నల్లగొండ : పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని, వారి త్యాగాలు భావితరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని అదనపు ఎస్పీ సి.నర్మద అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో కొవిడ్ మార్గదర్శకాల నేపథ్యంలో పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న ఫ్లాగ్ డే సందర్భంగా ఆన్ లైన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.
పోలీస్ శాఖలో వినియోగించే ప్రతి ఆయుధం పట్ల విద్యార్థులలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఓపెన్ హౌస్ ప్రతి ఏటా నిర్వస్తున్నామని ఆమె తెలిపారు. అయితే పాఠశాల, కళాశాల విద్యార్థులకు పోలీస్ ఆయుధాల వినియోగం, అవగాహన కోసం నేరుగా పోలీస్ స్టేషన్లకు, జిల్లా పోలీసు కార్యాలయానికి ఆహ్వానిస్తాం.
కానీ ప్రభుత్వం కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేసిన క్రమంలో నిబంధనలకు అనుగుణంగా ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు. ప్రజల రక్షణ, ప్రజాసేవ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను మరువలేమన్నారు.
ఓపెన్ హౌస్ సందర్భంగా డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీం, క్లూస్ టీములతో పాటు పలు రకాల ఆయుధాలు, వాటి పేర్లు, వినియోగం, ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి చాలనాలు విధించే పద్ధతి, నకిలీ నోట్లు కనిపెట్టడం, దొంగతనాలు జరిగినప్పుడు ఆనవాళ్లు గుర్తించే విధానాలపై అవహగన కల్పించారు.
ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఏ.ఆర్. డీఎస్పీ సురేష్ కుమార్, ఆర్.ఐ.లు స్పర్జన్ రాజ్, నర్సింహా చారి, శ్రీనివాస్, కృష్ణా రావు, నర్సింహా, ట్రాఫిక్ సిఐ చీర్ల శ్రీనివాస్, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, ఆర్.ఎస్.ఐ. రాహుల్, సోమయ్య, నర్సింహా, రియాజ్, వెంకన్న తదితరులున్నారు.