మునుగోడు రూరల్, జనవరి 9: ఫ్లోరైడ్ తరిమికొట్టేందుకే ఇంటింటికీ తాగునీరు అందించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం అమలులో భాగంగా మునుగోడు మండలంలోని అన్ని గ్రామాలకు పైపులైన్ పనులు పూర్తయ్యాయి. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా ఉన్న మునుగోడులో మిషన్ భగీరథ పనులు 100 శాతం పనులు పూర్తి కావడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు మండలంలో 27 గ్రామ పంచాయతీలు 54 ఆవాసాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో 200.8 కిలోమీటర్ల మేరా పైపులైన్ నిర్మాణం చేపట్టారు. మండలంలో మొత్తం 13,199 భగీరథ నీటి కనెక్షన్లు ఉండగా, మండల వ్యాప్తంగా 78 ట్యాంకుల ద్వారా సరఫరా జరుగుతున్నది. కొత్తగా నిర్మించిన 40 ట్యాంకులతో నీటిని సరఫరా చేయగా 38 ఇంటిగ్రేటెడ్ ట్యాంకుల ద్వారా సరఫరా
అవుతున్నది.
మండలంలో మిషన్ భగీరథ పనులు 100 శాతం పూర్తయ్యాయి. ఇప్పటికే 27 గ్రామపంచాయతీల్లో ఇంటింటికీ భగీరథ నీళ్లు అందుతున్నాయి. ఏమైనా చిన్న, చిన్న రిపేర్లు వస్తే వెంటనే మరమ్మతులు చేయిస్తున్నాం.
-మణిదీప్, ఏఈ, ఆర్డబ్ల్యూఎస్, మునుగోడు
గతంలో తాగునీటికి నానా అవస్థలు పడేవాళ్లం. ప్రభు త్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నీళ్లు అందించడం ఆనందంగా ఉంది. తాగునీటిని అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– బి.ధనమ్మ, చొల్లేడు గ్రామం