గతం..
‘2013 సంవత్సరం నవంబర్ నెలలో నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మోటకొండూర్ మండల కేంద్రంలోని ఊర చెరువులోకి వరద పోటెత్తింది. నాసిరకంగా ఉన్న చెరువు కట్టకు గండి పడి నీరంతా వృథాగా పోయింది. గ్రామస్తులు రెండు రోజులు అక్కడే ఉండి మట్టి బస్తాలను అడ్డుగా వేసి ఆపే ప్రయత్నం చేసినా నష్టం జరిగింది. నీరంతా వృథాగా పోయింది.
ప్రస్తుతం..
‘2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ను ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు. ఉద్యమ సమయంలో కాకతీయుల కాలంలో కళకళలాడిన గొలుసుకట్టు చెరువులు తీవ్ర నిరాదరణకు గురయ్యాయని పసిగట్టిన సీఎం కేసీఆర్ వాటికి పూర్వ వైభవం తేవాలని సంకల్పించారు. ‘మిషన్ కాకతీయ’ పథకాన్ని అమలు చేసి చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సఫలీకృతుడయ్యారు. గతంలో పలుమార్లు చెరువు కట్ట, కట్టు కాల్వలు తెగి చుక్క నీరు లేకుండా పోయిన మోటకొండూర్ చెరువుకు మిషన్ కాకతీయ పథకం కింద 2015 సంవత్సరంలో రూ. 97.50లక్షలు మంజూరయ్యాయి. చెరువు కట్ట పునరుద్ధరణ, పూడికతీత, కంప చెట్ల తొలగింపుతో పాటు తూం, అలుగు పునరుద్ధరణ పనులు చేపట్టారు. మిషన్ కాకతీయ పథకం ఆశించిన ఫలితాలు అందిస్తున్నాయి. రెండేండ్లుగా కురిసిన వర్షాలకు చెరువు నిండుకుండను తలపిస్తున్నది.
యాదగిరిగుట్ట, మే15 : ఆలేరు నియోజకవర్గం ఒక్కప్పుడు ఏడారి ప్రాంతం. ఇక్కడ సాగుకు వర్షాధారమే ఆధారం. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో చెరువులు నిరాదరణకు గురయయ్యాయి. ఫలితంగా వర్షాలు వచ్చినా చెరువులు తెగి నీరు వృథాగా పోయేది. 2014లో తెలంగాణ రాష్ట్రమేర్పడ్డాక వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో ఆలేరు నియోజకవర్గంలో 534 చెరువులకు పూర్వ వైభవం వచ్చింది. చెరువుల పూడికతీత, కట్ట పటిష్టత, కంపచెట్ల తొలగింపు, ఫీడర్ ఛానళ్ల పునరుద్ధరణతో చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. మూడు విడతల్లో 579 చెరువులు, కుంటల ఆధునీకరణకు ప్రభుత్వం రూ.112.35 కోట్లు ఖర్చు చేసింది. దీంతో పాటు యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం, సైదాపురం చెరువులు, యాదగిరిగుట్ట పట్టణంలో గండిచెరువు రూ.6.77కోట్లతో మిని ట్యాంక్ బండ్గా ఆధునీకరించారు. ఫలితంగా వేసవిలోనూ చెరువులు నిండకుండలా దర్శనమిస్తున్నాయి.
రూ.10.30కోట్లతో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ
సమైక్య పాలనలో కాకతీయుల కాలం నాటి గొలుసుకట్ట చెరువులు తెగిపోయి నిరుపయోగంగా మారాయి. వాటికి పూర్వవైభవం తెచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ నడుం బిగించింది. ప్రతి నీటి చుక్కను సద్వినియోగించుకునేలా అడుగులు పడ్డాయి. ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి ఆలేరు నియోజవర్గవ్యాప్తంగా ఉన్న గొలుసుకట్టు చెరువులను ఆధునీకరరించారు. ఫీడర్ ఛానల్ కాలువ పటిష్టత, పిచ్చి మొక్కల తొలగింపు, కాలువ పూడికతీత పనులు చేపట్టారు. నియోజకవర్గంలో 182 గొలుసుకట్టు చెరువులకు గాను రూ.10, 35,16,071 నిధులు ఖర్చు చేసి పునరుద్ధరించారు.
పెరిగిన సాగు విస్తీర్ణం
బీడుబారిన ఆలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రభుత్వంలో సస్యశ్యామలం కావడంతో పాటు సీఎం కేసీఆర్ చేపట్టిన రైతుబంధు సాయం, సకాలంలో ఎరువులు, వ్యవసాయ విస్తరణాధికారులు, 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రైతు బంధు పథకం ద్వారా ఏటా 98,519మంది రైతులకు రూ. 114.92 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. దీంతో 2013 కంటే ముందు కంటే తాజాగా మూడింతల సాగు పెరిగింది.
రూ.139.81కోట్లతో చెరువుల ఆధునీకరణ
ప్రభుత్వం నియోజకవర్గ వ్యాప్తంగా మిషన్ కాకతీయ పథకం ద్వారా రూ.139.81కోట్లతో 534 చెరువులను ఆధునీకరించింది. మిషన్ కాకతీయ తొలి విడుతలో రూ.36.30 కోట్లతో 1,134 చెరువులు, రెండో విడుతలో రూ.36.97కోట్లతో 137చెరువులు, మూడో విడుతలో రూ.43.03 కోట్లతో 176 చెరువులు, నాలుగో విడుతలో రూ.23.21 కోట్లతో 108 చెరువులను ఆధునీకరించారు.
బీడు భూములు సాగులోకి
ఒక్కప్పుడు ఆలేరు ప్రాంతంలో బీడుబారిన భూములే దర్శనమిచ్చేవి. ఎంతోమంది రైతులు పొట్టచేత పట్టుకుని హైదరాబాద్కు వలసవెళ్లి పోయారు. అప్పట్లో వర్షాలు వస్తే చెరువు కట్ట తెగి చుక్క నీరు ఉండేది కాదు. రైతుల నీటి కష్టాలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పథకంతో చెరువులను పునరుద్ధరించారు. ప్రస్తుతం ఎంత పెద్ద వర్షం వచ్చినా చెరువు కట్ట తెగిన దాఖలాలు లేవు. మండుటెండల్లో సైతం చెరువులు జలకళను సంతరించుకున్నాయి. గతంతో పోలిస్తే మూడింతలు వ్యవసాయ భూమి సాగులోకి వచ్చింది. సీఎం కేసీఆర్ ఇచ్చే పెట్టుబడి సాయంతో అన్నదాతలు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. వలసలు వాపస్ వచ్చాయి. రాబోయే రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుతో నియోజకవర్గంలోని ప్రతి చెరువును గోదావరి జలాలతో నింపుతాం.
– ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి