్లీలో శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ పోడుభూముల సమస్యతో పాటు గిరిజనబంధు, తదితర అంశాలపై ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు. దాంతో గిరిజనుల జీవితాల్లో మరిన్ని వెలుగులు నిండుతాయన్న సంతోషం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్దసంఖ్యలో గిరిజనులు ఉండగా వారందరికీ లబ్ధి చేకూరనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 3.94 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే నల్లగొండ జిల్లాలో మొత్తం జనాభా 16,18,416 కాగా ఇందులో 12.9 శాతం 2,09,252 మంది గిరిజనులు ఉన్నారు.
సూర్యాపేట జిల్లాలో మొత్తం 10,99,560 మంది జనాభాలో 12.8 శాతంతో 1,41,271 మంది గిరిజనులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం జనాభా 7,70,833 మంది కాగా 5.7 శాతంతో 43,756 మంది గిరిజనులు ఉన్నారు. మొత్తంగా చూస్తే ఉమ్మడి జిల్లాలో 11.30 శాతం గిరిజనులు ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. అయితే వీరికి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ లేదన్న భావనతో అప్పటివరకు 6 శాతం ఉన్న రిజర్వేషన్లను 10 శాతం పెంచుతున్నట్లు గతంలోనే ప్రభుత్వం ప్రకటన చేసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే నాన్చివేత వైఖరిని అవలంబిస్తున్నది. ఈ నేపథ్యంలో గత అక్టోబర్లో సీఎం కేసీఆర్ దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూనే మీరు చేయకపోతే తామే 10శాతం రిజర్వేషన్లపై ప్రత్యేక జీఓ తీసుకువస్తామని చెప్పి ఆచరణలో చూపారు.
33 వేల మందికి పోడు లబ్ధి
ఈ నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల పంపిణీని చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో ఉమ్మడి జిల్లాలో 80వేల ఎకరాలకు సంబంధించి సుమారు 33 వేల మందికి లబ్ధి చేకూరనున్నట్లు అంచనా. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం నల్లగొండ జిల్లాలోని మొత్తం 13 మండలాల్లో పోడు భూముల సమస్య ఉంది. ఈ మండలాల్లోని మొత్తం 119 గ్రామ పంచాయతీ పరిధిల్లోని 160 ఆవాసాలకు చెందిన రైతులు ఉన్నారు. మొత్తం 55,702 ఎకరాలకు సంబంధించి 20,446 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు.
యాద్రాది భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్, తుర్కపల్లి, సంస్థాన్నారాయణపురం మండలాల్లోనే పోడు భూముల సమస్య ఉత్పన్నమైంది. ఈ మండలాల్లోని 10 గ్రామపంచాయతీల పరిధిలో 2,130 మంది రైతులు 6,733 ఎకరాల పోడు భూముల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి, మేళ్లచెరువు, పాలకవీడు, చింతలపాలెం మండలాల్లో 7,373 మంది రైతులు, 20,480 ఎకరాలు పోడు భూమి కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో 82 వేల ఎకరాలకు సంబంధించి 33వేల మంది రైతుల దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పోడు భూముల దరఖాస్తులపై అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపారు. ముందుగా రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించి, ఆ దరఖాస్తులను ఆయా గ్రామ పంచాయతీ పరిధిలోని ఆవాసాల వారీగా విభజించి పంచాయతీకార్యదర్శి, ఆర్ఐ, ఫారెస్టు బీట్ ఆఫీసర్లతో వేసిన కమిటీ పరిశీలించింది.
వీరు ముందస్తుగా గ్రామపంచాయతీలలో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల నుంచి భూమి తాలుకా ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్, అప్పటి ఓటర్కార్డు లాంటి పత్రాలను సేకరించి వాటిని ప్రత్యేక యాప్లో పొందుపర్చారు. పత్రాలు సక్రమంగా ఉన్న రైతుల సమక్షంలో క్షేత్ర స్థాయి భూమి వద్ద వెళ్లి సదరు భూము వివరాలు కూడా ఆన్లైన్లో నమోదు చేశారు. అటవీ శాఖ భూములకు అటంకం కలుగకుండా, అర్హత ఉండి ఏళ్ల తరబడి పోడు భూమి సాగు చేసుకుంటున్న నిజమైన రైతులను అన్యాయం జరుగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. నవంబర్లోనే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి పోడు భూములకు అర్హులైన వారి రైతుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్ తాజా ప్రకటనతో వీరందరికీ త్వరలోనే పోడు భూముల పట్టాలు అందనున్నాయి.
