‘సఫాయిలూ.. మీకు సలాం చేస్తున్నా. పట్టణాభివృద్ధిలో మీ పాత్ర అత్యంత కీలకం. మీరు అందిస్తున్న సేవలతోనే సూర్యాపేట పురపాలక సంఘం రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అవార్డులు అందుకుంటున్నది. ప్రతి అవార్డులోనూ మీ శ్రమ, మీ సేవాతత్పరత దాగి ఉంది’ అంటూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సేవలను కొనియాడారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని నూతన ప్రస్థానంలో వేలాది మందితో పట్టణ ప్రగతి సంబురాలు వినూత్నంగా జరిగాయి. మంత్రి జగదీశ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహా ప్రస్థానాన్ని ప్రారంభించి అనంతరం సభలో మాట్లాడారు. ఇప్పటికే సూర్యాపేట పట్టణం జాతీయ స్థాయిలో మూడు, రాష్ట్ర స్థాయిలో ఒక అవార్డు పొందగా.. తాజాగా మహా ప్రస్థ్ధానం, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాలకుగానూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకోవడం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతికి నిదర్శనమన్నారు. ఈ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్నామంటే తొమ్మిదేండ్లలో కేసీఆర్ సర్కారు సాధించిన విజయాలే కారణమని పేర్కొన్నారు.
పట్టణాభివృద్ధికి అడుగడుగునా అడ్డు పడుతున్న శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనంతరం నల్లగొండలో జరిగిన పట్టణ ప్రగతి వేడుకల్లో మంత్రి జగదీశ్రెడ్డి.. జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి గాదరి కిశోర్ కుమార్తో కలిసి పాల్గొన్నారు.
– సూర్యాపేట, జూన్ 16 (నమస్తే తెలంగాణ)
సూర్యాపేట, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : సఫాయిలు మీకు సలాం. పట్టణాభివృద్ధిలో మీ పాత్ర అత్యంత కీలకం. మీరు అందిస్తున్న సేవలతోనే సూర్యాపేట పురపాలక సంఘం రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అవార్డులు అందుకుంటుంది. వస్తున్న ప్రతి అవార్డులో మీ శ్రమ మీ సేవాతత్పరత దాగి ఉందంటూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పురపాలక సంఘాల్లో పని చేస్తున్న సఫాయి కార్మికుల సేవలను కొనియాడారు. రాష్ట్ర అవతరణ దతాబ్ది వేడుకల్లో భాగంగా శుక్రవారం సూర్యాపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన మహా ప్రస్థానంలో వేలాది మందితో వినూత్నంగా పట్టణ ప్రగతి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీశ్రెడ్డి తొలుత మహా ప్రస్థానాన్ని ప్రారంభించి అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. శానిటేషన్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో పాటు విధుల్లో క్రమశిక్షణకు గుర్తింపుగా హైదరాబాద్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోవడం అభినందనీయమన్నారు. అలాగే మహా ప్రస్థానం, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకోబోవడం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతికి దిక్సూచి లాంటిదన్నారు.
ఐకాన్గా మహాప్రస్థానం..
నూతన మహా ప్రస్థానం భవిష్యత్ తరాలకు ఒక ఐకాన్గా నిలబడుతుందని మంత్రి అన్నారు. అద్దె ఇండ్లలో ఉంటూ మరణాలు సంభవించినప్పుడు వారు పడే బాధ వర్ణనాతీతంగా ఉంటుందన్నారు. అటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అపరకర్మలు చేసుకునేందుకు వెసులుబాటుగా అన్ని సౌకర్యాలతో రెండు పోర్షన్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.
అభివృద్ధి నిరోధక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
పట్టణాభివృద్ధికి అడుగడుగునా అడ్డు పడుతున్న శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అన్నారు. గతంలో జరుగని అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలో జరుగుతుండడంతో తమకు ఓట్లు పడడం కష్టంగా మారుతుందని భావించిన విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. అభివృద్ధిని ప్రత్యక్షంగా, పరోక్షంగా, కోర్టుల ద్వారా అడ్డుకున్న శక్తులే ప్రభుత్వంపై అపనిందలు మోపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు రహదారుల విస్తరణ ఇటు మినీ ట్యాంక్బండ్ నిర్మాణాలను కోర్టు ద్వారా అడ్డుకున్నా అవాంతరాలను అధిగమించి పూర్తి చేయడంతో ట్యాంక్బండ్ ఇప్పుడడొక పర్యాటక కేంద్రంగా బాసిల్లుతున్నదన్నారు. అలాగే రికార్డు సమయంలో 52 గంటల్లో రహదారుల విస్తరణను పూర్తి చేసినట్లు చెప్పారు.
మూర్ఖులు కూడా అంగీకరించాల్సిందే..
ఈరోజు ఇక్కడ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామంటే తొమ్మిదేండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయలే కారణమని మంత్రి అన్నారు. తెలంగాణ వస్తే ఏమోస్తది అని ఇప్పటికీ అక్కడక్కడా వాగేవారు, కండ్లుండి చూడలేని ముర్ఖులు, ఇతర పార్టీల నేతలు జిల్లా కేంద్రంగా మారిన సూర్యాపేటలో జరుగుతున్న అభివృద్ధిని కాదనలేరన్నారు. సమీకృత కలెక్టరేట్, మెడికల్ కళాశాల, కాళేశ్వరం నుంచి పెన్పహాడ్ మండలం రావి చెరువు వరకు 380 కిలో మీటర్ల దూరం నుంచి పారుతున్న సాగునీరు ఇలా జరిగిన అభివృద్ధిని తెలుపుతూ విమర్శలు చేసే వారి చెంప చెల్లుమనిపించేలా సమాధానం చెప్పాలన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్ సంగతి కండ్లెదుటే సాక్షాత్కరిస్తుందన్నారు. పట్టణ ప్రజలకు మూసి కంపు కొడుతున్న నీటి నుంచి విముక్తి లభించిందని చెప్పాలన్నారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు రూ.30 లక్షల వ్యయంతో దుస్తులు, కొబ్బరినూనె, షూస్ కిట్ను అందజేయడంతో పాటు పొదుపు సంఘాల మహిళలకు రూ.4 కోట్ల 83 లక్షలు, స్త్రీ నిధి రుణాలు రూ.2కోట్ల 3లక్షల 89వేల చెక్కులను అందజేశారు.
పట్టణంలో ఇంటి పంటను సక్రమంగా పండించడంతో పాటు ఇండ్లలో సేంద్రీయ ఎరువులు తయారు చేసిన మహిళలకు, మొక్కల పెంపకం మంచిగా చేసిన కౌన్సిలర్లకు, ఉత్తమ శానిటేషన్ సిబ్బందికి, మున్సిపల్ ఉత్తమ ఉద్యోగులు, సిబ్బందికి మెమోంటోలు, ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానించారు. అంతకు ముందు ధర్మభిక్షం చౌరస్తా నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా మున్సిపల్ ఆటోలు, ట్రాక్టర్లతో మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు, అధికారులు కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బతుకమ్మ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర చిత్రపటం ఆకారంలో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి, మెప్మా పీడీ రమేశ్నాయక్తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, మెప్మా ఆర్పీలు, పొదుపు సంఘాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.