చందంపేట, ఫిబ్రవరి 24 : కేసు విచారణలో భాగంగా ఏపీలోని కడప జిల్లాకు వెళ్లిన చందంపేట ఎస్ఐ, కానిస్టేబుళ్లపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చందంపేట మండలం కంబాలపల్లికి చెందిన టేకులపల్లి అంజయ్య, నేలపట్ల ఆంజనేయులు, మామిళ్ల సైదులు, పిల్లి అంజయ్య, వెంకటయ్య, ఆంజనేయులు, మరో ఇద్దరు కలిసి కడప జిల్లా మైదుకూరు మండలం చిన్నయ్యవారిపల్లికి చెందిన ఓబుగాని సాంబయ్య, అతని కుమారుడు ఓబుగాని శివకు విడుతల వారీగా డబ్బు చెల్లించే ఒప్పందం మేరకు రూ.54.50లక్షల విలువైన గొర్రెలను గతేడాది డిసెంబర్లో కొనుగోలు చేశారు. ఒప్పందం మేరకు డబ్బు చెల్లించే విషయంలో సాంబయ్య కాలయాపన చేస్తుండడంతో విక్రయదారులు చందంపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అప్పటి ఎస్ఐ క్రాంతికుమార్ కేసు నమోదు చేశారు. ఆయన బదిలీ కావడంతో కొత్తగా వచ్చిన సతీశ్ కేసు విచారణ కోసం ఈ నెల 22న ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు గొర్రెల వ్యాపారులతో కలిసి ఓ ప్రైవేటు వాహనంలో చిన్నయ్యగారిపల్లికి వెళ్లారు. కేసు విషయమై ఓబుగాని సాంబయ్యతో మాట్లాడుతుండగా, పలువురు గ్రామస్తులు జోక్యం చేసుకొని పోలీసులపై దాడికి పాల్పడ్డారు. దాంతో ఎస్ఐతోపాటు కానిస్టేబుళ్లు, గొర్రెల విక్రయదారులకు గాయాలయ్యాయి. వాహనం ధ్వంసమైంది. ఈ మేరకు మైదుకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు సమాచారం.