నల్లగొండ ప్రతినిధి, మే 9 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. మూడు జిల్లాల పరిధిలో ప్రధాన పార్టీలతోపాటు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థ్ధులు మొత్తం 69 మంది 117 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ గత నెలలో విడుదల కాగా, ఈ నెల 2నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. సెలవు రోజు మినహాయించి ఏడు రోజులపాటు జిల్లా రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన నామినేషన్లను స్వీకరించారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన చేసి అమోదించిన నామినేషన్లకు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఈ నెల 13వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉన్నది. ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.
సుమారు 12 రోజులపాటు ప్రచారం నిర్వహించి 14వ రోజైన మే 27న పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తుంది. కాగా, బీఆర్ఎస్ నుంచి ఎనుముల రాకేశ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్కుమార్), బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి ప్రధాన పార్టీల తరఫున నామినేషన్లు వేశారు. వీరు కాకుండా రాష్ట్రీయ పార్టీలతోపాటు స్వతంత్రులుగా పలువురు నామినేషన్లు దాఖలు చేశారు.