యాదగిరిగుట్ట, జూన్ 29 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో గురువారం తొలి ఏకాదశి సందడి నెలకొన్నది. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శించుకునేందుకు భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. దాంతో ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. ఆలయ పరిసరాల్లో ఎక్కడచూసినా భక్తులే దర్శనమిచ్చారు. ధర్మదర్శానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. తొలి ఏకాదశి పురస్కరించుకొని లక్ష పుష్పార్చన చేశారు. స్వామి, అమ్మవార్లను సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు పూజలు నిర్వహించారు. స్వయంభూ ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాలతో దివ్య మనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ప్రధానాలయ ముఖమండపంలో శత కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి జలాలకు పూజలు చేశారు. పాలు, పెరుగు, పంచామృతాలతోపాటు సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. స్వామి, అమ్మవార్లకు నిత్యోత్సవాలు వైభవంగా జరిపారు.
తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. ఉదయం సుదర్శన నారసింహ హోమం, సుదర్శన ఆళ్వారులకు కొలుస్తూ హోమం జరిపారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. స్వామివారిని సుమారు 40 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ.49,19,117 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారి సేవలో ప్రముఖులు
లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జాతీయ సంచార జాతుల అభివృద్ధి, సంక్షేమ బోర్డు సభ్యుడు తురక నరసింహ, ఢిల్లీకి చెందిన అదనపు డీజీపీలు రాజేశ్ ఖురానా, గరిమ భట్నాగర్ కుటుంబ సమేతంగా వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి సంప్రదాయ స్వాగతం పలికి వేద శీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి ప్రసాదం అందజేశారు.
వెండి కలశాలకు విరాళం
లక్ష్మీనరసింహస్వామికి యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన దాత గౌలికార్ శ్యామ్లాల్ 6 వెండి కలశాల తయారీకి కావాల్సిన నగదును సమర్పించారు. గురువారం తొలి ఏకాదశి పురస్కరించుకుని కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న ఆయన రూ.2.51 లక్షల నగదును ఆలయ ఏఈఓ రఘుకు అందజేశారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ కీర్తిశేషులు గౌలికార్ నర్సోజి జ్ఞాపకార్థం కలశాలను స్వామివారికి సమర్పిస్తున్నట్లు వెల్లడించారు.