ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించి రైతులకు ఆదాయవనరుగా మార్చడంతోపాటు ఆయిల్ కొరతను తీర్చేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకోసం ఆయిల్పామ్ మొక్కలు, డ్రిప్ పరికరాలను సబ్సిడీపై అందిస్తున్నది. 2021 నుంచి 2024 వరకు మూడేండ్ల ప్రణాళిక రూపొందించి నర్సరీల్లో మొక్కలను పెంచి అందుబాటులో ఉంచుతున్నది. ఈ ఏడాదికి కావాల్సిన మొక్కలను సిద్ధం చేసిన ఉద్యాన శాఖ అధికారులు వచ్చే ఏడాదికీ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 22,300 ఎకరాల్లో సాగు లక్ష్యం విధించగా అది పూర్తయ్యింది. వచ్చే ఏడాది 45వేల ఎకరాలు, ఆ తర్వాత ఏడాది 90వేల ఎకరాల్లో సాగు లక్ష్యం మేరకు ఉమ్మడి జిల్లాలో ఆరు నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. రైతులకు మొక్కల కొరత లేకుండా చూడడంతోపాటు విస్తృతంగా సాగు చేసేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. నాలుగేండ్లపాటు ఎరువులు, అంతర పంటలకు ప్రభుత్వం రూ.10,500 ఇస్తుండగా ఆ తర్వాత 25ఏండ్లకు పైగా పంట దిగుబడి వస్తుంది.
రాష్ట్రంలో ఆయిల్ కొరతను అధిగమించేందుకు ఆయిల్ పామ్ సాగు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు సబ్సిడీపై మొక్కలు అందించడంతోపాటు నాలుగేండ్లపాటు సాగు ఖర్చులు అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 22,300 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అవసరమైన మొక్కలను అందుబాటులో ఉంచిన అధికారులు.. వచ్చే ఏడాదికి సైతం ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారు. అందుకోసం మలేషియా నుంచి సీడ్ దిగుమతి చేసుకొని ఉమ్మడి జిల్లాలో ఆరు నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు.
– నల్లగొండ, డిసెంబర్ 15
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లాలో ఆయిల్ పామ్ సాగును పెంచేలా చర్యలు చేపట్టింది. ప్రధానంగా పప్పుదినుసులతో పాటు నూనె గింజలకు సంబంధించిన పంటలు.. అందులోనూ రైతులకు ఎక్కువగా లాభం వచ్చే పంటలు సాగు చేయించే విధంగా ప్రణాళికలు చేపట్టింది. అందులో భాగంగా ఆయిల్ పామ్ సాగు చేయాలని రైతులకు సూచించి మూడేండ్ల ప్రణాళిక రూపొందించింది. సబ్సిడీపై మొక్కలు ఇవ్వడంతోపాటు నాలుగేండ్ల పాటు ఎరువులు, అంతర పంటల సాగుకు నిధులు ఇస్తుంది. పూర్తి స్థాయి సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందజేస్తున్నది.
జిల్లాలో 2021-22 సంవత్సరానికి ఆరు మండలాల్లోనే ఆయిల్ పామ్ సాగుకు అవకాశమిచ్చిన ప్రభుత్వం.. ఈ ఏడాది నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 72 మండలాల్లో సాగు చేసుకోవడానికి అనుమతిచ్చింది. ఈ మేరకు 22,300 ఎకరాల్లో ఈ పంట సాగు చేయాలని ఉద్యాన శాఖకు లక్ష్యం విధించింది. వచ్చే ఏడాది 45వేల ఎకరాలు, ఆ తర్వాత ఏడాదికి 90వేల ఎకరాల లక్ష్యాన్ని విధించనుంది. దాంతో ఉద్యాన శాఖ ఈ ఏడాది కావాల్సిన మొక్కలు అందుబాటులో ఉంచడంతో పాటు వచ్చే ఏడాది కోసం ముందస్తుగానే ఆరు నర్సరీలు ఏర్పాటు చేసింది. ఈ మూడేండ్ల ప్రణాళికలో రాష్ట్రంలో ఆరు లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా సర్కార్ ముందుకు పోతున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం 68వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు ఉండగా.. ఈ ఏడాది 44వేల ఎకరాల్లో కొత్తగా సాగు చేపట్టారు.
