యాదగిరిగుట్ట, ఫిబ్రవరి14 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభూ నారసింహుడికి నిత్యారాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. మంగళవారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. సుదర్శన నారసింహ హోమం పాంచరాత్రాగమ రీతిలో సాగింది. ఉదయం ఆలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ నారసింహ హవనం జరిపారు. వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి గజవాహన సేవ చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం వైభవంగా సాగింది. భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. సాయంత్రం స్వామి, అమ్మవార్ల తిరువీధి సేవ, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు నిర్వహించారు. స్వామివారిని సుమారు 10 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.15,29,522 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు తెలిపారు.
బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ
ఈ నెల 21 నుంచి జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను డీసీపీ రాజేశ్చంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కల్యాణ మండపం, వీవీఐపీ ఏర్పాట్లు, భక్తుల క్యూలైన్లను పరిశీలించారు. కల్యాణ మండప వద్ద భద్రతా ఏర్పాట్లు, వీవీఐపీలు రానున్న నేపథ్యంలో వారికి చేపట్టాల్సిన భద్రత, భక్తుల ఏర్పాట్లపై నమూనాలు తయారు చేస్తున్నట్లు డీసీపీ వెల్లడించారు. ఆలయ అధికారులు, ఇంజినీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వామివారి దర్శించుకున్నారు.
హుండీల ఆదాయం రూ.1,83,39,667
లక్ష్మీనరసింహస్వామి 21 రోజుల హుండీల ఆదాయం కోటిన్నర దాటినట్లు ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు వెల్లడించారు. మంగళవారం కొండకింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో హుండీలను లెక్కించామని, నగదు 1,83,39,667 వచ్చిందని తెలిపారు. ఇందులో 128 గ్రాముల మిశ్రమ బంగారం, 3.200 కిలోల మిశ్రమ వెండి సమకూరిందన్నారు. 2,079 అమెరికా డాలర్లు, 240 ఆస్ట్రేలియా డాలర్లు, 140 కెనడా డాలర్లు, 90 న్యూజిలాండ్ డాలర్స్, యూఏఈకి చెందిన 25 దిరామ్స్, ఒమన్కు చెందిన 5రియాల్స్, మలేషియాకు చెందిన 50 రింగిట్స్, కువైట్కు చెందిన 20 దినార్స్, బెహరెన్కు చెందిన 1 దినార్, సూడాన్కు చెందిన 5 ఫౌండ్స్, ఖతర్కు చెందిన 22 రియాల్స్ స్వామివారికి సమకూరినట్లు వివరించారు.