చందంపేట, మే 5 : మన ఊరు మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు సమకూరాయి. కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దుకుని విద్యార్థులకు కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఇందుకు చందంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల సాక్ష్యంగా నిలుస్తున్నది. ఒకప్పుడు బాగా వెనుకబడిన ప్రాంతంగా.. ఉపాధ్యాయులు లేక మూతపడే పరిస్థితికి చేరుకున్న చందంపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు బీఆర్ఎస్ సర్కారు వచ్చాక కొత్త రూపును సంతరించుకున్నాయి. మన ఊరు మన బడి కార్యక్రమం కింద మండలంలోని 20 పాఠశాలలు ఎంపిక కాగా.. సుమారు రూ.4.కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు.
బాపన్మోట్తండాకు రూ.4లక్షలు, బొల్లారంపట్టి పాఠశాలకు రూ.5లక్షలు, చిత్రియాలకు రూ.20లక్షలు, గన్నెర్లపల్లికి రూ.20లక్షలు, గుంటిపల్లికి రూ.24లక్షలు, కాట్రావత్తడాకు రూ.36లక్షలు, మానావత్తండాకు రూ.10లక్షలు, తెల్దేవర్పల్లికి రూ.10లక్షలు, ఉస్మాన్కుంటకు రూ.10.75 లక్షలు, పెద్దమూలకు రూ.20లక్షలు, పొగిళ్లకు రూ.43లక్షలు, పోల్యనాయక్తండాకు రూ.12లక్షలు, తెల్దేవర్పల్లికి రూ.24లక్షలు, కంబాలపల్లికి రూ.28లక్షలు, పోలేపల్లికి రూ.41లక్షలు, చందంపేట ప్రాథమిక పాఠశాలకు రూ.67లక్షలు కేటాయించారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో పనులు పూర్తికాగా.. మరికొన్నింటిలో కొనసాగుతున్నాయి. చందంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో రూ.67లక్షలతో తరగతి గదులు, ప్రహరీ, మూత్రశాలలు, వంట గది నిర్మాణాలు చేపట్టారు. మౌలిక సదుపాయాలు, తాగునీటి వసతి కల్పించారు. అందమైన రంగులతో కార్పొరేట్ స్థాయి పాఠశాలగా తీర్చిదిద్దారు.
స్కూల్ కొత్తగ కనిపిస్తున్నది
మా ఊళ్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల కొత్తగా కనిపిస్తుంది. గతంతో పోల్చితే చాలా మారిపోయింది. తరగతి గది, పాఠశాల ఆవరణ, తాగునీరు ఇలా అన్ని వసతులు ఒనగూరాయి. నిజంగా మా ఊళ్లో ఇంత మంచి స్కూల్ ఉంటదనుకోలేదు. ప్రభుత్వం ఇంత మంచిగా చేస్తుంటే మా పిల్లలను ప్రైవేటు స్కూల్కు ఎందుకు పంపిస్తాం. మా ఊళ్లో పిల్లలందరూ ప్రభుత్వ బడికే వెళ్తారు.
– కె.లక్ష్మమ్మ, చందంపేట