ఎనిమిదో విడుత హరితహారానికి సర్వం సిద్ధం
421 పంచాయతీలు, 6 మున్సిపాలిటీల్లో
28లక్షల మొక్కలు నాటేలా ప్రణాళిక
త్వరలో మొదలవనున్న గుంతల తవ్వకం
451 నర్సరీల్లో 72.10లక్షల మొక్కల పెంపకం
లక్ష్యాలను నిర్దేశించుకున్న 11 శాఖలు
హరితోద్యమ స్ఫూర్తిని పెంచేలా ఏర్పాట్లు
చేస్తున్న జిల్లా యంత్రాంగం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. పచ్చల హారాన్ని సింగారించుకునేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా ముస్తాబైంది. జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో 28 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే జిల్లాలోని 451 నర్సరీల్లో 72.10లక్షల మొక్కలను పెంచుతున్నారు. మొక్కలు నాటే ప్రాంతాల్లో కూలీలతో గుంతలు తీసే కార్యక్రమం త్వరలోనే మొదలుకానుంది. 11 శాఖలకు నాటాల్సిన మొక్కల లక్ష్యాలను నిర్దేశించగా జిల్లాకు ఆకుపచ్చని వైభవం కల్పించేదిశగా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వర్షాలు విస్తారంగా కురిసిన వెంటనే జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, మే 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో ఎనిమిదో విడుత హరితహారం నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధ్దమవుతున్నది. కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలకనుగుణంగా త్వరలోనే పక్కా ప్రణాళికతో మొక్కలు నాటేందుకు వివిధ శాఖల అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ఏడు విడుతల్లో నాటిన మొక్కలతో జిల్లా పచ్చదనంతో వెల్లివిరుస్తుండగా.. ఎనిమిదో విడుత హరితోద్యమ స్ఫూర్తిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో 421 గ్రామపంచాయతీలు, 6 మున్సిపాలిటీల పరిధిలో పచ్చదనం పెం పొందించేందుకు అవసరమైన ఏర్పాట్లలో అధికారయంత్రాంగం నిమగ్నమైంది. గ్రామీణాభివృద్ధ్ది , మున్సిపల్, అటవీశాఖల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 28 లక్షల మొక్కలను నాటనున్నారు.
అనువైన ప్రతీచోట నాటేందుకు కసరత్తు ప్రతీ హరితహారంలో ఎక్కువ మొత్తంలో మొక్కలు నాటి పచ్చదనం పెంపునకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. ప్రతి పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాన్ని, మున్సిపాలిటీల్లో అర్బన్ పార్కులను ఏర్పాటు చేసి పల్లె, పట్టణ ప్రజానీకానికి ఆహ్లాదకర వాతావరణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఈ క్రమంలోనే మొక్కలు పెరిగేందుకు అనువుగా ఉన్న ప్రతీ చోటా మొక్కలను నాటి సంరక్షించడం ద్వారా పచ్చదనం పెంపునకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. రహదారులకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ఇళ్ల ఆవరణల్లో, చెరువు గట్లపై, అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తు మొక్కలు నాటేలా అధికారులు ప్రణాళికను సిద్ధ్దం చేసి ఉంచారు.
ప్రాధాన్యతకు అనుగుణంగా మొక్కలు
ప్రాధాన్యతను బట్టి వేప, కానుగ, ఖర్జూర, మద్ది, వెదురు, రావి, టేకు మొక్కలతో పాటు మామిడి, సీతాఫలం, ఉసిరి, మునగ, నిమ్మ, జామ వంటి పండ్ల, పూల మొక్కలను నాటనున్నారు. ఇళ్ల ఆవరణలో నాటుకునేందుకు ఇంటింటికీ మొక్కలను అందజేయనున్నారు. ట్రీగార్డులు ఏర్పాటు చేయడంతోపాటు, గతంలో నాటిన మొక్కలు చనిపోయిన స్థానాల్లో కొత్త మొక్కలను సైతం నాటేలా చర్యలు తీసుకోనున్నారు.
లక్ష్యం మేరకు మొక్కలను నాటుతాం
జిల్లాలో వర్షాలు బాగా కురిసిన సమయంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. హరితహారంలో గ్రామీణాభివృద్ధి శాఖ కీలకంగా వ్యవహరిస్తున్నది. 12లక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యాన్ని విధించుకున్నాం. ఉపాధిహామీ పథకం కూలీలతో గుంతలు తీసే కార్యక్రమాన్ని కొద్దిరోజుల్లో మొదలుపెట్టనున్నాం. అనువుగా ఉన్న అన్ని చోట్లా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటాం. – ఉపేందర్ రెడ్డి, డీఆర్డీఓ