ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ గుర్తిస్తున్నారు. తాజాగా కనగల్ మండలం రేగట్టెకు చెందిన టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు జిల్లా శంకర్, కొండమల్లేపల్లి మండలం గుడితండాకు చెందిన రాంబాబునాయక్ను తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులుగా నియమించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
నీలగిరి, సెప్టెంబర్ 21 : తెలంగాణ మలి దశ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమ కారులకు రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులుగా నల్లగొండ జిల్లాకు చెందిన జిల్లా శంకర్, రాంబాబునాయక్ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. కనగల్ మండలం రేగట్టె గ్రామానికి చెందిన జిల్లా శంకర్ నల్లగొండలో ఎన్జీ కళాశాలలో డిగ్రీ చదువుతూ తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేశారు.
టీఆర్ఎస్ ఏర్పాటు నుంచి దాని అనుబంధ సంఘమైన టీఆర్ఎస్వీలో పని చేస్తూ 2006లో టీఆర్ఎస్వీలో క్రియాశీలక కార్యకర్తగా ఎదిగారు. 2008-11 వరకు ఎన్జీ కళాశాలలో డిగ్రీ చదువుతూ పట్టణాధ్యక్షుడిగా, జిల్లా జనరల్ సెక్రటరీగా పని చేసి 2009లో జరిగిన మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ సమయంలో అతనిపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. 2011 నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి అక్కడ జరిగిన ఉద్యమంలోనూ తనదైన పాత్ర పోషించారు. ఉస్మానియా యూనివర్సిటీలో సైతం ఉన్నత చదువులు చదువుతూ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాల్లో గాదరి కిశోర్కుమార్, బాల్క సుమన్ నాయకత్వంలోనూ పని చేశారు. 2014 నుంచి టీఆర్ఎస్వీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, కంచర్ల భూపాల్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
కొండమల్లేపల్లి : మండంలోని గుడితండా గ్రామానికి చెందిన గిరిజన ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమ నాయకుడు నేనావత్ రాంబాబు నాయక్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మరో సభ్యుడిగా నియామకమయ్యారు. నేనావత్ రాంబాబు నాయక్ దేవరకొండ నియోజకవర్గంలో తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో యువకులను ఉత్తేజపరుస్తూ రాష్ట్ర సాధనకు చురుగ్గా పని చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా పాదయాత్రలో దేవరకొండకు వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్ వెన్నంటే ఉంటూ ప్రజలను చైతన్యవంతులను చేశారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా ఉంటూ సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను నియోజకవర్గ వ్యాప్తంగా గిరిజనులకు అవగాహన కల్పిస్తూ వచ్చారు.
రాంబాబునాయక్ సేవలను గుర్తించి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమించడంతో పలువురు బీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా రాంబాబునాయక్ మాట్లాడుతూ.. తనను రాష్ట్ర ఎస్టీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీశ్రావు, గుంటకండ్ల జగదీశ్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కమిషన్ బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటానని తెలిపారు.