ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రెండు రోజులుగా 43 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఆదివారం ఒక్కసారిగా 46 డిగ్రీలకు చేరువయ్యాయి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో 45.9, నల్లగొండ జిల్లా పజ్జూరులో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేసవి సీజన్లో ఇదే అత్యధికం. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం 33 నుంచి 35.9 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటున్నది. దీనితోపాటు వేడిగాలులు వీస్తుండడంతో ఇండ్ల నుంచి బయటికి వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
సూర్యాపేట, మే 14 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీ ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇదే సమయంలో వడగాడ్పులు, ఉక్కపోత పెరుగడంతో జనం విలవిల్లాడుతున్నారు.గతేడాది జూన్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈ సారి మేలోనే 45 డిగ్రీలు దాటుతుండడం గమనార్హం. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరులో 45 డిగ్రీలు నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. ఉదయం 10.30 గంటల ప్రాంతంలోనే 38 డిగ్రీలు నమోదవుతుండగా రెండు గంటల ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదై సాయంత్రం వరకు భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాడ్పులు వీస్తుండడంతో వీధుల్లో జనసంచారం
తగ్గిపోయింది. దాంతో వ్యాపారస్తులు కూడా మధ్యా హ్నం ఇళ్లకు వెళ్లి సేద తీరుతున్నారు. పొద్దుందాక వీధుల్లో తిరుగుతూ వ్యాపారం చేసుకుంటేనే కుటుంబం గడిచే చిరు వ్యాపారులు జనం కనిపించకపోతుండడంతో చెట్ల నీడన నిలబడుతున్నారు. కాగా ఎండల వేడిమికి ఇళ్లు కూడా వేడెక్కుతూ ఇంట్లోని వస్తువులు అంటుకుంటున్నాయి. కొబ్బరిబొండాలు, శీతలపానీయాలు, నిమ్మసోడాలు తాగుతుండడం కనిపించింది. ఈ సారి వేసవిలో చలువను పంచే నిమ్మకాయలకు కూడా డిమాండ్ పెరిగింది.
ఇళ్లల్లో కూలర్లు, ఏసీలు, ఫ్యాన్ల మోత మోగుతుంది. ఇప్పటికే ఏప్రిల్ మాసానికి సంబంధించి విద్యుత్ వాడకం గణనీయంగా పెరిగింది. గత నెలకు సంబంధించి విద్యుత్ బిల్లులు భారీగా పెరగగా ప్రస్తుతం రేయింబవళ్లు ఏసీలు, కూలర్లు తిరుగుతుండడంతో బిల్లులు రెట్టింపయ్యే అవకాశం ఉందని, ఎండ నుంచి ఉపశమనం పొందాలంటే తప్పదు కదా పలువురు వినియోగదారులు చెబుతున్నారు. సూర్యాపేట జిల్లాలో హుజూర్నగర్లో ఆదివారం అత్యల్పంగా 33 డిగ్రీలు ఉండగా అత్యధికంగా 45.9 డిగ్రీలుగా నమోదైంది. నల్లగొండ జిల్లా పజ్జూరులో అత్యల్పంగా 35.9 ఉండగా అత్యధికంగా 45గా నమోదైంది. సూర్యాపేట జిల్లాలో 40 డిగ్రీలకు తక్కువ ఎక్కడా నమోదు కాలేదు. నల్లగొండ జిల్లా నిడమనూరు, పెద్దవూర మండలం పులిచర్లలో 44.6 డిగ్రీలు నమోదు కాగా జిల్లాలో గుడిపల్లి మండలం ఎర్రారం, చింతపల్లి మండలం గొడకొండ్లలో 39.7, 38.8లుగా నమోదు కాగా మిగిలిన అన్ని చోట్ల 40.5 డిగ్రీల నుంచి 44 డిగ్రీలుగా నమోదయ్యాయి. మరో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించినందున జనం అప్రమత్తంగా ఉండాల్సి ఉంది.