స్వరాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ అందుతున్నది. దాంతో రైతులు ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగు చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా నాలుగైదు గంటల కరెంట్, రాత్రి పూట పొలాల్లో పడిగాపులు, ఎరువులు, విత్తనాల బాధలు, ధాన్యం కొనుగోళ్ల కష్టాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల జీవితాల్లో నిప్పులు పోసేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకున్నది. 24 గంటల కరెంట్ అవసరం లేదని, 10 హెచ్పీ మోటర్లు కొనుక్కుంటే 3 గంటలు చాలని అంటున్నది. దీనిపై రైతులు భగ్గుమంటున్నారు. 10 హెచ్పీ మోటర్లకు అయ్యే ఖర్చు ఎవడిస్తడని నిలదీస్తున్నారు. నాడు కాంగ్రెస్ పాలనలో రాత్రిపూట కరెంటు కోసం పడిగాపులు కాసి కరెంట్ షాక్, పాము, తేలు కాట్లతో ఎంతో మంది రైతులు చనిపోయిన ఘటనలు ఇంకా మర్చిపోలేదని దుమ్మెత్తిపోస్తున్నారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ను కచ్చితంగా ఓడిస్తామని స్పష్టం చేస్తున్నారు.
సాగుకు 3 గంటల కరెంట్ ఇస్తే రైతుల బతుకులు ఆగమే. తెలంగాణ రాక ముందు మాకు పొలం, నీటి సదుపాయం ఉన్నా.. వరి వేసుకొని తిండిగింజలు పండించుకుందామన్నా కరెంటు సరిగా లేక పోవడంతో ఉన్న పొలాన్ని ఎండబెట్టినం. సాగుకు ఇచ్చే ఐదు, ఆరు గంటల కరెంట్ కూడా సగం పగలు, సగం రాత్రి ఇచ్చేది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇస్తుండడంతో ఇప్పుడు మొత్తం వరిపంటే పండించుకుంటున్నం. తిండి గింజలు ఉంచుకొని మిగతావి అమ్ముకుంటున్నం. కానీ మళ్లీ కాంగ్రెస్వాళ్లు 3 గంటల కరెంట్ ఇస్తం. 10 హెచ్పీ మోటరు పెట్టుకోవాలని చెబుతున్నరు. అంత పెద్ద మోటరు మా బోర్లకు పెడితే ఉన్న నీళ్లన్నీ గుంజేస్తయి. ఆ తర్వాత ఏం చేయాలో వాళ్లే చెప్పాలె. ఇప్పుడున్న 24 గంటల కరెంటే కరెక్ట్. అందుకే సీఎం కేసీఆర్కే మా మద్దతు ఉంటుంది.
– చెన్ను గోవింద్రెడ్డి, రైతు, బట్టుగూడెం, పెద్దవూర మండలం
ప్రస్తుతం 24 గంటల ఉచిత కరెంట్తో రెండు కార్లు సాగు చేసుకుంటున్నం. కాంగ్రెస్ నాయకుడు రేవంత్రెడ్డి మూడు గంటల కరెంట్ చాలంటున్నడు. అసలు ఆయనకు వ్యవసాయం మీద కనీస అవగాహన లేదు. రైతులు 10 హెచ్పీ మోటర్ పెట్టుకోమని చెప్పడం చిన్న రైతులను ముంచుడు తప్ప ఇంకోటి కాదు. తెలంగాణలో 3, 5 హెచ్పీ మోటర్లతోనే వ్యవసాయం సాగుతున్నది. రేవంత్రెడ్డి చెప్పినట్లు 10 హెచ్పీ మోటరు పెట్టాలంటే లక్ష రూపాయాల పెట్టుబడి అవుతుంది.
పైపులు, కరెంట్ కనెక్షన్, ఇవన్నీ మరీ ఖర్చుతో కూడిన పని. గతంలో కాంగ్రెస్ పాలనలో రాత్రిళ్లు పొలాలకు నీరు పెట్టడానికి పోయి రాత్రి అక్కడే పడుకునేటోళ్లం. అంత కష్టపడితే రెండు, మూడు మడులే తడిసేవి. పంట చేతికోచ్చే వరకు నమ్మకం ఉండేది కాదు. తెలంగాణ ఏర్పడినంక కేసీఆర్ సీఎం అయినంక వ్యవసాయాన్ని పండుగలా చేసిండు. రైతులంతా సంతోషంగా ఉన్నరు. ఓట్లప్పుడు వచ్చే కాంగ్రెసోళ్లను నమ్మేది లేదు. ఆ పార్టీ పాలన ఎట్లుంటదో మాకు తెలుసు. బీఆర్ఎస్ ప్రభుత్వానికే మద్దతిస్తాం.
-పంగ లాలయ్య, రైతు, గుమ్మడవెళ్లి, కొండమల్లేపల్లి మండలం
వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతదని కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మూడు గంటల కరెంట్కు కనీసం అర ఎకరం కూడా తడువదు. గతంలో కాంగ్రెస్ పరిపాలన చూసిన రైతులు మళ్లీ ఆ పార్టీ పాలన రావాలని ఎన్నడూ కోరుకోరు. అప్పట్లో రాత్రి వేళ కరెంట్ ఇవ్వడంతో మోటర్లు పెట్టేందుకు చీకట్లో బావులు, బోర్ల వద్దకు వెళ్లి ఇబ్బందులు పడ్డరు. చీకట్లో కరెంటు వైర్లు తగిలి విద్యుత్షాక్తో, విషపురుగుల కాటుతో ఎంతో మంది రైతులు చనిపోయినరు.
తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తుండడంతో రైతుల ఇబ్బందులు తీరాయి. ఇప్పుడు రాత్రి వేళల్లో బావుల కాడికి పోవాల్సిన అవసరం లేదు. పగటి పూటే ఏదో ఒక సమయంలో సరిపోయేంత నీళ్లు పెట్టుకుంటున్నం. గిప్పుడు మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలి. మూడు గంటలే కరెంట్ ఇస్తం అంటూ రైతులను అవమాన పర్చేలా మాట్లాడడం సరికాదు. రైతులందరూ ఆయనకు ఓటుతో బుద్ధి చెబుతరు. రైతులను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కే మా మద్దతు.
-శాగం కోటిరెడ్డి, రైతు, తిరుమలగిరి(సాగర్)
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తే సాగు ముందు పడదు. ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం రైతుల వలసలు తప్పవు. ప్రస్తుతం తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నరు. సరిపోను నీరు, రైతుబంధు సాయం వస్తుండడంతో సాగు బాగా సాగుతున్నది. రైతులం రెండు కార్లు పండించుకొని మంచిగా బతుకుతున్నం. కాంగ్రెస్ వాళ్లు 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలంటున్నరు. ఇప్పటి వరకు మనకాడ అలాంటి మోటర్లే లేవు. దానిమీద ఎవరికీ అవగాహనే లేదు. బావిలో పెద్ద మోటరు పెడితే గంట, గంటన్నరలోనే మొత్తం నీటిని గుంజేస్తయి.
బాయి అడుగంటుతది. తర్వాత ఏం చేయాలి. గతంలో కాంగ్రెస్వాళ్ల పాలన ఎటుందో రైతులకు తెలుసు. కరెంటు లేక పొలం పారక అప్పుల పాలై వేరే రాష్ర్టాలకు వలస పోయి పనులు చేసుకొని బతికినం. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ వాళ్లు రైతులను ముంచేలా పథకాలు పెడుతున్నరు. వాళ్లను నమ్మి ఇబ్బంది పడలేం. తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడంతో గతంల బీళ్లుగా ఉన్న భూములన్నీ సస్యశ్యామలమైనయ్. బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలి. – బంటు యాదగిరి, రైతు, వేములపల్లి
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తాం. 10 హెచ్పీ మోటరు పెట్టుకోవాలని, వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడడం సరికాదు. సాగుగురించి తెల్వని రేవంత్రెడ్డి మా ఊరికి వచ్చి చూస్తే తెలుస్తది. మా బోర్లల్లో 10 హెచ్పీ మోటరు పెడితే పనిచేస్తదా. మూడు గంటల కరెంట్తో పంటలు సాగు అయితయా. మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడం కాదు. రైతుల కష్టాలు తెలిసి వారిని ఆదుకునే నాయకులే కావాలి.
గతంలో కాంగ్రెస్ పాలనలో కరెంట్ సరిగా ఇవ్వక పోవడంతో నానా అవస్థలు పడ్డం. వచ్చే పోయే కరెంట్కు మోటర్లు కాలిపోయి, నీరు పారక పంటలు ఎండిపోయి అప్పుల పాలైనం. మా బాధలు, కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ సాగుకు 24 గంటల కరెంట్ ఇస్తున్నడు. దాంతో మంచిగా రెండు కార్లు సాగు చేసుకుంటున్నం. మళ్లి కాంగ్రెస్ వాళ్ల మాటలు నమ్మే పరిస్థితిలో రైతులు లేరు. రైతులంతా కేసీఆర్ వైపే ఉన్నరు.
– లక్మానాయక్, రైతు, రూప్లాతండా, త్రిపురారం మండలం
ప్రస్తుతం సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుండడంతో రెండు పంటలు మంచిగ పండుతున్నయ్. పంట సాగు చేసినప్పటి నుంచి కోతకొచ్చే వరకు సరిపోను నీళ్లు పెట్టుకోగలుగుతున్నం. దానికి తోడు రైతుబంధు సాయం కూడా చేస్తుండడంతో పెట్టుబడికి అప్పులు తెస్తలేం. పంట అమ్ముకుంటే మాకు చేతిల నాలుగు పైసలు ఉంటున్నయ్. గతంల కాంగ్రెస్వాళ్ల పాలనలో సరిగ కరెంట్ లేక రాత్రి, పగలు బాయికాడనే కాపలా కాసి మోటర్లు పెడితే ఎకరం కూడా సాగు కాక పోయేది.
పంట పెట్టుబడికి చేసిన అప్పులు కూడా తీరక నానా అవస్థలు పడ్డం. ఇప్పుడేమో 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోండి.. మూడు గంటల కరెంటు సరిపోద్ది అంటున్నరు. అసలు 10 హెచ్పీ మోటరు ఎక్కడి నుంచి తేవాలె. అప్పట్ల ఆరు గంటలిస్తేనే పంటలు ఎండిపోయినయ్. మరి మూడు గంటల కరెంట్ ఎట్లా సరిపోతది. అసలు వారికి వ్యవసాయం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నరో ఏమో అర్థం కావట్లే. ఎవరెన్ని మాటలు చెప్పినా సీఎం కేసీఆర్ వల్లే రైతులు బాగుపడ్డరు.. అందుకే మా ఓటు ఆయనకే వేస్తం.
– చెరుకు అంకులయ్య, రైతు, నల్లచెలమూల, చందంపేట మండలం