ప్రభుత్వం మూడేండ్ల ప్రణాళికలో భాగంగా ఈ ఏడాది నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు 7,750 ఎకరాల చొప్పున, యాదాద్రికి 6,800 ఎకరాలు.. మొత్తంగా 22,300 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు లక్ష్యం విధించింది. అయితే.. ప్రారంభంలో మొక్కలు లేకపోవడంతో కాస్త ఇబ్బంది అయ్యింది. ఆ తర్వాత అధికారులు మలేషియా నుంచి విత్తనం తెప్పించి నర్సరీల్లో మొక్కలు పెంచి ప్రస్తుతానికి అందుబాటులో ఉంచారు. వచ్చే ఏడాది లక్ష్యం 45వేలు కాగా.. అందుకోసం ఆరు నర్సరీలు ఏర్పాటు చేసి ముందస్తుగానే మొక్కలు పెంచేలా చర్యలు చేపట్టారు. నల్లగొండ జిల్లాలో ఇనుపాముల (కేతేపల్లి), తెప్పలమడుగు (పెద్దవూర), ఇందుర్తి (మర్రిగూడ), సూర్యాపేట జిల్లాలో మాదవరం (మునగాల), చిల్పకుంట్ల (నూతనకల్) పతంజలి కంపెనీ వారు, యాదాద్రి జిల్లాలోని మోత్కూరులో ఆయిల్ ఫెడ్ కంపెనీ వారు మొక్కలు పెంచుతున్నారు. విత్తనం పెట్టిన తర్వాత మొక్కలు పెరుగడానికి సంవత్సరం సమయం పడుతుంది.
ఆయిల్ పామ్ సాగు చేసే రైతులను ప్రభుత్వం సబ్సిడీలు అందజేసి ప్రోత్సహిస్తున్నది. ఎకరానికి 57 మొక్కలు పడుతుండగా.. ఒక్కో మొక్కకు ప్రభుత్వం రూ.193 సబ్సిడీ ఇస్తున్నది. రైతు వాటా కింద 20 రూపాయల చొప్పున ఉద్యాన శాఖ పేరు మీద డీడీ తీసి చెల్లించాల్సి ఉంటుంది. పంట చేతికి రావడానికి నాలుగేండ్లు పడుతుండగా, అప్పటి వరకు ఎరువులకు ఎకరానికి ఏటా రూ.5,250 ప్రభుత్వం చెల్లిస్తుంది. అంతర పంటలు వేసుకోవడానికి మరో రూ.5,250 ఇస్తున్నది.
కావాల్సిన నీరు, సరైన ఎరువులు అందిస్తే ఆయిల్ పామ్ పంట నాలుగేండ్ల తర్వాత చేతికి వస్తుంది. ఐదో ఏడాది దిగుబడి మొదలై 25 ఏండ్ల నుంచి 30 సంవత్సరాల దాకా పంట వస్తుంది. ఎకరానికి ఎనిమిది నుంచి 10 టన్నుల దాకా పంట రానుంది. టన్నుకు సగటున రూ.15వేల నుంచి రూ.25వేల వరకు ధర పలుకుతుంది. ఆయిల్ పామ్ గెలల మార్కెటింగ్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పతంజలి, యాదాద్రి జిల్లాలో ఆయిల్ ఫెడ్ వారు పంటను కొనుగోలు చేసి ఆ రోజు మార్కెట్, గెలలో ఆయిల్ను బట్టి ధర చెల్లిస్తారు.
ఆయిల్ పామ్ సాగుకు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం డ్రిప్ సౌకర్యం కూడా కల్పిస్తున్నది. ఒక్కో రైతుకు 12.50 ఎకరాల వరకు సాగు చేసుకునేందుకు అవకాశం ఇచ్చిన సర్కార్.. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీతో డ్రిప్ అందిస్తున్నది. బీసీలకు, ఐదెకరాలకు తక్కువగా ఉన్న ఓసీ రైతులకు 90శాతం.. ఎక్కువగా ఉన్న వారికి 80శాతం సబ్సిడీ ఇస్తున్నది. అంటే బీసీ, ఓసీ రైతులు డ్రిప్ పరికరాలకు 10శాతం చెల్లించాల్సి ఉంటుంది.
జిల్లాలో ఆయిల్ పామ్ మొక్కలు కావాల్సినన్ని అందుబాటులో ఉన్నాయి. వచ్చే ఏడాదికి అవసరమైనవి కూడా ఇప్పటి నుంచే పెంచుతున్నాం. నూనె గింజల అవసరం పెరిగినందున ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ సబ్సిడీ అందజేస్తున్నది. మొక్కలకు 80శాతం సబ్సిడీ ఇవ్వడంతో పాటు నాలుగేండ్ల పాటు ఎరువులు, అంతర పంటల సాగు కోసం ఎకరానికి ఏటా రూ.10,500 అందిస్తున్నది. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, ఇతర రైతులకు 90శాతం సబ్సిడీతో డ్రిప్ ఇస్తున్నది. నాలుగేండ్లు కష్టపడితే 25ఏండ్లకు పైగా పంట వచ్చే అవకాశం ఉన్నందున రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టాలి. పంట ఉత్పత్తులు కంపెనీ ప్రతినిధులే తీసుకొని వెళ్తున్నందున మార్కెటింగ్ విషయంలో భయపడవద్దు.
– సంగీతలక్ష్మి, ఉద్యాన శాఖ జిల్లా అధికారి, నల్లగొండ