అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆర్థిక భరోసానిచ్చేందుకు పెరటి కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. సూర్యాపేట జిల్లాలో 447 యూనిట్లు మంజూరు కాగా ఒక్కో మండలానికి జనాభా ప్రాతిపదికన 7 నుంచి 20 యూనిట్లు రానున్నాయి. యూనిట్ విలువ రూ.1850 కాగా ప్రభుత్వ సబ్సిడీ రూ.1250 పోను లబ్ధిదారులు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే కోళ్ల పెంపకంతో పలువురు మంచి లాభాలు ఆర్జిస్తుండగా మహిళల స్వయం ఉపాధికి ఇది దోహద పడుతుందని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 10 వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమంతోపాటు గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి మార్గం చూపుతున్నది. ఈ క్రమంలో గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు, ప్రజలకు నాణ్యమైన పోషకాలు కలిగిన కోడి మాంసం అందించేందుకు చర్యలు చేపట్టింది. పెరటి కోళ్ల పెంపకంపై అవగాహన కల్పిస్తూ అనువైన జాతి కోడి పిల్లలను సబ్సిడీపై అందిస్తున్నది. తక్కువ కాలంలో ఎదుగుదల, గుడ్ల ఉత్పత్తి ఎక్కువగా వచ్చే మేలు జాతిని ఎంపిక చేసి లబ్ధిదారులకు అందించనుంది. ఆసక్తి ఉన్నవారు ఈ నెల పదిలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలోని 23 మండలాలకు 447 యూనిట్లు మంజూరయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.5,58,750 కేటాయించింది. జనాభా ప్రకారం ఒక్కొక్క మండలానికి 7 యూనిట్ల నుంచి 20 యూనిట్ల వరకు కేటాయించారు. యూనిట్కు 25 కోడి పిల్లలు ఇవ్వనున్నారు. ఒక్కో యూనిట్ విలువ రూ.1850 ఉండగా.. లబ్ధిదారులు జిల్లా పశుసంవర్ధక శాఖ పేరున రూ.600 డీడీ చెల్లించాలి. ప్రభుత్వం 1250 రూపాయల సబ్సిడీ అందిస్తుంది. లబ్ధిదారులకు నాలుగు వారాల వయస్సున్న కోడి పిల్లలు ఇస్తారు. కోడి పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయి వ్యాక్సిన్ వేస్తారు. పెరటి కోళ్ల పెంపకంపై పశుసంవర్ధక శాఖ అధికారులు అవగాహన సైతం కల్పిస్తున్నారు.
లబ్ధిదారులకు నాలుగు రకాల మేలు జాతి కోడి పిల్లలను వరంగల్ జిల్లా మాములూరులోని ఆర్ఏహెచ్డీసీ నుంచి పంపిణీ చేయనున్నారు. వనరాజ, గిరిరాజ, రాజశ్రీ, రేన్బో రోస్టర్ రకాలు అందిస్తారు. గిరిరాజ, వనరాజ కోళ్లు 8నెలల నుంచి సంవత్సరంలోపు గుడ్ల దశకు వస్తాయి. ఇవి సుమారు 60 వారాల పాటు గుడ్లు పెడుతాయి. దేశవాలి కోళ్ల కన్నా ఎక్కువ ఎదుగుదల ఉంటుంది. గుడ్లను దేశవాలి కోళ్లతో పొదిగించి పిల్లల ఉత్పత్తి చేసుకోవచ్చు. రేన్బో రోస్టర్ కోడి నాలుగు కిలోలు, పుంజు 5కిలోల వరకు బరువు పెరుగుతుంది. ఈ కోళ్ల ఎదుగుదల వేగంగా ఉండడంతో పెంపకందారులకు లాభదాయకంగా ఉంటుంది.
ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. పెరటి కోళ్ల పెంపకంపై ఆసక్తి ఉన్నవారు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారాలు పశు వైద్యశాలల్లో అందుబాటులో ఉన్నాయి. పెరటి కోళ్ల పెంపకం లాభదాయకంగా ఉంటుంది. లబ్ధిదారులకు మేలు జాతి కోడి పిల్లలను పంపిణీ చేస్తాం.
– రవినాయక్, పశువైద్యాధికారి, నేరేడుచర్ల