యాదగిరి గుట్ట సిగలో మరో కలికితురాయి చేరనున్నది. దాతార్పల్లిలో ఏర్పాటుకు టూరిజం పార్కు మంజూరైంది. ఇప్పటికే 55 ఎకరాల్లో స్థలాన్ని గుర్తించారు. వినూత్నంగా ఏర్పాటు చేసేందుకు డీపీఆర్ను సిద్ధం చేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందనున్నది. ఇక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు దొరుకనున్నాయి. ఆధ్యాత్మిక ప్రాంతం యాదగిరిగుట్టను దర్శించుకున్న తర్వాత పార్కును విజిట్ చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. బోట్స్ క్లబ్, పార్కు, విల్లాలు, మినీ శిల్పారామం తదితర నిర్మాణాలు ఉండనున్నాయి. మూడోసారి అధికారంలో రాగానే పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. యాదగిరిగుట్టను ఇలవైకుంఠంగా తీర్చిదిద్దింది. రూ.13వేల కోట్ల వ్యయంతో అద్భుతంగా రూపుదిద్ది తెలంగాణకే మకుటంగా మలిచింది. యాదగిరిగుట్ట పక్కనే 11.5 టీఎంసీలతో బస్వాపూర్ రిజర్వాయర్ను నిర్మించింది. ఇది భవిష్యత్లో మంచి టూరిస్ట్ స్పాట్గా నిలువనుంది.
వీటికితోడు మరో పెద్ద పర్యాటక కేంద్రంగా టూరిజం పార్కును ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట మండలంలోని దాతారుపల్లిలో స్థలాన్ని గుర్తించింది. 55 ఎకరాల్లో పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం గతంలోనే స్థల పరిశీలన చేశారు. ఇక్కడ అందరినీ ఆకట్టుకునేలా పార్కును అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు.
టూరిజం పార్కు ఏర్పాటుకు డీపీఆర్ రూపకల్పన ప్రక్రియ కొనసాగుతున్నది. అయితే.. డీపీఆర్ రొటీన్గా కాకుండా వినూత్నంగా పార్కును నిర్మించేలా ప్లాన్ చేస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రాంతం యాదగిరిగుట్టను దర్శించుకున్న తర్వాత పార్కును విజిట్ చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. బోట్స్ క్లబ్, పార్కు, విల్లాలు, మినీ శిల్పారామం మాదిరి తదితర నిర్మాణాలు ఉండనున్నాయి. యాదగిరిగుట్టను దర్శించుకున్నాక.. ఔటింగ్ మాదిరి రెండు, మూడు రోజులు ఇక్కడే ఉండి కుటుంబంతో సంతోషంగా గడిపేలా పార్కును నిర్మించనున్నారు. డీపీఆర్ సిద్ధమైన తర్వాత ఎన్ని కోట్లతో ఏర్పాటు చేయాలనేది స్పష్టత రానుంది.
టూరిజం పార్కు ఏర్పాటుతో అనేక విధాలుగా మేలు జరుగనుంది. యాదగిరిగుట్ట మండలంతోపాటు ఇతర ప్రాంతాల రూపురేఖలు మరింత మారనున్నాయి. అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. దీంతో యువత స్థానికంగా ఉంటూ ఉపాధి పొందవచ్చు. ఇక ఇప్పటికే యాదగిరిగుట్ట పునర్నిర్మాణంతో పెరిగిన భూముల రేట్లు మరింత పెరుగనున్నాయి. యాదగిరిగుట్టతోపాటు రాజాపేట, తుర్కపల్లి, ఆలేరు, బొమ్మలరామారం తదితర మండలాల్లోని గ్రామాల్లో భూముల రేట్లు ఆకాశాన్ని తాకనున్నాయి.
యాదగిరిగుట్ట మండలంలోని దాతారుపల్లిలో టూరిజం పార్కు ఏర్పాటుకు గతంలో అడుగులు పడ్డాయి. దీనికోసం 55 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. డీపీఆర్ రూపకల్పన ప్రక్రియ జరుగుతున్నది. ఇది పూర్తయితే ఏం చేయాలి.. ఎన్ని కోట్లతో ఏర్పాటు చేయాలనేది స్పష్టత వస్తుంది. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాక అద్భుతంగా తీర్చిదిద్ది అందుబాటులోకి తీసుకొస్తాం.
– గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, ప్రభుత్వ విప్