స్వరాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త కళ వచ్చింది. నూతనంగా అనేక గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినన సర్కారు వాటిల్లో సకల సౌలత్లను ఒనగూర్చింది. దాంతో నేడు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అన్ని వసతులతో ముందంజలో ఉన్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవాలంటే వెనుకడుగు వేసే రోజుల నుంచి.. నేడు అడ్మిషన్ల కోసం పోటీ పడాల్సిన పరిస్థితి నెలకొంది. చందంపేట మండలం తెల్దేవర్పల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల నేడు 250 మంది విద్యార్థినులతో కళకళలాడుతుండడం అందుకు నిదర్శనం.
ఈ సారి భారీగా పెరిగిన అడ్మిషన్లు
మారుమూల గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో ఈ సారి అడ్మిషన్లకు ఫుల్ డిమాండ్ నెలకొన్నది. ప్రస్తుతం పాఠశాలలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 250 మంది బాలికలు విద్య అభ్యసిస్తున్నారు. పాఠశాల ప్రారంభం నాటి నుంచి 130 మంది విద్యార్థులకు మించని ఈ పాఠశాలలో ఈ సారి 250 మందికి చేరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో సన్న బియ్యంతో కూడిన భోజనం అందిస్తుండడంతో విద్యార్థినుల సంఖ్య పెరిగింది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం అన్ని రకాల కూరగాయలు, వారంలో మూడు సార్లు గుడ్లు, చికెన్ సైతం విద్యార్థులకు అందిస్తున్నారు. దాంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థుల నమోదు పెరిగింది. పాఠశాలతోపాటు హాస్టల్లో అన్ని వసతులు కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సైతం ప్రత్యేక చొరవ తీసుకొని హాజరు శాతం పెంచారు. పాఠశాలలో నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్నందున 10వ తరగతిలో ఉత్తీర్ణత శాతం సైతం పెరిగింది.
అన్ని వసతులు ఉన్నాయి
మా హాస్టల్లో అన్ని వసతులు ఉన్నాయి. మా ఇంట్లో కూడా ఇలాంటి భోజనం లేదు. మాకు అందించే పౌడర్, పేస్ట్, పుస్తకాలు, పెన్నులతోపాటు భోజనం కూడా బాగుంది. ఉపాధ్యాయులు చదువు బాగా చెబుతున్నారు. వార్డెన్ సైతం మంచిగా చూసుకుంటాడు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పించడం సంతోషకరం.
-రమావత్ అమ్ములు, 10వ తరగతి
చదువు బాగా చెబుతున్నరు
నేను 3వ తరగతి నుంచి హాస్టల్లోనే ఉండి చదువుతున్నాను. ఇక్కడ చదువు బాగా చెబుతున్నారు. గతంలో ఇక్కడ 60, 70 మంది మాత్రమే ఉండేవాళ్లం. ఈ సారి 250 మంది అయ్యిండ్రు. హాస్టల్ ఫుల్గా నిండిపోయింది. హాస్టల్ నుంచి ఇంటికి పోవాలంటే పోబుద్ధి కావడం లేదు. మంచి భోజనం పెడుతున్నారు. ఇంటి నుంచి ఏ వస్తువు కూడా తెచ్చుకోవడం లేదు. మాకు అన్ని సామాన్లు ఇక్కడే ఇస్తున్నరు.
-పి.మీనాక్షి, 9వ తరగతి
వసతులు బాగుండడంతో అడ్మిషన్లు పెరిగినయి
మా హాస్టల్లో అందరూ బాలికలే ఉన్నందున జాగ్రత్తలు తీసుకుంటాం. బయటి వ్యక్తులను లోపలికి రానివ్వం. ప్రతి రోజూ ఉపాధ్యాయుల మీటింగ్ ఉంటుంది. 10వ తరగతి విద్యార్థినులకు ప్రత్యేక క్లాసులు ఉంటాయి. మెనూ ప్రకారం భోజనం అందిస్తాం. మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాలలోనూ అడ్మిషన్లు పెరిగాయంటే ప్రభుత్వం సకల వసతులు కల్పించడం, సరైన విద్యా బోధన చేయడమే కారణం.
-రమణమూర్తి, వార్డెన్