గ్రామీణ ప్రాంతాల్లో వలసలను అరికట్టి, ప్రజలకు పని కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నది. పథకం అమలులో భాగంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పించడంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈక్రమంలో2023-24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనుల గుర్తింపు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. మండలంలోని 27 గ్రామపంచాయతీల్లో మొదటి, రెండో దశ సభలు నిర్వహించి పనులను గుర్తించారు.
– మునుగోడు, డిసెంబర్ 26
గ్రామానికి 20 మాత్రమే..
గతంలో ఇష్టానుసారంగా పనుల గుర్తింపు ఉండేది. కూలీలు, ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రజాప్రతినిధుల అభీష్టం మేరకు చేపట్టేవారు. చాలా చోట్ల ప్రతిపాదించిన పనుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని సామాజిక తనిఖీల్లో వెలుగు చూస్తుండడంతో ఈ విధానానికి కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. నాలుగేండ్లుగా గ్రామసభల ద్వారా మెజార్టీ కూలీలు, ప్రజలు ఆమోదించి ఎంపిక చేసిన పనులు మాత్రమే చేపట్టాలని షరతు విధించి ఆ మేరకు నిధులు కేటాయిస్తున్నది. అంతేకాకుండా చేపట్టిన పనులను అసంపూర్తిగా వదిలేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే మారిన నిబంధనల ప్రకారం గ్రామాల్లో 20కి మించి పనులు చేపట్టే అవకాశాల్లేవు. ఆ పనులు పూర్తి చేశాకే మరొకటి చేపట్టాలని నిబంధన విధించారు.
56 రకాల పనులు..
ఉపాధి హామీ పథకం కింద 56 రకాల పనులు చేపట్టవచ్చని అధికారులు సూచిస్తున్నారు.ప్రధానంగా పంట చేలలో నీటి కుంటలు, కందకాల తవ్వకం, పూడికతీత, పశువుల పాకలు, పంట కల్లాల నిర్మాణం, పశుగ్రాసం పెంపకం, పండ్ల తోటలు, గట్లపై టేకు చెట్లు పెంపకం,వర్షం నీటి మళ్లింపు కాల్వలు, బంజరు భూములను సాగుకు యోగ్యంగా మార్చడం, రహదారులు,మట్టిరోడ్లు, శ్మశాన వాటికల అభివృద్ధి చేపట్టనున్నారు. నర్సరీల నిర్వహణ, హరితహారం మొక్కల సంరక్షణ, పంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్వహణ, మొక్క చెరువుల నిర్మాణం, పూడికతీత పనులను గ్రామ సభలో ఆమోదించవచ్చు.
గ్రామ సభలే కీలకం..
పనుల గుర్తింపునకు పంచాయతీల్లో నిర్వహించే గ్రామసభలే కీలకం. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏఏ పనులు చేపట్టాలో సర్పంచ్, ఉపాధి ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు ఈ సభలో పాల్గొని పనులను గుర్తించి ఆమోదిస్తారు. గ్రామస్థాయిలో పూర్తి చేసిన ప్రణాళికను మండ ల పరిషత్, ఆ తరవాత జిల్లా పరిషత్కు పంపిస్తారు. ఆమోదించిన పనులు 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
నిధులన్నీ వినియోగించుకునేలా..
మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో ఉపాధి హామీ గ్రామసభలు నిర్వహించాం. గ్రామాల్లో ఆమోదించిన పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. ఈజీఎస్ ద్వారా కేటాయించిన నిధులన్నీ వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించేందుకు చర్యలు చేపడుతున్నాం.
-జానయ్య, ఎంపీడీఓ, మునుగోడు
అవగాహన కల్పిస్తున్నారు
ఉపాధిహామీ ఆధికారులు, పాలక వర్గం సభ్యులు గ్రామపంచాయతీలో సభ నిర్వహించి ఈ సంవత్సరంలో చేపట్టే పనులను గుర్తించారు. వంద రోజుల్లో ఉపాధి హామీ ద్వారా కూలీలు చేసే పనులు గుర్తించి చర్చించాం.ముఖ్యంగా గ్రామంలో ఏ పనులు చేపట్టాలి? రైతులకు ఉపయోగపడే పనుల వివరాలను అధికారులు రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నారు.
– బొల్లం భాగ్యమ్మ, గుండ్లోరిగూడెం