రామగిరి మార్చి 14 : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు గురువారం ముగిశాయి. గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు చివరి పరీక్ష రాశారు. ఈ సందర్భంగా తమ స్నేహితులతో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగారు. మళ్లీ కలుద్దామని వీడ్కోలు చెప్పుకొన్నారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు తమ సామగ్రి తీసుకొని ఇంటిబాట పట్టారు. ఈ నెల 16 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుందని డీఐఈఓ దస్రూనాయక్ వెల్లడించారు.
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం పొలిటికల్ సైన్స్కు సంబంధించి మూల్యాంకన ఉత్తర్వులు పొందిన అధ్యాపకులు ఉదయం 9 గంటల లోపు మూల్యాంకన కేంద్రం నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ బాలల జూనియర్ కళాశాలలో రిపోర్ట్ చేయాలని ఆయన సూచించారు. వేసవి దృష్ట్యా మూల్యాంకన కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ తెలిపారు.