11 కులాలు ఎస్టీ జాబితాలోకి..
ఎన్నో ఏండ్లుగా దీర్ఘకాలిక డిమాండ్ గా వస్తున్న ఎస్టీ జాబితాలో పలు కులాల చేరికపైనా అసెంబ్లీలో తీర్మానం చేశారు. దాంతో ఆయా కులస్తుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. తాజాగా వాల్మీకి బోయలు, పెద్ద బోయలు, ఖాయితీ లంబాడాలు, మాలి సహాబేదర్, కిరాతక, నిషాది, భాట్ మధురాలు, చమర్ మధురాలు, చండువాల్లు, తలయారి తదితర 11 కులాలను ఎస్టీల జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దాంతో వీరందరికీ ఎస్టీలకు వర్తించే అన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఆయా కులాలకు చెందిన పది వేల మందికి పైగా ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల లబ్ధి జరుగనున్నట్లు అంచనా.
త్వరలో గిరిజన బంధు
భూమి లేని నిరుపేద గిరిజనులకు దళితబంధు తరహాలోనే త్వరలో గిరిజనబంధును అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన చేశారు. దాంతో గిరిజనుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. ఓ వైపు ఇప్పటికే వందలాది తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ తాజాగా చేసిన ప్రకటనలు గిరిజనులను మరింత సంతోషానికి గురిచేస్తుంది. ఉమ్మడి జిల్లా అంతటా గిరిజనులు పార్టీలకు అతీతంగా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు. గిరిజన సంఘాల నేతలు, గిరిజన ఉద్యోగులు, ప్రజాప్రతినిధులంతా పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
గిరిజనుల చిరకాల వాంఛను తీర్చిన నేత సీఎం కేసీఆర్
హుజూర్నగర్ : గిరిజనుల చిరకాల వాంఛ అయిన 10శాతం రిజర్వేషన్ పెంపు, పోడు భూముల పంపిణీపై అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షణీయం. దళిత బంధు తరహాలో గిరిజనులకు పోడు భూములు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం శుభపరిణామం. గత ప్రభుత్వాలు గిరిజనులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాయి. గిరిజనుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. వారికి గిరిజనులు జీవితాంతం రుణపడి ఉంటారు.
– భూక్య నగేశ్రాథోడ్, గిరిజన నాయకుడు, హుజూర్నగర్
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
చివ్వెంల : గిరిజనులకు పోడుభూములు, గిరిజన బంధు పథకాన్ని ఈ నెలాఖరులోగా పంపిణీ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు గిరిజనులమంతా జీవితాంతం రుణపడి ఉంటాం. ఎన్నో ఎండ్లుగా ఎదురుచూస్తున్న పోడు భూముల సమస్యలకు పరిష్కారం చూపారు. విపక్షాలకు చెంపపెట్టులా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొని గిరిజనుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది.
– భూక్యా నాగునాయక్, సేవాలాల్ సేన మండలాధ్యక్షుడు, చివ్వెంల
సీఎం కేసీఆర్ నిర్ణయం గిరిజనులకు గొప్ప ఊరట
తుర్కపల్లి :పోడు భూముల సమస్యను పరిష్కరించి, గిరిజనులకు పట్టాలు మం జూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం సంతోషకరం. గిరిజనులు, ఆదివాసులు అటవి భూముల్లో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. తరతరాలుగా భూములు నమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరిజనులకు సీఎం కేసీఆర్ నిర్ణయం గొప్ప ఊరటనిచ్చింది. గత ప్రభుత్వాలు పోడు భూములపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వైపు అటవి భూములు కాపాడుతూనే గిరిజనులు జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
–యాదాద్రి భువనగిరి జడ్పీ వైస్ చైర్మన్